DailyDose

టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం -TNI తాజా వార్తలు

టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం -TNI  తాజా వార్తలు

*తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమావేశమైంది. చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈసారి భక్తుల సమక్షంలోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 27న శ్రీవారికి పట్టువస్త్రాలు సీఎం జగన్ సమర్పిస్తారు. రద్దీ తగ్గేవరకు సర్వదర్శన భక్తులకు ప్రస్తుత విధానం కొనసాగుతుందని పాలకమండలి ప్రకటించింది. దేశవ్యాప్తంగా వైభవోత్సవాలు నిర్వహించాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 16 నుంచి 20 వరకు నెల్లూరులో వైభవోత్సవాలు నిర్వహంచాలను నిర్ణయం తీసుకున్నారు. యంత్రాల సాయంతో లడ్డూ ప్రసాద బూందీ తయారీపై అధ్యయనం చేయాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది.

*నెల రోజులకుపైగా అటు ప్రజలను, ఇటు అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న పెద్ద పులి.. తాజాగా బౌలవాడలో ప్రత్యక్షమైంది. ఈ గ్రామంలో ఓ ఎద్దుపై దాడి చేసి చంపింది. పులి దాడి చిత్రాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఎద్దుపై దాడి చేసిన పులి దానిని తిన్నట్లుగా వీడియోలో కనిపిస్తున్నది. ప్రస్తుతం ఈ పులి అనకాపల్లి పరిసరాల్లో సంచరిస్తున్నట్లుగా అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం విస్సన్నపేటలో కూడా ఎద్దుపై దాడి చేసినంది.

*భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్.. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా క‌లెక్ట‌ర్ అనురాగ్ జ‌యంతి, ఎస్పీ రాహుల్ హెగ్డేతో ఇవాళ ఉద‌యం ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాలో వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌ను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. మిడ్ మానేరు, అప్ప‌ర్ మానేరు, అనంత‌గిరి ప్రాజెక్టుతో పాటు మానేరు న‌ది వ‌ద్ద ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా ముందస్తు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. కాలువలు, చెరువులు, కుంట‌లు, చెక్ డ్యామ్స్ వ‌ద్ద కూడా ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

*కామారెడ్డి : జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలో గల పోచారం ప్రాజెక్టు నుంచి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయన్నారు.

*భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆర్ వి కర్ణన్, సీపీ సత్యనారాయణ, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి తో కలిసి నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

*గుజ‌రాత్‌లో కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు గుజరాత్‌లోని పలు జిల్లాలను అతలాకుతలం చేశాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు, రోడ్లు, కార్యాలయాలు, రైల్వే ట్రాక్‌పై నీళ్లు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని నదుల నీటి మట్టం పెరిగి వివిధ లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. దక్షిణ గుజరాత్‌లోని డాంగ్, నవ్‌సారి , వల్సాద్ జిల్లాల్లో రాబోయే ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

*గోపాలపురంలో పేపర్ ప్లేట్లపై అంబేద్కర్ ఫోటోలు ముద్రించిన వివాదంలో 18 మంది దళిత యువకులపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని ఆరోపిస్తూ రావులపాలెం పోలీస్ స్టేషన్‌లో కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నిరసన కొనసాగిస్తున్నారు. నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచి ఎమ్మెల్యే నిరసన చేపట్టారు. రాత్రంతా పోలీస్ స్టేషన్‌లోనే నిద్రించారు. తప్పుడు కేసులు బనాయించిన పోలీసులపై చర్యలు తీసుకునేవరకు పోలీస్ స్టేషన్‌లో నిరసన కొనసాగిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి అమలాపురం ఎంపీ చింతా అనురాధ మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో రావులపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

*రావులపాలెం పోలీస్‌స్టేషన్‌లో నిరసన చేస్తున్న ఎమ్మెల్యే జగ్గిరెడ్డితో ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు చర్చించారు. దాంతో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి నిరసన విరమించారు. ఈ సందర్భంగా డీఐజీ పాలరాజు మాట్లాడారు. గోపాలపురంలో అంబేద్కర్ పోటోలతో ఉన్న పేపర్ ప్లేట్ల వివాదంపై కోనసీమ జిల్లా అడిషనల్ ఎస్పీని విచారణాధికారిగా నియమించామన్నారు. రావులపాలెం ఎస్సై, సీఐలు ఉంటే దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగదనే స్థానికుల అభిప్రాయాల మేరకు వారిని స్టేషన్ విధుల నుంచి తొలగిస్తున్నామన్నారు. అంబేద్కర్ ఫోటోలు ఉన్న పాత పాఠ్య పుస్తకాలను కొనుగోలు చేసి వాటి అట్టలను ఉపయోగించి పేపర్ ప్లేట్లను తయారు చేసినట్లు ప్రాధమిక విచారణలో తేలిందన్నారు. విజయవాడ, రాజమహేంద్రవరం, రావులపాలెం ప్రాంతాల్లో పేపర్ ప్లేట్ల తయారు చేస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. పేపర్ ప్లేట్ల తయారీలో ప్రముఖ జాతీయ నేతలు పోటోలు లేకుండా చర్యలు చేపడతామన్నారు.

