Business

ప్యాకెట్‌లో బిస్కెట్ తక్కువ వచ్చినందుకు కంపెనీకి లక్ష జరిమానా-TNI నేటి వాణిజ్య వార్తలు

ప్యాకెట్‌లో బిస్కెట్ తక్కువ వచ్చినందుకు కంపెనీకి లక్ష జరిమానా-TNI నేటి వాణిజ్య వార్తలు

యాపిల్ ఫోన్లు ఆఫీస్ పనులకు ఉపయోగించవద్దు

 సాధారణంగా చైనా (China) ఉత్పత్తుల వాడకం పట్ల ఇతర దేశాలు భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తం చేస్తుంటాయి. అమెరికా, భారత్‌ సహా ఇదే కారణంతో కొన్ని కంపెనీల ఉత్పత్తులను, యాప్‌లను నిషేధించాయి కూడా. సరిగ్గా డ్రాగన్‌కు సైతం ఇప్పుడు అదే భయం పట్టుకుంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఆఫీసు పనులకు యాపిల్‌ ఐఫోన్లు (iPhones) సహా ఇతర ఏ విదేశీ బ్రాండ్‌ ఫోన్లూ వాడొద్దని చైనా తమ ఉద్యోగులకు సూచించినట్లు సమాచారం. వాటిని కార్యాలయాలకూ తీసుకురావొద్దని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది.చైనా ప్రభుత్వానికి చెందిన ఉన్నతోద్యోగులు ఈ మేరకు కింది స్థాయి ఉద్యోగులకు కొన్ని రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసినట్లు వాల్‌స్ట్రీట్‌ పేర్కొంది. యాపిల్ సహా ఇతర దేశాలకు చెందిన ఏ ఫోన్లనూ కార్యాలయాలకు తీసుకురాకూడదని సూచించినట్లు సమాచారం. యాపిల్‌తో పాటు ఏయే ఫోన్లను తీసుకురాకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నదీ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ స్పష్టంగా పేర్కొనలేదు. దీనిపై చైనా ప్రభుత్వ వర్గాలు అధికారికంగా స్పందించలేదు. యాపిల్‌కు అతిపెద్ద మార్కెట్లలో చైనా ఒకటి. దాదాపు ఐదో వంతు ఆదాయం చైనా నుంచే వస్తోంది. త్వరలో యాపిల్‌ తన ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్లను లాంచ్‌ చేయనున్న వేళ ఈ నిర్ణయం బయటకు రావడం గమనార్హం. ఇది ఇరు దేశాల మధ్య మరోసారి ఘర్షణపూరిత వాతావరణానికి దారితీసే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.చైనా కొన్నేళ్లుగా డేటా సెక్యూరిటీ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని కొత్త చట్టాలను తీసుకొచ్చింది. కంపెనీలకు కొన్ని నియమాలను నిర్దేశిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది మే నెలలో పెద్ద ప్రభుత్వరంగ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాంకేతికంగా ఆత్మనిర్భరతపై దృష్టి సారించాలని పేర్కొంది. వాణిజ్యం విషయంలో అమెరికా- చైనా మధ్య ఏళ్లుగా ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో చైనాకు చెందిన హువావే కంపెనీని అమెరికా బ్యాన్‌ చేసింది. టిక్‌టాక్‌పైనా నిషేధం విధించింది. ఇప్పుడు చైనా సైతం అదే చేస్తోంది. తాజా నిర్ణయం ఈ కోవలోకే వస్తుంది. ఇటీవల అమెరికా కామర్స్‌ సెక్రటరీ చైనాలో పర్యటించినప్పుడు చైనా పట్ల తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. డ్రాగన్ దేశంలో వ్యాపారం చేస్తున్న అమెరికా కంపెనీలపై జరిమానాలు, దాడులు జరుగుతున్నాయని తమకు ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.

