Politics

జానారెడ్డిని కలిసిన రేవంత్

జానారెడ్డిని కలిసిన రేవంత్

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కె.జానారెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంను జానారెడ్డి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు గంటసేపు వీరిద్దరూ వివిధ అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా జానారెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ను కలిశారు.

అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి అందరూ సహకరించాలని కోరారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజాభిమానం సొంతం చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించానని తెలిపారు. ‘‘సీఎం, మంత్రులు ఐకమత్యంతో పనిచేయాలి. నేను ప్రభుత్వంలో భాగస్వామిని కాను.. అంత అవసరం లేదు. ప్రజలు ఇచ్చిన ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని వారికి సూచించా. మాజీ సీఎం కేసీఆర్‌కు గాయం కావడం బాధాకరం. నేను ఆయన్ను పరామర్శించా. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తన సూచనలు ఇవ్వాలి.

పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తా
నల్గొండ పార్లమెంట్‌కి పోటీ చేస్తా అని గతంలో అన్నాను. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాను. ఉమ్మడి రాష్ట్రంలో 15 ఏళ్లు మంత్రిగా ఉన్నా. నా కుమారుడు జైవీర్‌కు పదవి ఇవ్వాలని అడగలేదు. ప్రస్తుతం అతడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఇంకా జూనియర్‌.. ఇప్పుడే పదవులు అడగలేం. ఇవ్వడం కూడా సమంజసం కాదు’’ అని జానారెడ్డి అన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z