*తెలంగాణలో వర్షాలు , వరదల పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులతో సీఎం ఫోన్‌ లో మాట్లాడారు. గోదావరి లో వరద, నదీ ప్రవాహం, ఉపనదుల పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అవసరమైన చోట తక్షణ చర్యలపై అధికారులకు కేసీఆర్‌ ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో మరో మూడు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, ప్రయాణాలు తగ్గించుకోవాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. జన సంచారాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు మూడు రోజులపాటు(సోమ, మంగళ, బుధవారాల్లో) సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు శాఖల ఉన్నతాధికారులతో ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

*సీఈసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌కుమార్‌తో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వైసీపీ (YCP) శాశ్వత అధ్యక్షుడిగా సీఎం జగన్‌ను ప్రకటించడంపై ఫిర్యాదు చేశారు. పీపుల్ యాక్ట్ 1951 ఉల్లంఘించారని రఘురామ ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. భేటీ అనంతరం రఘురామ మీడియాతో మాట్లాడుతూ శాశ్వత అధ్యక్షుడు పదవి అనేదే అశాశ్వతమన్నారు. రాజ్యాంగం ప్రకారం శాశ్వత అధ్యక్షుడి ఎన్నిక చెల్లదని తెలిపారు. మనసులో ఏదో భయాలు పెట్టుకొనే.. శాశ్వత అధ్యక్షుడు కావాలని జగన్‌ అనుకున్నారని విమర్శించారు. ఇప్పటివరకు ఇలాంటి కేసు సీఈసీ ముందుకు రాలేదని పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి, సీఈసీకి ఇది పూర్తిగా విరుద్ధమని ప్రకటించారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్లీనరీకి ముందొక మాట.. తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. మాజీమంత్రి వివేకా కుమార్తె సునీత వైసీపీలో చేరదని రఘురామకృష్ణరాజు తెలిపారు.

*సీఈసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌కుమార్‌తో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వైసీపీ (YCP) శాశ్వత అధ్యక్షుడిగా సీఎం జగన్‌ను ప్రకటించడంపై ఫిర్యాదు చేశారు. పీపుల్ యాక్ట్ 1951 ఉల్లంఘించారని రఘురామ ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. భేటీ అనంతరం రఘురామ మీడియాతో మాట్లాడుతూ శాశ్వత అధ్యక్షుడు పదవి అనేదే అశాశ్వతమన్నారు. రాజ్యాంగం ప్రకారం శాశ్వత అధ్యక్షుడి ఎన్నిక చెల్లదని తెలిపారు. మనసులో ఏదో భయాలు పెట్టుకొనే.. శాశ్వత అధ్యక్షుడు కావాలని జగన్‌ అనుకున్నారని విమర్శించారు. ఇప్పటివరకు ఇలాంటి కేసు సీఈసీ ముందుకు రాలేదని పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి, సీఈసీకి ఇది పూర్తిగా విరుద్ధమని ప్రకటించారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్లీనరీకి ముందొక మాట.. తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. మాజీమంత్రి వివేకా కుమార్తె సునీత వైసీపీలో చేరదని రఘురామకృష్ణరాజు తెలిపారు.

* ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం ఏపీ సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గౌతమ్‌ అన్న ఆశయాలను నెరవేరుస్తానన్నారు. కాగా, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో విక్రమ్‌రెడ్డి భారీ మెజార్టీ సాధించిన సంగతి తెలిసిందే. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్‌ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌ డిపాజిట్‌ కోల్పోయారు. ఇక, పోటీలో నిలిచిన ప్రతిపక్ష నేతలను మేకపాటి విక్రమ్‌ రెడ్డి చిత్తుగా ఓడించారు.
*అమర్‌నాథ్‌ యాత్రలో జరిగిన పెను విషాదంలో ఇద్దరు తెలుగు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 8న అమర్‌నాథ్‌ గుహ వద్ద సంభవించిన ఆక్మసిక వరదల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన సుధ, పార్వతి అనే మహిళలు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. సుధ మృతదేహాన్ని భర్త విజయ్‌ కిరణ్‌ గుర్తించారు. భౌతిక కాయాలను స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలతో ఏపీ భవన్‌ కమిషనర్‌ కౌశిక్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

* 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో గోదావరికి వరద.పోలవరం ప్రాజెక్ట్ దగ్గర గోదావరి ఉగ్రరూపం. ప్రాజెక్ట్ 48 గేట్లు ఎత్తి ఉంచిన అధికారులు. పోలవరం ప్రాజెక్ట్ నుండి 9లక్షల క్యూసెక్కుల వరద దిగువకు విడుదల.మధ్యాహ్నానికి 12లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా. గంటగంటకు పెరుగుతున్న వరద ప్రవాహం. వరద ఉధృతితో నిలిచిపోయిన ప్రాజెక్ట్ పనులు.ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ దగ్గర 32.2మీటర్ల చేరుకున్న గోదావరి నీటిమట్టం.ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆకస్మికంగా గోదావరికి భారీ వరద గంటకు 35 సెంమీ చొప్పున పెరుగుతున్న గోదావరి నీటి మట్టం.

*ఒడిశా పరిసరాల్లో అల్పపీడనం. అల్పపీడనం మరింత బలపడే అవకాశాలు. కోస్తా, రాయలసీమకు వర్షసూచన.
ఆవర్తనం ప్రభావంతో కోస్తా, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు. అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం.దక్షిణ ఛత్తీస్ ఘడ్ , ఉత్తర కోస్తాల్లో భారీ నుంచి అసాధారణ వర్షాలు. ఈనెల 12 లేదా 13న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం.

*ఉస్మాన్ సాగర్ జలాశయంలోకి వరద ఉధృతి కొనసాగుతోంది. ఉస్మాన్ సాగర్‌కు 300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఉస్మాన్ సాగర్ నుంచి రెండు గేట్ల ద్వారా మూసిలోకి నీరు వెళుతోంది. ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1786 అడుగులకు చేరుకుంది. హిమాయత్ సాగర్‌కు వస్తున్న 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. హిమాయత్ సాగర్ రెండు గేట్ల ద్వారా 686 క్యూసెక్కుల నీరు మూసిలోకి వెళుతోంది. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1760.55 అడుగులకు చేరింది.

*డతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సిటీలో ఎంఎంటీఎస్ (MMTS) సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. నేటి నుంచి నుంచి మూడు రోజుల పాటు 34 ఎంఎంటీఎస్ రైళ్ళ సర్వీసులను నిలిపివేస్తన్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. మరోవైపు… భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ (RED Alert) కొనసాగుతోంది. ఆసిఫాబాద్ కొమరం భీమ్ ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అత్యంత ఎక్కువగా పడే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల కరీంనగర్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ అర్బన్, రూరర్, జనగామలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పై జిల్లాలలో ఆరంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ నగరంలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.

*మౌనదీక్ష బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మౌన దీక్ష ప్రారంభమైంది. పోడు భూములు, గిరిజన సమస్యపై జిల్లాలోని తన కార్యాలయంలో సంజయ్ దీక్షలో కూర్చుకున్నారు. నల్ల బ్యాడ్జీ కట్టుకుని దీక్ష చేపట్టారు. మౌన దీక్ష వేదికపై సీఎం కేసీఆర్ కోసం బీజేపీ నేతలు కుర్చీ వేశారు. కుర్చీ వేసుకుని గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. హామీని గుర్తు చేస్తూ బీజేపీ నేతలు కుర్చీ వేశారు. ‘‘ఇదిగో కుర్చీ.. సమస్యలను పరిష్కరించు కేసీఆర్ అంటూ’’ కమలం శ్రేణులు యెద్దేవా చేశారు. ఆసిఫాబాద్, ఖమ్మం, నల్గొండ, మంచిర్యాల జిల్లాలో గిరిజనులపై దాడులను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి గిరిజనులపై దాడులు చేస్తున్నరాని ఆరోపిస్తోంది. కాగా… ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన 317జీవో రద్దు కోసం జనవరిలో దీక్షకు దిగగా… అనుమతి లేదంటూ అప్పట్లో సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి భూములు, గిరిజన సమస్యపై బండి సంజయ్ దీక్షకు దిగారు

