Movies

నయన రేటు తగ్గింది

Nayanthara Reduces Remunneration For Producers Benefit

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార పారితోషికం తగ్గించిందట. దక్షిణాదిన అత్యంత ఖరీదైన నటిగా ఉన్న నయన్‌ తన తర్వాతి సినిమాను సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో కలిసి చేయనుంది. ఈ సినిమాకు అన్నాత్తే అని టైటిల్‌ కూడా ఫిక్స్‌ చేశారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. డిసెంబర్‌లో క్రిస్మస్‌ కానుకగా అభిమానుల ముందుకు రానుంది. ఇదంతా ఇలా ఉండగా.. ద్వితీయ శ్రేణి హీరోలతో సమానంగా పారితోషికం తీసుకుంటూ ఎంతో డిమాండ్‌ ఉన్న నయన్‌ రెమ్యునరేషన్‌ విషయంలో వెనక్కి తగ్గడం కోలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే అందుకు గల కారణాలను ఓ సినిమా నిర్మాణ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ‘‘సాధారణంగా రూ.4కోట్లు పారితోషికంగా తీసుకునే నయన్‌ ఇటీవల వచ్చిన ‘దర్బార్‌’లో ఏకంగా 37.5శాతం పెంచి రూ.5.5కోట్లు తీసుకుంది. ఆ సినిమాను నిర్మించింది లైకా ప్రొడక్షన్స్‌. అది ఒక కార్పొరేట్‌ సంస్థ కాబట్టి పెద్దమొత్తంలో ఇచ్చేందుకు ఒప్పుకొంది. నయనతార ఆ సినిమాకు రూ.10.5కోట్లు తీసుకున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు. అన్నాత్తే సినిమాను నిర్మిస్తున్న సన్‌ పిక్చర్స్‌ తమిళనాడుకు చెందిన ప్రాంతీయ సంస్థ కాబట్టి అంత ఎక్కువ మొత్తం ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో సినిమాను వదులుకోవడం ఇష్టం లేని నయన్‌ గత సినిమాకంటే తక్కువకే చేసేందుకు ఓకే చెప్పినట్లు తెలిసింది. అయితే, ఎంత మొత్తమనేది మాత్రం ఇంకా చెప్పలేదు’’ అని ఆయన తెలిపారు. కాగా.. గతేడాది సైరా నర్సింహారెడ్డి, బిగిల్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాల్లో నటించిన ఆమె ఈ ఏడాదిలోనూ ‘దర్బార్‌’లో రజనీకాంత్‌ సరసన కనిపించింది. సినిమాల్లో నయన్‌ను తీసుకుంటే ఎక్కువ పారితోషికంతో చెల్లించాల్సి రావడంతో పాటు మెయింటెనెన్స్‌ భారీగా అవుతోందని, ఇది నిర్మాతలకు భారంగా మారుతోందని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో నయన్‌ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది.