NRI-NRT

చైనా జనాభా 58 కోట్లు!

చైనా జనాభా 58 కోట్లు!

2100 నాటికి భారీగా తగ్గుదల
1.15 శాతానికి తగ్గిన సంతానోత్పత్తి రేటు
2021లో పెరిగింది 4.80 లక్షలే..
షాంఘై అకాడమీభారత్‌ జనాభా కూడా తగ్గొచ్చు..
2100 కి 109 కోట్లేఐనా ప్రపంచంలో నంబర్‌వన్‌..
వాషింగ్టన్‌ వర్సిటీ లెక్కలు

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో విస్మయకర పరిణామం! అక్కడి జనాభా భారీగా తగ్గుముఖం పడుతోంది. 2021లో 141.21 కోట్ల నుంచి 141.26 కోట్లకు చేరినా.. పెరిగింది కేవలం 4,80,000 మందేనని చైనా జాతీయ గణాంకాల విభాగం తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2029 నాటికి తమ దేశ జనాభా 144 కోట్లకు చేరుతుందని ‘షాంఘై అకాడమీ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌’ 2019లో అంచనా వేసింది. 2021 తర్వాత జనాభా క్షీణత 1.1 శాతంగా ఉంటుందని.. 2100 నాటికి అనూహ్యంగా 58.7 కోట్లకు పడిపోతుందని అభిప్రాయపడింది.

కాగా.. ఇదే సమయంలో భారత జనాభా కూడా తగ్గుతుందని అమెరికాలోని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ (ఐహెచ్‌ఎంఈ) అంచనా వేసింది. ఇప్పుడున్న 138 కోట్ల నుంచి 109 కోట్లకు తగ్గిపోతుందని పేర్కొంది. అయినప్పటికీ ప్రపంచ జనాభాలో నంబర్‌వన్‌గా ఉంటుందని తెలిపింది. అయితే భారత్‌, చైనాలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి లెక్కలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. 2100 నాటికి భారత జనాభా 144.7 కోట్లకు చేరుతుందని.. 106.5 కోట్లతో చైనా రెండో స్థానంలో నిలుస్తుందని పేర్కొంది. నైజీరియా (73.3 కోట్లు), అమెరికా (43.4 కోట్లు), పాకిస్థాన్‌ (40.3 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉంటాయని తెలిపింది.చైనా జనాభా 58 కోట్లు!ఒకే బిడ్డ విధానం తీసేసినా..60 ఏళ్ల కింద తీవ్ర కరువు సంభవించిన సమయం(1959-61)లో మాత్రమే చైనాలో జనాభా తగ్గింది. ఆ తర్వాత గత నాలుగు దశాబ్దాల్లో 66 కోట్ల నుంచి ఏకంగా 141 కోట్లకు చేరుకుంది. ఇప్పుడు తగ్గుముఖం పట్టడానికి వివిధ కారణాలు చెబుతున్నారు. ఒకే బిడ్డ విధానాన్ని కమ్యూనిస్టు ప్రభుత్వం ఎత్తివేసినా.. సామాజిక, ఆర్థిక కారణాల దృష్ట్యా ఎక్కువ మందిని కనేందుకు మహిళలు సుముఖత చూపడం లేదని షాంఘై అకాడమీ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ వెల్లడించింది. ముఖ్యంగా కరోనా నియంత్రణకు చైనా కఠినతరమైన ఆంక్షలు అమలు చేస్తోంది. ఈ కారణంగా గర్భధారణకు మహిళలు ఇష్టపడడం లేదు. అయితే ఇదొక్కటే జనాభా మందగమనానికి కారణం కాదు. చాలా ఏళ్లుగా సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది.

1980వ దశకం చివరిలో ఆ రేటు 2.6 శాతం ఉండగా.. 1994 నుంచి 1.6-1.7 శాతానికి తగ్గిపోతూ.. 2020 నాటికి 1.3 శాతానికి.. నిరుడు 1.15 శాతానికి పడిపోయింది. ఒకే బిడ్డ విధానాన్ని 2016లోనే ఎత్తివేసి.. ముగ్గురేసి పిల్లలను కనాలన్న విధానం తెచ్చినప్పటికీ సంతానోత్పత్తి పెరగలేదు. చిన్న కుటుంబాలకు అలవాటు పడిన వారు పెద్ద కుటుంబాలుగా ఎదిగేందుకు సుముఖంగా లేరని.. జీవన వ్యయం పెరిగిపోయిందని.. వివాహ వయసు పెంచడంతో జననాలు ఆలస్యమవుతున్నాయని.. పిల్లలను కనాలన్న కోరిక తగ్గిపోతోందని.. ఇలా పలువురు పలు కారణాలు, సిద్ధాంతాలు చెబుతున్నారు. అన్నిటికీ మించి సంతానం పొందే వయసు గల మహిళల సంఖ్య చైనాలో బాగా తగ్గిపోయింది. అలాగే పనిచేసే వయస్కుల సంఖ్య తగ్గిపోయి 65 ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం వంద మంది పనిచేసే వయస్కులు 20 మంది వృద్ధులను సంరక్షిస్తున్నారు.
2100 నాటికి వారు 120 మంది వృద్ధులను చూసుకోవలసి వస్తుందని షాంఘై అకాడమీ బృందం హెచ్చరించింది. పనిచేసే వయస్కుల శాతం 1.73 శాతానికి తగ్గిపోవడం.. ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని.. దానికి తగినట్లుగా ఉత్పాదకత వేగం పుంజుకోకుంటే ఎకానమీ బాగా దెబ్బతింటుందని స్పష్టం చేసింది. కార్మికుల సంఖ్య తగ్గిపోతే.. కార్మిక వ్యయం బాగా పెరిగిపోతుంది. అప్పుడు ఉత్పాదక యూనిట్లు.. కార్మిక వ్యయం చౌకగా ఉండే భారత్‌, వియత్నాం, బంగ్లాదేశ్‌ తదితర దేశాలకు వెళ్లిపోతాయి. అదీగాక పెరిగిపోతున్న వృద్ధుల జనాభా అవసరాలకు అనుగుణంగా.. తన ఉత్పాదక వనరుల్లో అత్యధిక భాగాన్ని వారి ఆరోగ్యం, వైద్యం, సంరక్షణ సేవలకు వెచ్చించాల్సి ఉంటుంది.

2020లో చైనాలో పెన్షన్‌ చెల్లింపులు ఆ దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 4 శాతంగా ఉండగా.. 2100కి 20శాతానికి చేరతాయని విక్టోరియా (ఆస్ట్రేలియా) వర్సిటీలోని సెంటర్‌ ఫర్‌ పాలసీ స్టడీస్‌ పేర్కొంది. ఈ గణాంకాలన్నీ గమనిస్తే.. రాబోయే కొన్నేళ్లలో ఉత్పాదక పరిశ్రమలు భారత్‌ వైపు పెద్దఎత్తున మళ్లే అవకాశం కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.