Business

మహిళా జర్నలిస్టుకు ఎమిరేట్స్ సిబ్బంది చేతిలో చేదు అనుభవం

మహిళా జర్నలిస్టుకు ఎమిరేట్స్ సిబ్బంది చేతిలో చేదు అనుభవం

ఎమిరేట్స్‌కి చెందిన విమానంలో ప్రయాణించిన ఓ మహిళా జర్నలిస్టుకు చేదు అనుభవం ఎదురైంది. విమాన సిబ్బంది తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని సోషల్‌మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. సృష్టి అనే మహిళా జర్నలిస్టు ఇటీవల ఎమిరేట్స్‌కు చెందిన ఓ విమానంలో ప్రయాణించారు. తాను కాస్తా లావుగా ఉండడంతో విమాన సిబ్బంది తనతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా పేర్కొన్నారు. ఈ ఘటన దిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకున్నట్లు వివరించారు. తనకు సరైన సీటు కేటాయించకపోవడంతో రాత్రి ప్రయాణంలో ఎంతో ఇబ్బందిపడినట్లు తెలిపారు. అక్కడున్న గ్రౌండ్‌ సిబ్బంది సైతం తనతో ప్రవర్తించిన తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.

సిబ్బంది ప్రవర్తనపై ఆమె కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలిపారు. వైరల్‌గా మారిన ఈ పోస్టుపై స్పందించిన నెటిజన్లు ఆమెకు మద్దతు తెలిపారు. ‘‘ఎమిరేట్స్‌ సిబ్బంది తీరు ఆమోదయోగ్యంగా లేదు’’ అని ఒకరు.. ‘‘మహిళా ప్రయాణికురాలితో ఈవిధంగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి’’ అని మరొకరు పోస్టు చేశారు. ‘‘ఎమిరేట్స్‌ అందిస్తున్న సేవలు ఎంతో బాగుంటాయి.. కానీ, సిబ్బంది చర్య అవమానకరం’’ అంటూ మరో నెటిజన్‌ అసహనం వ్యక్తంచేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z