మారుతీ సుజుకీ సంచలన నిర్ణయం

సొంతకారు అనేది ప్రతి మధ్య తరగతి ఉద్యోగి కల. కుటుంబం మొత్తం ఆనందంగా బయటకు వెళ్లడానికి అనువుగా ఉండే కారు కోసం చూస్తూ ఉంటారు. ముఖ్యంగా కారును కొనుగోలు సమయంలో బడ్జెట్‌ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే బడ్జెట్‌ ఫ్రెండ్లీ కార్ల కోసం వెతుకుతూ ఉంటారు. ఇలాంటి వారి కోసం భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారులలో ఒకటైన మారుతి సుజుకీ కంపెనీ ఇటీవల మారుతి టూర్ హెచ్1 ఆల్టోను విడుదల చేసింది. ఈ కారు ప్రత్యేకంగా వాణిజ్య ఉపయోగం కోసం రూపొందించారు. తక్కువ బడ్జెట్‌లో ఉన్నవారికి ఇది గొప్ప ఎంపిక. శక్తివంతమైన ఇంజిన్, ఆకట్టుకునే మైలేజీతో మారుతి టూర్ హెచ్‌1 ఆల్టో డబ్బుకు అద్భుతమైన విలువను అందిస్తుంది. మారుతి టూర్ హెచ్‌1 ఆల్టో కారులో 1.0ఎల్‌, కే-సిరీస్, డ్యూయల్‌జెట్, డ్యూయల్ వీవీటీ మోటారును అమర్చింది. ఈ ఇంజిన్ మృదువైన మరియు సమర్థవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని నిర్ధారిస్తుంది. ఇది సిటీ, హైవే డ్రైవింగ్ రెండింటికీ అనుకూలంగా ఉంటుంది.మారుతి టూర్ హెచ్‌1 ఆల్టో అద్భుతమైన ఇంధన సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. లీటరు పెట్రోల్‌పై సుమారుగా 32 కిలోమీటర్ల మైలేజీతో ఈ కారు మీ రోజువారీ ప్రయాణం లేదా సుదీర్ఘ ప్రయాణాల్లో మీకు డబ్బు ఆదా చేస్తుంది. ఇంధన వినియోగంపై అవగాహన ఉన్నవారికి ఇది ఆదర్శవంతమైన ఎంపికగా ఉంటుందని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మారుతి తన కస్టమర్ల బడ్జెట్ పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఈ కారును దాదాపు రూ. 4.80 లక్షలకే అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఎలాంటి ఈఎంఐ అవసరం లేకుండా మంచి కారును సొంతం చేసుకునే వారికి చాలా మంచి ఎంపికగా ఉంటుంది.మారుతి టూర్ హెచ్‌1 ఆల్టో మూడు ఆకర్షణీయమైన రంగు ఎంపికల్లో అందుబాటులో ఉంటుంది. గ్రానైట్ గ్రే, మెటాలిక్ సిల్కీ సిల్వర్, ఆర్కిటిక్ వైట్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇది కొనుగోలుదారులు వారి ప్రాధాన్యతలకు, శైలికి సరిపోయే రంగును ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. మారుతి టూర్ హెచ్‌1 ఆల్టో అనేది బడ్జెట్-స్నేహపూర్వక వాణిజ్య కారు. ఇది డబ్బుకు గొప్ప విలువను అందిస్తుంది. శక్తివంతమైన ఇంజన్, ఆకట్టుకునే మైలేజీ మరియు సరసమైన ధరతో ఇది తక్కువ బడ్జెట్‌లో వినియోగదారులకు ఆదర్శవంతమైన ఎంపికగా ఉంటుంది.

అగ్రిగోల్డ్ కుంభకోణంపై ఈడీ ఛార్జిషీట్ 

అగ్రిగోల్డ్ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఏవీ రామారావు, శేషునారాయణరావు, హేమసుందర వరప్రసాద్‌ పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ సహా 11 అనుబంధ కంపెనీలపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు విచారణకు స్వీకరించింది. అక్టోబరు 3న కోర్టుకు హాజరుకావాలని అగ్రిగోల్డ్ ప్రమోటర్లు, కంపెనీల ప్రతినిధులకు కోర్టు సమన్లు జారీ చేసింది. 32 లక్షల మంది డిపాజిటర్లను రూ.6,380 కోట్ల మేర మోసం చేసినట్లు అగ్రిగోల్డ్‌పై అభియోగాలు దాఖలయ్యాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రూ.4,141 కోట్ల మేర ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది.

* నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తారీకున సవరిస్తుంటారు. అయితే చాలా రోజుల తర్వాత గృహ వినియోగ గ్యాస్ ధరలను తగ్గించి సామాన్యులకు కాస్త ఊరట కలిగించిన విషయం తెలిసిందే. అలాగే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ రేట్లను తగ్గించారు.హైదరాబాద్: రూ. 966,వరంగల్: రూ. 974,విశాఖపట్నం: రూ. 912,విజయవాడ: రూ.927 గుంటూర్: రూ. 944.

* హల్దీరామ్స్‌లో భారీ వాటాను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ 

ప్రముఖ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్‌ (Tata group) ప్యాకేజీ ఫుడ్‌ బిజినెస్‌పై కన్నేసింది. స్నాక్స్‌ తయారు చేసే హల్దీరామ్స్‌ (Haldirams) కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాల తెలిపాయి. అయితే, హల్దీరామ్స్‌ వాల్యుయేషన్‌ అధికంగా పేర్కొంటుండడంపై టాటా గ్రూప్‌ అనాసక్తి వ్యక్తం చేస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.హల్దీరామ్స్‌లో 51 శాతం వాటాల కొనుగోలుకు టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ కంపెనీ.. ఆ సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే, హల్దీరామ్ 10 బిలియన్‌ డాలర్ల వాల్యుయేషన్‌గా పేర్కొన్నట్లు సమాచారం. దీంతో హల్దీరామ్ చెప్తున్న విలువ చాలా ఎక్కువగా ఉందని టాటా పేర్కొన్నట్లు తెలిసింది. అయితే, ఈ వ్యవహారాన్ని మార్కెట్‌ ఊహాగానాలుగా టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ ప్రతినిధి కొట్టిపారేశారు. అటు.. హల్దీరామ్స్‌ దీనిపై స్పందించేందుకు నిరాకరించింది.ఒకవేళ టాటా-హల్దీరామ్స్‌ చర్చలు సఫలీకృతమైతే.. స్నాక్స్ మార్కెట్‌లో లేస్‌ పేరిట స్నాక్స్‌ను విక్రయిస్తున్న పెప్సీకి టాటా గ్రూప్‌ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. మరోవైపు 10 శాతం వాటా విక్రయానికి ప్రైవేటు ఈక్విటీ సంస్థ బెయిన్‌ క్యాపిటల్‌తో సైతం హల్దీరామ్స్‌ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం టాటా గ్రూప్‌ టెట్లీ, టాటా సాల్ట్‌, హిమాలయన్‌ పేరిట ఉత్పత్తులను విక్రయిస్తోంది. 1937లో ఓ చిన్న షాప్‌గా ప్రారంభమైన హల్దీరామ్స్‌.. ఇప్పుడు దేశంలో అతిపెద్ద స్నాక్స్‌ కంపెనీగా అవతరించింది. ఈ సెగ్మెంట్‌లో 13 శాతం మార్కెట్‌ వాటా ఉంది. సింగపూర్‌, యూఎస్‌ సహా ఇతర మార్కెట్లలోనూ హల్దీరామ్స్‌ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.

* నేడు పెట్రోల్ డీజిల్ ధరలు

గత కొంత కాలం నుంచి ఫ్యూయల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరలు మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.109 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 97 గా ఉంది. రెండు తెలుగు రాష్టాలలో పెట్రోల్, డీజిల్ ధరలను ఒకసారి పరిశీలిస్తే..హైదరాబాద్:లీటర్ పెట్రోల్ ధర రూ.109,లీటర్ డీజిల్ ధర రూ.98 విశాఖపట్నం:లీటర్ పెట్రోల్ ధర రూ. 110,లీటర్ డీజిల్ ధర రూ. 98,విజయవాడ:లీటర్ పెట్రోల్ ధర రూ. 111,లీటర్ డీజిల్ ధర రూ. 99.

