Business

భారీగా పెరిగిన బులియన్ ధరలు-BusinessNews-Mar 21 2024

భారీగా పెరిగిన బులియన్ ధరలు-BusinessNews-Mar 21 2024

* గతంలో మెసేజ్ పంపాలంటే ఎస్ఎంఎస్‌లు.. లేదంటే ఈ-మెయిల్స్ ద్వారా సమాచారం మార్పిడి చేసుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్.. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌లు వచ్చిన తర్వాత సమాచారం మార్పిడి తేలికవుతూ వచ్చింది. తాజాగా వాట్సాప్‌లో సుదీర్ఘ సందేశం పంపాలంటే ఆడియో వాయిస్ సందేశం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అయినా కొన్ని పరిమితులు ఉన్నాయి. వాయిస్ నోట్ అందగానే వెంటనే అది ప్లే చేసి వినలేని పరిస్థితులు ఉంటాయి. దీనికి పరిష్కారం కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ సిద్ధం చేస్తున్నదని వాబీటా ఇన్ఫో తెలిపింది.

* వచ్చే జూన్ లో 25 బేసిక్ పాయింట్లు కీలక వడ్డీరేట్లు తగ్గి్స్తామని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన ప్రకటన ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చింది. ఫలితంగా దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. బంగారం ఫ్యూచర్స్ మార్కెట్లో (ఎంసీఎక్స్) తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.1,193 పెరిగింది. ఈ ఏడాది మూడు దఫాలు వడ్డీరేట్లు తగ్గించేందుకు సిద్ధమని జెరోమ్ పావెల్ సంకేతాలు ఇచ్చారు. దీంతో పది గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర సుమారు 1.8 శాతం పెరిగి రూ.66,943వద్ద స్థిర పడింది. మరోవైపు ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూ.3,010 (నాలుగు శాతం) పెరిగి రూ.78,323 వద్ద నిలిచింది. మధ్యాహ్నం 3.20 గంటల సమయంలో రూ.930 పుంజుకుని 76,243 వద్ద ముగిసింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు.. దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. రోజంతా మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్‌ 72,507.36 పాయింట్ల వద్ద లాభంతో మొదలైంది. ఇంట్రాడేలో 72,416.03 పాయింట్ల కనిష్ఠానికి చేరుకున్న సెన్సెక్స్‌.. 72,882.46 పాయింట్ల గరిష్ఠానికి పెరిగింది. చివరకు 539.50 పాయింట్ల నష్టంతో 72,641.19 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరో వైపు నిఫ్టీ 172.85 పాయింట్లు పెరిగి 22,011.95 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 2,591 షేర్లు పెరగ్గా.. మరో 766 పతనమయ్యాయి. 88 యథావిధిగా కొనసాగాయి. నిఫ్టీలో టాప్ గెయినర్స్‌గా బీపీసీఎల్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా నిలిచాయి. టాప్‌ లూజర్స్‌గా భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఓఎన్‌జీసీ, మారుతి సుజూకీ, ఐసీఐసీ బ్యాంక్‌ నష్టాల్లో ముగిశాయి. అన్ని రంగాలు గ్రీన్‌లో ముగిశాయి, నిఫ్టీ పీఎస్‌ఈ ఇండెక్స్ 3.5 శాతం పెరిగి టాప్ సెక్టోరల్ గెయినర్‌గా నిలిచింది.

* ఈ నెల మార్చి 31తో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగియనున్నది. ఈ నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే బ్యాంకులు యథావిధిగా పని చేయాలని చెప్పింది. వాస్తవానికి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఏప్రిల్‌ ఒకటిన బ్యాంకులు సెలవుగా పరిగణిస్తుంటాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో బ్యాంకులు తెరిచే ఉంచాలని చెప్పింది. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ప్రభుత్వానికి చెందిన ఆర్థిక లావాదేవీలు, చెల్లింపులు అధికంగా ఉండే అవకాశం ఉందన్న కేంద్రం ప్రభుత్వ సూచనల మేరకు బ్యాంకులను ఓపెన్‌ చేసి ఉంచాలని ఆర్‌బీఐ బ్యాంకులు సూచించింది. ఆర్‌బీఐ ఐదేశాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు యథావిధిగా ఆదివారం రోజున పని చేయనున్నాయి. అదే సమయంలో ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఆదాయపు పన్నుశాఖ సైతం కార్యాలయాలకు వారాంతపు సెలవులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఆర్‌బీఐ ఆదేశాల నేపథ్యంలో బీఓబీ, బీఓఐ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్‌, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్‌, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌, పంజాబ్ అండ్ సింధ్‌ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్‌, యూబీఐ వంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు తెరిచే ఉండనున్నాయి.

* వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేసినందుకుగాను పతంజలి ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పింది. అసత్య ప్రచారాలను వెంటనే నిలిపేయాలంటూ సుప్రీంకోర్టు గతంలోనే కంపెనీ ప్రతినిధులను ఆదేశించింది. ఈమేరకు సంస్థ వ్యవస్థాపకులు రామ్‌దేవ్‌ బాబా, మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు నోటీసులు పంపింది. అయితే నోటీసులకు సమాధానం చెప్పకపోవడంతో కోర్టు మరోసారి మందలించింది. దాంతో డైరెక్టర్‌ బాలకృష్ణ సర్వోన్నత​ న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పారు.

* రైల్వే స్టేషన్లలో జనరల్‌ టికెట్‌ బుకింగ్‌ కౌంటర్ల వద్ద ప్రయాణికులకు నగదు చెల్లింపుల్లో ఇబ్బందులకు దక్షిణ మధ్య రైల్వే చెక్‌ పెట్టింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా టికెట్లకు నగదు చెల్లించుకొనే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈవిషయాన్ని దక్షిణ మధ్య రైల్వే ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించింది. అధికారులు తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రయాణికులకు కౌంటర్ల వద్ద ఎదురయ్యే చిల్లర ఇబ్బందులు ఇకపై తప్పనున్నాయి. అన్‌రిజర్వుడ్‌, ప్లాట్‌ఫాం టికెట్ల కొనుగోలుకు రైల్వేస్టేషన్లలో ఉన్న ఆటోమేటిక్‌ టికెట్ వెండింగ్ మెషిన్‌ (ఏటీవీఎం)లో క్యూఆర్‌ (క్విక్‌ రెస్పాన్స్‌) కోడ్‌తో డబ్బులు చెల్లించే సౌకర్యాన్ని రెండేళ్ల క్రితం ద.మ.రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో వినియోగదారులు తమ సెల్‌ఫోన్‌లోని యూపీఐ యాప్‌ల ద్వారా ఏటీవీఎంలోని క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేసి డబ్బు చెల్లిస్తుండేవారు. ఈ నేపథ్యంలోనే తాజాగా యూటీఎస్‌ (జనరల్ బుకింగ్) కౌంటర్లలోనూ క్యూఆర్ కోడ్ సౌకర్యం తీసుకురావడంతో అన్‌ రిజర్వ్ టిక్కెట్లు కొనుగోలు మరింత సులభతరం కానుంది.

* ప్రముఖ వాహనాల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) కార్ల ధరల పెంపునకు సిద్ధమైంది. కారు ధరల్ని 3 శాతం వరకు పెంచనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కొత్త ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z