DailyDose

1400కిలోల బంగారం పట్టివేత-Apr 15 2024

1400కిలోల బంగారం పట్టివేత-Apr 15 2024

* ద్విచక్రవాహనాన్ని కారుతో ఢీకొట్టిన డ్రైవర్‌.. వాహనంపై పడిన మృతదేహంతో 18కి.మీ దూరం ప్రయాణించిన దారుణం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం వై.కొత్తపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన జిన్నే ఎర్రిస్వామి(35) ట్రాక్టర్‌ మెకానిక్‌. ఆత్మకూరు మండలంలోని పి.సిద్దరాంపురానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకొని అనంతపురంలో స్థిరపడ్డారు. వ్యక్తిగత పనులపై పి.సిద్దరాంపురం వెళ్లి ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణమయ్యారు. వై.కొత్తపల్లి సమీపంలోకి రాగానే కళ్యాణదుర్గం వైపు వెళుతున్న కారు.. ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వెళ్లి ఢీకొంది. దీంతో ఎర్రిస్వామి ఎగిరి కారుపైన పడిపోయారు. గమనించని డ్రైవర్‌ వేగంగా కళ్యాణదుర్గం వైపు వెళ్లాడు. బెళుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి వద్ద కారుపై వ్యక్తి పడి ఉండటాన్ని వాహనదారులు గమనించి, అడ్డంగా వెళ్లి ఆపించారు. డ్రైవర్‌ కారును వదిలి పరారయ్యాడు. కారు బెంగళూరుకు చెందినదిగా గుర్తించారు. డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

* అవినీతికి పాల్పడుతున్న పలువురు అధికారుల్ని వివిధ చోట్ల తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.18 వేలు లంచం తీసుకుంటూ నల్గొండ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సోమశేఖర్‌ ఏసీబీకి చిక్కారు. ఆస్పత్రిలో ఫార్మసీకి అనుమతి ఇచ్చేందుకు లంచం డిమాండ్‌ చేయగా.. సమాచారం అందుకున్న అధికారులు పక్కా ప్రణాళికతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆర్టీసీ డ్రైవర్‌పై శాఖా పరమైన కేసు కొట్టివేసేందుకు హుజూరాబాద్‌ ఆర్టీసీ డిపో మేనేజర్‌ రూ. 20 వేలు లంచం డిమాండ్‌ చేశారు. ఎల్కతుర్తి హోటల్‌లో ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా.. రంగంలోకి దిగిన ఏసీబీ ఆయన్ని అరెస్టు చేసింది. ఆసిఫాబాద్‌లో ఎస్సై రాజ్యలక్ష్మి రూ. 25వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి ఆమె రూ.40 వేలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

* తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. శ్రీపెరుంబుదూర్‌-కుండ్రత్తూర్‌ రహదారిలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ శనివారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టింది. అటుగా వచ్చిన ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ లారీ, మినీ కంటెయినర్‌ లారీలను సోదా చేశారు. ఓ లారీలో 1000 కిలోలు, మరో వాహనంలో 400 కిలోల బంగారం గుర్తించారు. స్వాధీనం చేసుకుని వివరాలు ఆరా తీశారు. బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీపెరుంబుదూర్‌ సమీప మన్నూర్‌లోని ఓ గోదాముకు తరలిస్తున్నట్లు తెలిసింది. 400 కిలోలకు ఆధారాలు ఉన్నాయని మిగిలినదానికి లేనట్లు తెలిసింది. అధికారులు చెన్నై విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులను సంప్రదించారు.

* బ్యాంకులను మోసం చేసిన కేసులో రఘురామ కృష్ణంరాజు దర్యాప్తుపై స్టేను ఎత్తేయాలని సుప్రీంకోర్టుకు సీబీఐ వెల్లడించింది. బ్యాంకులకు రుణం ఎగవేత కేసుపై దర్యాప్తు కొనసాగిస్తామని సీబీఐ కోరింది. ఇందులో భాగంగా క్రిమినల్‌, సివిల్‌ కేసులపై దర్యాప్తు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ​కాగా, రఘురామ కృష్ణంరాజు బ్యాంకులకు మోసం చేసిన కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సంద్భంగా సీబీఐ తన వాదనలు వినిపించింది. ఈ క్రమంలో రఘురామ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నాన్‌ మిసిలేనియస్‌ రోజుల్లో విచారణ జరిపాలని కోరారు. దీంతో, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది జస్టిస్‌ బీఆర్‌. గవాయి, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం. అయితే, రఘురామ కృష్ణంరాజు థర్మల్‌ పవర్‌ కంపెనీ స్థాపిస్తామని బ్యాంకుల నుంచి రూ.974 కోట్లు రుణం తీసుకున్నారు. ఇన్డ్‌-భారత్‌ కంపెనీ పేరుతో రఘురామ పెత్తనం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. కంపెనీ కోసం నిధులు ఖర్చు చేయకుండా ఆ డబ్బును ఇతర బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. ఆ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను తనఖా పెట్టి రఘురామ మళ్లీ రుణం తీసుకున్నారు. ఈ రుణాన్ని దారి మళ్లించడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 120బీ, 420, 467, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీనిపైనే దర్యాప్తు కొనసాగుతోంది.

* తన ప్రియురాలు జూనియర్‌ డాక్టర్‌తో స్నేహంగా ఉండటంపై ఒక వ్యక్తి ఆగ్రహించాడు. ఆమె చనువుగా ఉంటున్న ఆ డాక్టర్‌పై కాల్పులు జరిపి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అయితే గురి తప్పడంతో ఆ జూనియర్‌ డాక్టర్‌ బతికిపోయాడు. (Man Tries To Kill Doctor) తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. 26 ఏళ్ల రోహన్, మద్రాస్ మెడికల్ కాలేజీలో పీజీ వైద్య విద్యార్థి. రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో జూనియర్‌ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం టీ తాగేందుకు క్యాంపస్‌ సమీపంలోని టీస్టాల్‌కు వెళ్లాడు. కాగా, రోహన్‌ను ఇద్దరు వ్యక్తులు అనుసరించారు. వారిలో ఒకరు గన్‌తో అతడిపైకి కాల్పులు జరిపాడు. అయితే గురి తప్పడంతో రోహన్‌కు ఏమీ కాలేదు. కాల్పులను గమనించిన స్థానికులు ఒకర్ని పట్టుకోగా మరో వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు పట్టుకున్న రితిక్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం ద్వారా హత్యకు కుట్ర పన్నిన అమిత్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. మరోవైపు నిందితులిద్దరూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తులని పోలీసులు తెలిపారు. ప్రియురాలైన పీజీ మెడికల్‌ విద్యార్థిని తనతో మాట్లాడకపోవడంపై అమిత్ కుమార్ ఆగ్రహించినట్లు చెప్పారు. రోహన్‌తో ఆమె స్నేహంగా ఉండటంతో అనుమానించి అతడ్ని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు వెల్లడించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z