Politics

తెలంగాణా సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు

Donations Flood Into Telangana CM Relief Fund

కరోనా వైరస్‌ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్దతుగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి సహాయనిధికి శనివారం పలువురు విరాళాలు అందించారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యులు కూడా తమవంతు సహాయం అందించారు. టీఎస్‌పీఎస్పీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి, సభ్యులు కలిసి సీఎం సహాయనిధికి రూ.1.25లక్షల విరాళం చెక్కును మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు పలు సంస్థల ప్రతినిధులు కూడా కేటీఆర్‌ను కలిసి విరాళం చెక్కులను అందించారు. మధుకాన్‌ షుగర్‌ అండ్‌ పవర్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ రూ.1.50కోట్ల విలువైన శానిటైజర్లు, మాస్క్‌లను అందించింది. హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ సంస్థ రూ.48లక్షల విలువగల 200 హోండా హై ప్రెషర్‌ బ్యాక్‌ప్యాక్‌ స్ప్రేయర్స్‌ను విరాళంగా అందజేసింది. వీటి సాయంతో బహిరంగ ప్రదేశాల్లో క్రిమిసంహారక మందులను పిచికారీ చేయొచ్చు. రూ.73లక్షల విలువైన 5000 శానిటైజర్లు, నాలుగు లక్షల మాస్క్‌లను ఈస్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రభుత్వానికి అందించినందుకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.