Sports

లారా విందులో టీమిండియా ఆటగాళ్లు

Team India Cricketers Attend Party At Lara's Place

వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న భారత జట్టు ఇప్పటికే టీ 20, వన్డే సిరీస్‌లు గెలవగా తదుపరి టెస్టు సిరీస్‌పై కన్నేసింది. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్‌ అనంతరం కాస్త విరామం దొరికిన భారత జట్టుకు విండీస్‌ లెజెండ్‌ లారా తన నివాసంలో విందు ఇచ్చాడు. ఈ పార్టీకి వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మతో పాటు శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, రవీంద్ర జడేజా, కేదార్‌ జాధవ్‌, యుజువేంద్ర చాహల్‌ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మాజీ క్రికెటర్‌ బ్రావో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. తమ జట్టు ఆటగాళ్లతో పాటు టీమిండియా సోదరులకు లారా తన నివాసంలో విందు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నాడు. అలాగే ఈ పార్టీకి విండీస్‌ ఆటగాళ్లు క్రిస్‌గేల్‌, కీరన్‌పొలార్డ్‌, సునీల్‌ నరైన్‌, బ్రావో సైతం హాజరవ్వడంతో అంతా కలిసి సందడి చేశారు. మరోవైపు శనివారం నుంచి విండీస్‌ ఎ జట్టుతో మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ మొదలవ్వగా 22 నుంచి ఇరు జట్లు తొలి టెస్టు ఆడనున్నాయి. విండీస్, భారత జట్లకు ఈ సిరీస్‌ నుంచే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఆరంభంకావడం విశేషం. దీంతో టెస్టు సిరీస్‌పై మరింత ఆసక్తి పెరిగింది. కాగా భారత జట్టులోకి టెస్టు ఆటగాళ్లు చెతేశ్వర్‌ పుజారా, మయాంక్‌ అగర్వాల్‌, అజింక్యా రహానే, వృద్ధిమాన్‌ సాహా, జస్ప్రిత్‌ బుమ్రా, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఉమేశ్‌ యాదవ్‌ రానున్నారు.