DailyDose

తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా

తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా

తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. దీంతో రాష్ట్రంలో జరిగే పలు పరీక్షలు వాయిదే పడే ఛాన్స్ ఉంది. నవంబర్ లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్ష రెండోసారి వాయిదాపడనుంది. దీంతో అదే నెలలో జరగాల్సి ఉన్న డీఎస్సీ పరీక్ష కూడా వాయిదా పడే ఛాన్స్ ఉంది. అయితే డీఎస్సీ మొత్తం వాయిదా వేయాలా…లేదంటే ఎస్జీటీ పరీక్ష మాత్రమే పోస్ట్ పోన్డ్ చేయాలన్న విషయంపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోవల్సి ఉంది.

ఇక ఈ పరీక్షలు రీషెడ్యూల్ కోసం టీఎస్పీఎస్సీ విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టాయి. త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. గతేడాది 783 పోస్టుల భర్తీకి గ్రూప్ 2 నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. అప్పట్లో ఆగస్టు 29,30 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఒకేసారి గురుకుల, ఇతర పరీక్షల షెడ్యూల్ రావడంతో గ్రూప్ 2 వాయిదా కోసం అభ్యర్థలు ఆందోళన బాట పట్టారు. దీంతో నవంబర్ 2,3 తేదీ గ్రూప్ పరీక్ష నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది. అయితే ప్రస్తుతం పరీక్షలకు నెలరోజుల గడువు ఉంది. ఈ తరుణంలో సోమవారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించింది.

దీంతో నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా షురూ కావాల్సి ఉంది. దీంతో టీఎస్పీఎస్సీ అధికారుల్లో అయోమయం నెలకొంది. గ్రూప్ 2 పరీక్షకు 5లక్షల పైగానే అభ్యర్థలు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాల్సి ఉంది. 25వేలపైగానే పోలీసులతో పాటు రెవెన్యూ సిబ్బంది అవసరం ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ మొదలయ్యింది. దీంతో పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఎన్నికల ప్రక్రియలోనే బిజీగా ఉండనున్నారు. కాగా నవంబర్ లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాతే ఈ పరీక్ష నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తోంది.

అటు అసెబ్లీ ఎన్నికల ప్రభావం డీఎస్సీ పై కూడా పడ్డది. రాష్ట్రంలో 5వేలు పైగా టీచర్ పోస్టుల భర్తీకి ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో ఈ పరీక్షల తేదీలు మారే ఛాన్స్ ఉంటుంది. నవంబర్ 30న పోలింగ్ నేపథ్యంలో ఆ తేదీకి ముందు 4రోజులు తర్వాత 4 రోజుల పాటు ఎలాంటి పరీక్షలు నిర్వహించే అవకాశం లేదని అధికారులు అంటున్నారు.