*మౌనదీక్ష బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మౌన దీక్ష ప్రారంభమైంది. పోడు భూములు, గిరిజన సమస్యపై జిల్లాలోని తన కార్యాలయంలో సంజయ్ దీక్షలో కూర్చుకున్నారు. నల్ల బ్యాడ్జీ కట్టుకుని దీక్ష చేపట్టారు. మౌన దీక్ష వేదికపై సీఎం కేసీఆర్ కోసం బీజేపీ నేతలు కుర్చీ వేశారు. కుర్చీ వేసుకుని గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. హామీని గుర్తు చేస్తూ బీజేపీ నేతలు కుర్చీ వేశారు. ‘‘ఇదిగో కుర్చీ.. సమస్యలను పరిష్కరించు కేసీఆర్ అంటూ’’ కమలం శ్రేణులు యెద్దేవా చేశారు. ఆసిఫాబాద్, ఖమ్మం, నల్గొండ, మంచిర్యాల జిల్లాలో గిరిజనులపై దాడులను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి గిరిజనులపై దాడులు చేస్తున్నరాని ఆరోపిస్తోంది. కాగా… ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన 317జీవో రద్దు కోసం జనవరిలో దీక్షకు దిగగా… అనుమతి లేదంటూ అప్పట్లో సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి భూములు, గిరిజన సమస్యపై బండి సంజయ్ దీక్షకు దిగారు

*కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. మెడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఇన్ ఫ్లో 10,02,250 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 10,02,250 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు 81 గేట్లు తెరచి నీటిని దిగువకు వదులుతున్నారు. గోదావరి వరద ఉధృతితో దిగువ ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో గోదావరి పరివాహక గ్రామాలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
*తిరుమల శ్రీవారికి మహేంద్ర జీపు విరాళంగా అందిం
ది. టీటీడీ బోర్డు సభ్యుడు నందకుమార్ రూ.10.26 లక్షల విలువైన జీపును అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవోరమేశ్‌ బాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఐ జానకి రామ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.నిన్న శ్రీవారిని 89,013 మంది భక్తులు దర్శించుకోగా 37,698 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.39 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు.

*నిజామాబాద్: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( సూచించారు. వర్షాలు, వరదల పరిస్థితిపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి స్పెషల్ ఆఫీసర్ క్రిస్టినా తో కవిత ఫోన్‌లో సమీక్షించారు. స్పెషల్ ఆఫీసర్ క్రిస్టినా చొంగ్తు ఈ రోజు నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. లోతట్టు ప్రాంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఎమ్మెల్సీ కోరారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నందిపేట్, సిరికొండ, బోధన్ నియోజకవర్గాలకు మంజూరు చేసిన ప్రత్యేక అంబులెన్స్‌లు ప్రజలకు విరివిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో పంటలు నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

*పాకిస్థాన్‌ దేశంలోని పలు ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది.బలూచిస్థాన్‌లోని దక్షిణ ప్రావిన్స్‌లో కురుస్తున్న భారీవర్షాలు, వరదల వల్ల మహిళలు, పిల్లలతో సహా 57 మంది మరణించినట్లు పాక్ అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాలలో కుండపోత వర్షంతో పలువురు మరణించారు.వరదల వల్ల వందలాదిమంది నిరాశ్రయులయ్యారు. పాకిస్థాన్ దేశంలోని అతిపెద్ద నగరమైన కరాచీలో గత కొన్ని రోజులుగా వీధులు జలమయం అయ్యాయి. బలూచిస్థాన్‌లో వర్షాలు తీవ్ర వినాశనానికి కారణమయ్యాయి. బలూచిస్తాన్‌లోని దక్షిణ ప్రావిన్స్‌లో వరద నీటిలో కొట్టుకుపోవడంతో ఎనిమిది ఆనకట్టలు తెగిపోయాయి. ఈ వరదల ధాటికి 57 మంది మరణించారని ప్రావిన్స్ ముఖ్యమంత్రి విపత్తు, హోం వ్యవహారాల సలహాదారు జియావుల్లా లాంగోవ్ తెలిపారు.

*ఏపీలో త్వరలో బీజేపీ పాదయాత్ర చేపట్టనుంది. పాదయాత్రపై రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించారు. సెప్టెంబర్ 25 పండిట్ దీనదయాళ్ జయంతి రోజు బీజేపీ పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిసింది.ప్రాంతాల వారీగా జోన్లలో లేదా రాష్ట్రం మొత్తం ఒకేసారి పాదయాత్ర చేపట్టేలా ఏపీ బీజేపీ వ్యూహరచన చేస్తోంది. అధిష్ఠానం ఆదేశాల తర్వాత పాదయాత్రకు బీజేపీ సిద్దమవుతుంది..

*రాష్ట్రంలో కుండపోతగా కురుస్తున్న వానలతో గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద నదిలో గంటగంటకు వరద ప్రవాహం పెరిగిపోతున్నది. ఎగువనుంచి భారీగా వరద పోటెత్తడంతో రాములవారి పాదాల వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

*శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. భారీ వర్షాలతో జలాశయంలోకి 85,740 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 9 గేట్లను ఎత్తివేసి 41 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులుకాగా, ప్రస్తుతం 1087.6 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ఇక జలాశయంలో 90.3 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. ఇప్పుడు 75.15 టీఎంసీల నీరు ఉన్నది.
*క్షయ వ్యాధి బాధితుల్లో మరణాల రేటు ఎక్కువగానే ఉంటోందని ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ ఇన్‌ ట్యుబర్‌క్యులోసిస్‌(ఎన్‌ఐఆర్‌టీ) తెలిపింది. క్షయ బాధితుల ఆయుర్దాయం తక్కువేనని పేర్కొంది. ఆధునిక వైద్య చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చిన కారణంగా ఇటీవలి కాలంలో క్షయ బాధిత మరణాలు క్రమేపీ తగ్గుతున్నాయని చెన్నైలోని ఎన్‌ఐఆర్‌టీ డైరెక్టర్‌ పద్మా ప్రియదర్శిని చెప్పారు.

*వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్థానికులు సైతం పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం మధ్య భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు.

*ఫెరారీ యువ రేసర్‌ చార్లెస్‌ లెక్లెర్క్‌ ఆస్ట్రియా గ్రాండ్‌ ప్రీ ఎఫ్‌1 రేసులో చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌ రేసును ప్రథమస్థానంలో ముగించి టైటిల్‌ నెగ్గిన 24 ఏళ్ల చార్లెస్‌.. ఈ సీజన్‌లో మూడో విజయాన్ని అందుకున్నాడు. రెడ్‌బుల్‌కు చెందిన మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌, మెర్సిడెస్‌ స్టార్‌ లూయిస్‌ హామిల్టన్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

*తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం భక్తరహళ్లి గ్రామంలో వెలసిన నరసింహస్వామి ఆలయం వద్ద భూతప్పల ఉత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. జిల్లేడకుంట ఆంజనేయస్వామి, భక్తరహళ్లి నరసింహస్వామి ఆలయాల్లో ఉదయం నుంచి హోమాలు, అభిషేకాలు జరిపారు. అనంతరం భూతప్పల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దీర్ఘకాలిక వ్యాఽధిగ్రస్తులు, సంతానంలేని మహిళలు, ఉదయం నుంచి ఉపవాసం ఉండి భక్తిశ్రద్ధలతో ఆలయం ముందు భూతప్పలు వచ్చేదారిలో పడుకున్నారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్లిన అనంతరం పడుకున్న భక్తులపై నుంచి భూతప్పలు నడుచుకుంటూ దేవాలయానికి చేరుకున్నారు.

*అనకాపల్లి జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి మరోసారి కలకలం రేపింది. అనకాపల్లి మండలం బవులవాడ శివారులో శనివారం రాత్రి ఒక ఆవు దూడను చంపి, సమీపంలోని పోతుకొండపైకి ఈడ్చుకెళ్లింది. కొంతభాగాన్ని తినేసి అడవుల్లోకి వెళ్లిపోయింది. ఆదివారం ఉదయం సమాచారం అందుకున్న అటవీ, పోలీస్‌, రెవెన్యూ శాఖల అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దండోరా వేయించారు. ఈ సందర్భంగా విశాఖ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ బిర్లంగి రామ్‌నరేష్‌ మాట్లాడుతూ.. బవులవాడ పోతుకొండతో పాటు సమీప పొలాల్లో పులి పాదముద్రలు గుర్తించామన్నారు. పులిని బంధించేందుకు రెండు బోన్లు ఏర్పాటు చేశామని, కదలికలను తెలుసుకునేందుకు ఆరు ట్రాక్‌ కెమెరాలను అమర్చామన్నారు.

