Health

22న డల్లాస్‌లో యోగా దినోత్సవం

MGMNT Conducts International Yoga Day With Houston Indian Consulates Support On 22nd June

మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ సంస్థ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాన్సులేట్ ఆఫ్ ఇండియా హౌస్టన్ వారి సహకారంతో 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జూన్ 22న ఉదయం 7:30 నుండి 9:30 వరకు మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా, ఇర్వింగ్ నగరంలో నిర్వహిస్తున్నట్టు ప్రసాద్ తోటకూర తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టొఫర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కాన్సుల్ జనరల్ ఆఫ్ హ్యూస్టన్ డా. అనుపమ్ రే ప్రత్యేక అతిథిగా పాల్గోనున్నారు. ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకమైన 92వ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ ఛాంపియన్స్ గా ఎనిమిది మంది గెలిస్తే, అందులో ఏడుగురు భారతీయ సంతతికి చెందిన వారు కావడం ఎంతో గర్వకారణంగా ఉందని ప్రసాద్ తోటకూర అన్నారు. వారిలో డల్లాస్ నుంచి గెలిచిన అభిజాయ్ కొడాలి, సోహుమ్ సుఖతన్కర్, రోహన్ రాజాలను సత్కరించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనే వారికి యోగా చేయడానికి యోగా మాట్స్, అల్పాహారంను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. డా. ప్రసాద్ తోటకూర నేతృత్వంలోని ఈ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ సంస్థకు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ గా జాన్ హేమండ్, బి.ఎన్. రావు, రావు కాల్వల, అభిజిత్ రాయిల్కర్, తాయబ్ కుండవాలా, అక్రమ్ సయ్యద్, పీయూష్ పటేల్, కమల్ కౌషల్ భాధ్యతలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలకు www.mgmnt.org ను సంప్రదించాలని, ఈ యోగా దినోత్సవ వేడుకల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
MGMNT Conducts International Yoga Day With Houston Indian Consulates Support On 22nd June-TNILIVE Texas Telugu News