ప్యాకెట్‌లో బిస్కెట్ తక్కువ వచ్చినందుకు కంపెనీకి లక్ష జరిమానా

 ప్యాకెట్‌పై నిర్దేశించిన విధంగా కాకుండా అందులో బిస్కెట్‌ల (Biscuit) సంఖ్య తక్కువగా ఉండటాన్ని వినియోగదారుల ఫోరం (Consumer Forum) తీవ్రంగా పరిగణించింది. బిస్కెట్‌ ప్యాకెట్‌పై పేర్కొన్న దానికంటే అందులో ‘ఒకటి’ తక్కువగా ఉండటాన్నీ తప్పుపట్టింది. వాణిజ్య కార్యకలాపాల్లో అనుచితంగా వ్యవహరించినందుకుగాను వినియోగదారుడికి రూ.లక్ష పరిహారం (Compensation) చెల్లించాలని సదరు బిస్కెట్‌ తయారీ సంస్థను ఆదేశించింది. అంతేకాకుండా ఆ బ్యాచ్‌ బిస్కెట్ల విక్రయాన్ని నిలిపివేయాలని స్పష్టం చేసింది.బిస్కెట్‌ ప్యాకెట్‌పై 16 అని పేర్కొన్నప్పటికీ.. అందులో కేవలం 15 మాత్రమే ఉన్నాయని ఆరోపిస్తూ చెన్నైకి చెందిన డిల్లిబాబు అనే వ్యక్తి స్థానిక జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. అక్రమ వ్యాపార పద్ధతులకు అవలంబిస్తున్న కంపెనీతోపాటు విక్రయించిన స్టోర్‌పై రూ.100 కోట్లు జరిమానా విధించడంతోపాటు తనకు రూ.10 కోట్ల పరిహారం చెల్లించేలా ఆదేశించాలని అభ్యర్థించాడు. అయితే, సదరు తయారీ సంస్థ ఐటీసీ మాత్రం అతడి వాదనతో విభేదించింది. అందులో ఉన్న బిస్కెట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవద్దని, బరువు ఆధారంగానే దాన్ని విక్రయిస్తామని వినియోగదారుల ఫోరంలో వాదించింది. తూనికలు కొలతల శాఖ నిబంధనలకు లోబడే దాని బరువు ఉందని.. అందులో ఎటువంటి లోపమూ లేదని తయారీ సంస్థ తెలియజేసింది.కానీ, కంపెనీ వాదనను జిల్లా వినియోగదారులు వివాదాల పరిష్కార వేదిక తోసిపుచ్చింది. కవర్‌పై బిస్కెట్‌ల సంఖ్యను స్పష్టంగా పేర్కొన్నందున.. కచ్చితంగా దాని ఆధారంగానే వినియోగదారుడు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని ఫోరం అభిప్రాయపడింది. తయారీ సంస్థ సేవా లోపంతో పాటు వినియోగదారుడిని తప్పుదోవ పట్టించినట్లేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో వినియోగదారుడికి రూ.లక్ష పరిహారంతోపాటు కోర్టు ఖర్చుల కింద మరో రూ.10 వేలు చెల్లించాలని ఆదేశించింది. అయితే, ఈ కేసులో బిస్కెట్‌ విక్రయించిన సదరు స్టోర్‌ లోపం ఏమీ లేనందున వారిపై ఫిర్యాదును కొట్టివేస్తున్నట్లు తెలిపింది.

* లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ ఈక్విటీ మార్కెట్లు అనూహ్యంగా వరుస నాలుగో సెషన్‌లో లాభాలను సాధించాయి. బుధవారం ట్రేడింగ్‌లో రోజంతా నష్టాల్లో ర్యాలీ చేసిన సూచీలు చివరి గంటలో లాభాల్లోకి మళ్లడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా ప్రపంచ వృద్ధిపై పెరిగిన ఆందోళనలతో ఉదయం నుంచి బలహీనంగా ఉన్న మన మార్కెట్లు చివరి గంటలో కీలక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్ కంపెనీల షేర్లలో కొనుగోళ్ల జోరు కారణంగా లాభాలకు మారాయి.దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 100.26 పాయింట్లు లాభపడి 65,880 వద్ద, నిఫ్టీ 36.15 పాయింట్లు పెరిగి 19,611 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాలు రాణించాయి. పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, మెటల్ రంగాలు బలహీనపడ్డాయి.సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, టైటాన్, అల్ట్రా సిమెంట్, ఐటీసీ, సన్‌ఫార్మా కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకి స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.13 వద్ద ఉంది.

 పోస్టాఫీస్ సూపర్ స్కీమ్

ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన పోస్టాఫీస్ ప్రజలకు ఎన్నో అద్భుతమైన పథకాలను అందిస్తుంది.. వీటిల్లో డబ్బులను పెడితే ఎటువంటి రిస్క్ లేకుండా మంచి లాభాలను పొందవచ్చు.. మీరు పెట్టిన డబ్బులకు రిస్క్ ఉండదని చెప్పుకోవచ్చు. అదే బ్యాంకుల్లో డబ్బులు పెడితే రూ.5 లక్షల వరకే హామీ ఉంటుంది. పోస్టాఫీస్ అందిస్తున్న స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో కిసాన్ వికాస్ పత్ర కూడా ఒకటి. కేవీపీ స్కీమ్‌లో డబ్బులు పెడితే రెట్టింపు రాబడి పొందొచ్చు.. అంటే మీ అమౌంట్ కు డబుల్ అని.. అయితే ఈ స్కీమ్ 115 నెలలు మెచ్యూరిటీ సమయం.. ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలు.కిసాన్ వికాస్ పత్ర పథకంలో చేరాలంటే కనీసం రూ.1000 ఉంటే సరిపోతుంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఎంత డబ్బు అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. 115 నెలల్లో డబ్బు రెట్టింపు అవుతుంది. అంటే రూ.5 లక్షలు పెడితే.. రూ.10 లక్షలు అవుతుంది.. మీరు మీ దగ్గరలోని పోస్టాఫీస్ ఆఫీస్ కు వెళ్లి ఈ స్కీమ్ లో చేరవచ్చు.ఉదాహరణకు మీరు ఈ కీమ్‌లో రూ. 5 లక్షలు పెడితే.. మీకు రూ.10 లక్షలకు పైగా వస్తాయి. రిస్క్ లేకుండానే రాబడి సొంతం చేసుకోవచ్చు.. ఇదే కాదు మరో స్కీమ్ కూడా ఉంది.. రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఉంది. ప్రతి నెలా చిన్న మొత్తంలో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఇది బెస్ట్ స్కీమ్.. 6.5 శాతం వడ్డీని పొందవచ్చు.. అదే విధంగా నేషనల్ సేవింగ్స్ టటమ్ డిపాజిట్ కూడా ఉంది. సకమ్ మెచ్యూరిటీ ఏడది నుంచి ఐదేళ్ల వరకు టుంది. టెన్యూర్ ఆధారంగా వడ్డీ రేటు మారుతుంది. ఏడాది టెన్యూర్ అయితే 6.9 శాతం వడ్డీ పడుతుంది. రెండేళ్ల టెన్యూర్ అయితే 7 శాతం వడ్డీ లభిస్తుంది. మూడేళ్ల టెన్యూర్‌పై 7 శాతం వడ్డీ వస్తుంది. ఇక ఐదేళ్ల టెన్యూర్‌పై 7.5 శాతం వడ్డీ వస్తోంది. అంటే టెన్యూర్ ఆధారంగా మీకు వచ్చే రాబడి కూడా పెరుగుతుంది.. ఇవేకాదు పోస్టాఫీస్ లో ఇంకా ఎన్నో స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయి.. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చెయ్యండి..