*అమర్‌నాథ్‌ యాత్ర తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. రాజమహేంద్రవరం నుంచి అమర్నాథ్‌ యాత్రకు వెళ్లిన 37మందిలో ఇద్దరు మహిళలు గల్లంతయ్యారు. మిగతా 35మంది సురక్షితంగా ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. కొవ్వూరు ఆర్డీవో మల్లిబాబు కథనం ప్రకారం రాజమహేంద్రవరం నుం చి 20 మంది, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులతో కలుపుకొని మొత్తం 37 మంది ఈ నెల 1న అమర్నాథ్‌ యాత్రకు వెళ్లారు. అమర్‌నా థ్‌ ఆలయ సమీపంలో శుక్రవారం సంభవించిన వరదలో కొత్త పార్వతి, గునిశెట్టి సుధ గల్లంతయ్యారు. పార్వతి భర్త మార్కండేయులు, సుధ భర్త కిరణ్‌ మాత్రం క్షేమంగా బయటపడ్డారు. దీంతో ఈ ఇద్దరూ గల్లంతైన వారి ఆచూకి కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉండిపోయారు. కా గా.. ఆదివారం సాయంత్రం వరకూ మిస్సింగ్‌ లిస్ట్‌లో ఉన్న కొత్త శ్రీనివాసరావు, కొత్త విశ్వనాఽథ్‌, కొత్త వర్ధన్‌ సురక్షితంగా ఉన్నారు. ఆదివారం సాయంత్రం వారు పెవల్‌గామ్‌ అనే గ్రామం నుంచి జమ్మూకు బయలుదేరినట్టు ఆర్డీవో తెలిపారు. ఈ మేరకు గోకవరంలో ఉన్న వారి బం దువు ఒకరికి వారి నుంచి సమాచారం వచ్చినట్టు ఆయన తెలిపారు.

*హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ దంపతులు రాజధాని ప్రాంతం వెంకటపాలెం సమీపంలోని టీటీడీ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని ఆదివారం సందర్శించారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. వేదపండితులు వారికి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.

*దళిత యువకులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ కోనసీమ జిల్లా రావులపాలెం పోలీ్‌సస్టేషన్‌లో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆందోళనకు దిగారు. ఈ నెల 5న గోపాలపురంలోని అన్నపూర్ణా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో అంబేడ్కర్‌ చిత్రపటాన్ని ముద్రించిన పేపరు ప్లేట్ల వినియోగంపై దళిత యువకులు ఆందోళన చేసి దాడికి దిగారు. ఈ సంఘటనలో హోటల్‌ యజమాని, ప్లేట్లు విక్రయించిన వ్యక్తులు, దళితులపై పోలీసులు కేసులు పెట్టారు. దీనిపై ఎస్సీ కమిషన్‌ విచారణ చేస్తోంది. టీడీపీ, జనసేన నాయకులు కూడా ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తన అనుచరులతో కలిసి ఆదివారం పోలీ్‌సస్టేషన్‌కు చేరుకున్నారు. సీఐ, ఎస్‌ఐలు లేకపోవడంతో ఆగ్రహం చెంది స్టేషన్‌లోనే బైఠాయించారు. సాయంత్రం 5 గంటల నుంచి మూడు గంటలపాటు ఎమ్మెల్యే ఆందోళన కొనసాగడంతో డీఎస్పీ వై.మాధవరెడ్డి వెళ్లి ఎమ్మెల్యేతో చర్చలు జరిపారు. దళితులపై కేసులు ఉపసంహరించుకోవాలని, సీఐ, ఎస్‌ఐలపై చర్యలు తీసుకోవాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి.

* ఉపాధ్యాయుల రేషనలైజేషన్‌ ప్రక్రియలో ఎల్‌ఎ్‌ఫఎల్‌ హెచ్‌ఎం పోస్టులకు మినహాయింపునివ్వాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం ప్రభుత్వాన్ని కోరారు. ఎల్‌ఎ్‌ఫఎల్‌ హెచ్‌ఎంలను తరచూ బదిలీలు చేస్తుండటం వల్ల ఇబ్బందులు పడుతున్నారని, బాలికల అక్షరాస్యత కోసం సృష్టించిన ఈ పోస్టులను సాధారణ విద్యార్థుల సంఖ్యతో ముడిపెట్టడం సరికాదన్నారు.

*రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతుల మెడకు ఊరితాళ్లను బహూకరిస్తోందని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. మండలంలోని గంగవరంలో ఆదివారం నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వేల కోట్ల అవినీతికి పాల్పడి తండ్రి సానుభూతి ద్వారా ముఖమంత్రి పదవిని చేపట్టిన జగన్మోహన్‌రెడ్డికి రైతుల బాధలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ధాన్యం విక్రయించిన రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ నగదు అందలేదన్నారు. రైతులు తమ సమస్యల్ని పరిష్కరించమని కోరుతూ చేస్తోన్న ఆందోళన ప్రభుత్వానికి పట్టడంలేదన్నారు. పాఠశాలల విలీనం వల్ల పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. గిరిజన, దళిత కాలనీల్లోని ప్రాథమిక పాఠశాలల్ని మూసివేస్తే పేదలు చదువుకు దూరమవుతారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 117ను ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సింగారెడ్డి లక్ష్మీనరసారెడ్డి, ఇంతా మల్లారెడ్డి, చెముకులు కృష్ణచైతన్య, మన్నేపల్లి నాగేంద్ర, పానేటి సురేష్‌, తలారి బాబు, దయాకర్‌ రెడ్డి, ఎడ్ల వెంకటరమణారెడ్డి, దామెర్ల రమేష్‌, తలారి ఏడుకొండలు, తిరుమూరు రవీంద్ర రెడ్డి, జెట్టి రాజగోపాల్‌రెడ్డి, ముసలి సుధాకర్‌, బాల రవి, నాటకరాణి వెంకట్‌, సూరిశెట్టి శ్రీనివాసులు, బెల్లంకొండ విజయ్‌ కుమార్‌, యద్దలపూడి నాగరాజు, ఆదాల శివారెడ్డి, గునుపాటి రవీంద్రరెడ్డి, పాలపర్తి శ్యామ్‌ పాల్గొన్నారు.

* దక్షిణ ఒడిశా, ఉత్తరకోస్తా తీరాలకు ఆనుకుని అల్పపీడనం కొనసాగుతున్నది. దీనిపై సముద్రమట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. ఇంకా గుజరాత్‌ నుంచి ఉత్తర కేరళ వరకు తీర ద్రోణి, ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం, దక్షిణ ఒడిశాపై నుంచి తూర్పు, పడమర ద్రోణి విస్తరించాయి. అలాగే రాజస్థాన్‌ నుంచి మధ్య భారతం, ఉత్తర కోస్తా మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతున్నది. వీటన్నింటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున ఉత్తరకోస్తాలో ఎక్కువచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉత్తరకోస్తాలో ఎక్కువచోట్ల, దక్షిణకోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములతో వర్షాలు కురుస్తాయి. ఉత్తరకోస్తాలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ, ఒకటి రెండుచోట్ల అత్యంత భారీ, దక్షిణకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది

*ఏపీలో త్వరలో బీజేపీ పాదయాత్ర చేపట్టబోతోంది. పాదయాత్రపై రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 25 పండిట్ దీనదయాళ్ జయంతి రోజు బీజేపీ పాదయాత్ర నిర్వహించాలని కాషాయపార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రాంతాల వారీగా జోన్లలో లేదా రాష్ట్రం మొత్తం.. ఒకేసారి పాదయాత్ర చేపట్టేలా ఏపీ బీజేపీ వ్యూహరచిస్తున్నారు. అధిష్ఠానం ఆదేశాల తర్వాత పాదయాత్రకు బీజేపీ సిద్దంకానుంది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం త్వరలో బీజేపీ పాదయాత్ర చేపడుతోందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లేదన్నారు. ప్రభుత్వ ఆలోచనతో రైతులు సతమతమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ, టీడీపీ కలిసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఆయన ఆరోపించారు.

*ఏడాదికాలంలో 124 మంది మావోయిస్టులు మరణించారని, వీరిలో 89 మంది బూటకపు ఎన్‌కౌంటర్లలో, 27 మంది అనారోగ్యంతో మృతి చెందారని ఆ పార్టీ ప్రకటించింది. పాలకవర్గాల దాడులతోపాటు అనారోగ్య వాతావరణం కారణంగా మావోయిస్టు పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు పేర్కొంది. కేంద్ర కమిటీ సభ్యు లు తాప్‌సదా, చింతన్‌దా, అంబర్‌దా, రామకృష్ణ, దీపక్‌దాలను పార్టీ కోల్పోయినట్టు తెలిపింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరుతో ఆదివారం ఓ ప్రకటన వెలువడింది.

*రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం తొలి ఏకాదశి పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో, వివిధ రకాల పుష్పాలతో లక్షపుష్పార్చన పూజలు చేశారు. తొలి ఏకాదశి, వారాంతపు సెలవు రోజు కావడంతో ఆదివారం స్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ధర్మదర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనాలకు గంట సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. పలువురు ప్రముఖులు యాదగిరీశుడిని దర్శించుకుని ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు.

