Politics

విద్యుత్‌ శాఖలో అప్పులకన్నా.. ఆస్తులే ఎక్కువ!

విద్యుత్‌ శాఖలో అప్పులకన్నా.. ఆస్తులే ఎక్కువ!

తెలంగాణ బలి దేవత ఎవరో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌. బలిదానం, నియంతృత్వం గురించి కాంగ్రెస్‌ మాట్లాడం హస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారాయన. కాంగ్రెస్‌ పాలనలో కరెంట్ షాక్‌తో 8వేలపైనే రైతులు చనిపోయారని విమర్శించారు. విద్యుత్‌ శాఖ 85 వేల కోట్ల అప్పులో ఉందని అసత్య ప్రచారం చేస్తున్నారన్న కేటీఆర్.. 2014కు ముందు ట్రాన్స్‌కో, జెన్‌కోకు అప్పులు ఉన్నాయని.. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిస్కంల ఆస్తులు రెట్టింపు చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. విద్యుత్‌ ఆస్తుల విలువు రూ. 1.37 లక్షల కోట్లు కాగా.. విద్యుత్‌ శాఖలో అప్పులకన్నా.. ఆస్తులే ఎక్కువ ఉన్నాయని స్పష్టం చేశారు.

తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలోనే నంబర్‌ వన్‌గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని.. విద్యుత్‌ సబ్‌ స్టేషన్లను గణనీయంగా పెంచింది తమ ప్రభుత్వమేనని అన్నారు కేటీఆర్‌. విద్యుత్‌ వినియోగం కూడా అభివృద్దికి కొలమానం అని చెప్పుకొచ్చారాయన. మోటర్లకు మీటర్లు పెట్టం అని తెగేసి చెప్పాం.. మరి కాంగ్రెస్‌ మోటర్లకు మీటర్లు పెట్టమని చెబుతుందా? అని ప్రశ్నించారు కేటీఆర్‌. వ్యవసాయం, గృహాలు, పరిశ్రమలకు 24 గంటల కరెంటు ఇవ్వాలన్నారు. సివిలై సప్లై శాఖలో 56 వేల కోట్ల అప్పులు ఉన్నాయని.. నిన్న గవర్నర్‌ తమిళిసై చెప్పారన్న కేటీఆర్‌.. రాష్ట్రం దివాలా తీయలేదు.. దివాలకోరు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అప్పు అంటారు గానీ.. ఆస్తుల గురించి ఎందుకు చెప్పట్లేదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తమ పాలనలో రాష్ట్రానికి అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ సమకూరాయని కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z