DailyDose

టాటా సంస్థ ప్రతీకారం-వాణిజ్యం

టాటా సంస్థ ప్రతీకారం-వాణిజ్యం

* ఏపీలో సిటీ బస్సులను నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుంది. లాక్ డౌన్ తర్వాత రాష్ట్రంలో మే 20న ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే..అప్పటినుండి జిల్లాల్లో దాదాపు 3వేల బస్సులు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. అయితే విజయవాడ,విశాఖపట్నం లో ఇప్ప్పటివరకు సిటీ బస్సులను ప్రారంభించలేదు..కాగా ఈ నెల 20 నుండి 26 వరకు సచివాలయ ఉద్యోగాలకోసం రాతపరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షకు 10 లక్షల మంది హాజరు కానున్నారు. దాంతో పరీక్ష రాసే అభ్యర్థులకోసం రవాణా ఏర్పాటు చేయాల్సి ఉంది..సచివాలయ ఉద్యోగాల పరీక్షల నేపథ్యంలో హెల్త్‌ ప్రొటోకాల్‌ ప్రకారం సిటీ బస్సు సర్వీసులు నడిపేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అనుమతి కోసం ఫైల్‌ను పంపింది. జవహర్ రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని నిర్ణయం తీసుకుని అనుమతిస్తారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

* కరోనా మహమ్మారి కారణంగా పలు రైళ్లను రద్దు చేయగా.. కేంద్రం అన్‌లాక్‌ 4.0లో భాగంగా ఇస్తున్న పలు సడలింపులతో శనివారం నుంచి 80 ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.ఇప్పటికే ముఖ్యమైన స్టేషన్ల మధ్య 230 రైళ్లు నడుపుతోంది. వీటికి తోడు మరో 80 రైళ్లు నడిపేందుకు చర్యలు చేపట్టింది.ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనలు పంపగా అనుమతి లభించడంతో రైళ్లు పట్టాలెక్కాయి.ఇవాళ్టి నుంచి నడవున్న సర్వీస్‌లలో ఎనిమిది డైలీ, వీక్లీ ట్రైన్లు తెలంగాణ, ఏపీ నుంచి ఢిల్లీ, చెన్నై, ఓకా, దర్భంగా సహా పలు ప్రాంతాలకు నడువనున్నాయి.

* ప్రముఖ వీడియో షేరింగ్ యాప్‌ టిక్‌టాక్‌ యూఎస్‌ యాజమాన్య హక్కులను విక్రయించేందుకు చైనా ససేమిరా అంటోంది. విక్రయించడం కన్నా ఆ దేశంలో టిక్‌టాక్‌ను పూర్తిగా మూసేయడమే మంచిదని మాతృ సంస్థ బైట్‌ డ్యాన్స్‌ భావిస్తున్నట్లు సమాచారం. అమెరికాలో టిక్‌టాక్‌ను కొనసాగించాలా? మూసేయాలా? అన్నదానిపై బైట్‌డ్యాన్స్‌కు ఇచ్చిన గడువు పొడిగించేది లేదని అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 15తో ఆ గడువు ముగియనున్న నేపథ్యంలో బైట్‌ డ్యాన్స్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

* ప్రముఖ ఈ- కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ మరో సేల్‌కు సిద్ధమైంది. ఈ నెల 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు బిగ్‌ సేవింగ్‌ డేస్‌ పేరుతో ఓ సేల్‌ నిర్వహించనుంది. ఇందులో ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు సాధారణ, ఈఎంఐ కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ అందించనున్నారు. ఈ సేల్‌లో ఏయే వస్తువులపై ఆఫర్లు ఇస్తున్నదీ ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించలేదు.

* నిధులను సమీకరించడం కోసం మేం షేర్లను తనఖా చేయాలని చూస్తుంటే దానిని అడ్డుకుంటూ టాటాలు కోర్టుకు వెళ్లడం ప్రతీకార చర్య అని షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ పేర్కొంది. అలా చేయడం మైనారిటీ వాటాదార్ల హక్కులను కాలరాయడమేనని ఆరోపించింది. టాటా సన్స్‌లో మిస్త్రీ గ్రూప్‌ తనకున్న షేర్లను తనఖా పెట్టడం ద్వారా మూలధనాన్ని సమీకరించకుండా చూడాలని కోరుతూ సెప్టెంబరు 5న టాటా సన్స్‌ సుప్రీం కోర్టుకు వెళ్లింది. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎటువంటి షేర్ల తనఖా చేపట్టకుండా ఎస్‌పీ గ్రూప్‌ను ఆపాలని ఆ పిటిషన్‌ ద్వారా టాటాలు కోర్టును కోరారు. టాటా సన్స్‌లో తనకున్న 18.37 శాతంలో కొంత వాటాను తొలి దశ కింద రూ.3,750 కోట్లకు కెనడాకు చెందిన పెట్టుబడిదారుకు విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. షేర్ల తనఖా ద్వారా మొత్తం మీద రూ.11,000 కోట్ల వరకు సమీకరించాలని ప్రణాళికలు రచించింది. ఎస్‌పీ గ్రూప్‌నకున్న వాటా విలువ రూ.లక్ష కోట్ల వరకు ఉండొచ్ఛు కాగా, టాటా సన్స్‌ చర్యల వల్ల 60,000 మంది ఉద్యోగుల, లక్షకు పైగా వలస కార్మికుల భవిష్యత్‌ అగమ్యగోచరంలో పడిందని ఎస్‌పీ గ్రూప్‌ ప్రతినిధి ఒకరు పీటీఐతో పేర్కొన్నారు. జనవరి 10 నుంచి మిస్త్రీ బృందం తమకున్న వాటాలో 82 శాతం వరకు తనఖా పెట్టిన నేపథ్యంలో టాటాలు సుప్రీంకు వెళ్లారు.