*ఈ నెల 17న ఆణివార ఆస్థానం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో 12వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 12న వీఐపీ బ్రేక్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ క్రమంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు సిఫారసు లేఖలు తీసుకోబోమని తెలిపింది.

* వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్థానికులు సైతం పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం మధ్య భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు.

** పవిత్ర గుహ సమీపంలో కుంభవృష్టి అనంతరం వరదలు వెల్లువెత్తడంతో 16 మంది మృతి చెందిన ఘటనతో పాక్షికంగా నిలిపివేసిన అమర్‌నాథ్ యాత్ర సోమవారం ఉదయం తిరిగి ప్రారంభమైంది. కుంభవృష్టి కారణంగా దక్షిణ కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌(Amarnath) గుహ సమీపంలో వరదలు సంభవించిన మూడు రోజుల తర్వాత యాత్ర ఆరంభమైంది.‘‘మేం బాబా దర్శనం లేకుండా తిరిగి వెళ్లలేం. మాకు భోలే బాబాపై పూర్తి విశ్వాసం ఉంది,బాబా దర్శనం కోసం ఎదురు చూస్తున్నాం. యాత్ర తిరిగి ప్రారంభమైనందుకు మేం సంతోషిస్తున్నాము. సీఆర్‌పీఎఫ్ ఇతర సిబ్బంది మార్గనిర్దేశం చేశారు. క్షేమంగా ముందుకు సాగుతున్నాం’’ అని అమరనాథ్ యాత్రికులు చెప్పారు.

*చెన్నై: రాష్ట్రం నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్ళిన 25 మంది భక్తులు సురక్షితంగా స్వస్థలానికి తిరిగొచ్చారు. దక్షిణ కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ గుహాలయం ప్రాంతంలో శుక్రవారం కుంభవృష్టి కారణంగా వరదలు సంభవించి 16 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 40 మందికిపైగా భక్తులు గల్లంతయ్యారు. ఆ సంఘటన కారణంగా యాత్రకు వెళ్ళిన భక్తులంతా స్వస్థలాలకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో రెండువారాలకు ముందు తిరువారూరు, తంజావూరు, నాగపట్టినం, తూత్తుకుడి, కోయంబత్తూరు జిల్లాలకు చెందిన 25 మంది అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్ళారు. శుక్రవారం ఊహించని విధంగా ఆ ప్రాంతంలో కుండపోతగా వర్షం కురవడంతో వరదలు సంభవించాయి. దీంతో వీరిని సైనిక దళాలు కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఆ తర్వాత వీరందరూ ఢిల్లీ కి చేరుకుని, శనివారం రాత్రి అక్కడి నుంచి విమానంలో బయల్దేరి చెన్నైకి తిరిగొచ్చారు. వీరిలో తొమ్మిదిమంది మహిళలు కూడా ఉన్నారు. సురక్షితంగా తిరిగొచ్చిన భక్తులు మీనంబాక్కం విమానాశ్రయంలో విలేఖరులతో మాట్లాడుతూ ఈ నెల 4తేదీన తాము అమర్‌నాఽథ్‌ గుహాలయానికి చేరుకున్నామని చెప్పారు. అప్పటివరకు ఆ ప్రాంతంలో వాతావరణం ఆహ్లాదకరంగానే ఉందని, మరుసటి రోజు గుహాలయాన్ని దర్శించే సమయంలో వర్షం ప్రారంభమైందని, ఆ తర్వాత ఊహించని విధంగా కుండపోతగా వర్షం కురిసిందని వివరించారు.ఆ భారీ వర్షం కారణంగా ఆ కొండపై నుంచి కిందకు వెళ్లేందుకు, కింది నుంచి కొండపైకి వచ్చేందుకు ఎవరినీ అనుమతించకుండా అధికారులు కట్టుదిట్టం చేశారని చెప్పారు. నాలుగు గంటలపాటు వర్షం కురిసి ఆగిన తర్వాతే తమను కిందకు దిగేందుకు అనుమతించారని చెప్పారు. పంచతరణి ప్రాంతానికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి తమను సైనిక దళాలు హెలికాప్టర్‌లో ఎక్కించుకుని నీలగిరి ప్రాంతానికి చేర్చారని తెలిపారు. ఆ తర్వాత తాము ఢిల్లీకి వెళ్ళి విమానంలో స్వరాష్ట్రానికి చేరుకున్నామని చెప్పారు.