Business

తెలంగాణాలో నూతన రైల్వే ప్రాజెక్టులు

తెలంగాణాలో నూతన రైల్వే ప్రాజెక్టులు

తెలంగాణకు సంబంధించిన FLS మంజూరైన ప్రాజెక్టుల్లో.. మొదటిది దశాబ్దాలుగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ప్రజల ఆకాంక్షలను పూర్తిచేయనుంది. ఆదిలాబాద్, ఇచ్చోడ, నేరడిగొండ, నిర్మల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, నిజాంపేట్, సంగారెడ్డి మీదుగా పటాన్‌చెరు వరకు ఈ రైలు మార్గం ఉంటుంది. ఉత్తర తెలంగాణను ఇటు హైదరాబాద్‌తోనూ, ముంబై తోనూ, అటు నాగ్‌పూర్ మీదుగా దేశరాజధాని ఢిల్లీతో ఈ మార్గం అనుసంధానం చేస్తుంది. ఇది ఈ రెండు పాత జిల్లాల చిరకాల కోరిక. ఉత్తర తెలంగాణలో లైఫ్ లైన్ గా ఈ ప్రాజెక్ట్ మారుతుందని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధితోపాటుగా వ్యవసాయ ఉత్పత్తులను రైతులు మార్కెట్‌కు తరలించేందుకు వీలవుతుంది. ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు: 317 కి.మీ. అంచనా వ్యయం సుమారు: రూ. 5,706 కోట్లు.

రెండో మెగా ప్రాజెక్టు దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని అనుసంధానం చేస్తుంది. పాత వరంగల్ జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నుంచి.. కూసుమంచి, పాలేరు, మోతే, సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాల్‌కు ఈ ప్రాజెక్టు అనుసంధానం అవుతుంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ముఖ్యమైన ప్రాంతాలన్నీ ఈ కొత్త రైల్వే లైను ప్రాజెక్టు ద్వారా అనుసంధానం అవుతాయి. రైతుల మేలు కోసం కాటన్ ఎగుమతికి, బియ్యం రవాణాకు, గ్రానైట్ తరలింపునకు.. ఈ లైన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సింగరేణి కాలరీస్ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలను కలపడం ద్వారా వాణిజ్య అవసరాలకు కూడా ఈ రైల్వే లైన్ చాలా బాగా ఉపయోగ పడుతుంది. ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు: 296 కి.మీ, అంచనా వ్యయం సుమారు: రూ.5,330 కోట్లు.

మూడో కీలకమైన ప్రాజెక్టు కాచిగూడ (ఉందానగర్) నుంచి జగ్గయ్యపేట రంగారెడ్డి జిల్లా మీదుగా.. చిట్యాల, నకిరేకల్, మునుగోడు, సూర్యాపేట, జగ్గయ్యపేట నియోజకర్గాలను ఈ ప్రాజెక్టు అనుసంధానం చేస్తుంది. 65వ నెంబరు జాతీయ రహదారికి (విజయవాడకు వెళ్లే) సమాంతరంగా ఈ ప్రాజెక్టు ఉంటుంది. అంతేకాదు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీ రాజధాని అమరావతిలను కలిపే అతి తక్కువ దూరం కలిగిన రైల్వే మార్గం ఇది కాబోతున్నది. ఈ ప్రాంతంలో ప్రజారవాణాకు, వాణిజ్య అవసరాలకు ముఖ్యంగా.. సిమెంట్ ప్లాంట్లకు కొత్త లైన్ ద్వారా చాలా లబ్ధి జరుగుతుంది. ఈ ప్రాజెక్టు పొడవు: 228 కి.మీ, అంచనా వ్యయం సుమారు: రూ.4,104 కోట్లు.