DailyDose

దీపావళి వరకు ఉచిత రేషన్-తాజావార్తలు

PM Modi Announces Free Ration To Poor Until Diwali

* దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ముఖ్య పథకాల్లో ఒకటైన గరీబ్‌ కల్యాణ్‌ యోజనను నవంబరు నెల చివరి వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. రూ. 90 వేల కోట్ల వ్యయంతో 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు వెల్లడించారు.

* ‘‘రాజధాని నగరం ఇప్పుడు కల్లోల పరిస్థితిలో ఉంది. ఎప్పుడు, ఎక్కడ కరోనా వైరస్‌ విజృంభిస్తుందో తెలియక ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు’’ అని అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. చివరి క్షణాల్లో రోగికి ఆక్సిజన్‌ దొరకక ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందిపడుతున్న విషయాన్ని రికార్డు చేసి పంపుతున్న దయనీయ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు.

* దేశంలో సరైన సమయంలో పెట్టిన లాక్‌డౌన్‌, ఇతర నిర్ణయాలు లక్షలాది మంది ప్రజల ప్రాణాల్ని కాపాడాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న వేళ ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా ఓ వైపు విజృంభిస్తున్న సమయంలోనే….ఫ్లూ సీజన్‌ రాబోతోందని….ముందుముందు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. లాక్‌డౌన్‌ వేళ ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కొంత ఉపశమనం కల్పించేందుకు ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకాన్ని దీపావళి వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.

* తెలంగాణలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీంతో రేపటి నుంచి జరగాల్సిన ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎంసెట్‌, పాలిసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌, పీజీ ఈసెట్‌, లాసెట్‌, పీజీ ఎల్‌ సెట్‌, ఎడ్‌సెట్‌, పీఈ సెట్‌ వాయిదా పడ్డాయి.

* బహుళ ప్రజాదరణ పొందిన టిక్‌టాక్‌ సహా 59 ప్రధాన మొబైల్‌ యాప్‌లను నిషేధించి..సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాను దారిలోకి తెచ్చుకోవాలన్న మోదీ ప్రభుత్వం వ్యూహాత్మక చర్యపై డ్రాగన్‌ స్పందించింది. ఈ చర్య తమని తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ ప్రకటించారు. పరిస్థితుల్ని సమీక్షిస్తున్నామన్నారు. అంతర్జాతీయ, ఆయా దేశాల నియమ నిబంధనలు, చట్టాలకు అనుగుణంగానే వ్యవహరించాలని చైనా కంపెనీలకు చెబుతుంటామని చెప్పుకొచ్చారు.

* జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఉచిత కరోనా పరీక్షలు మళ్లీ ప్రారంభమయ్యాయి. సరోజినీదేవి కంటి ఆసుపత్రి, నేచర్‌ క్యూర్‌, ఆయుర్వేదిక్‌ హాస్పిటల్‌, చార్మినార్‌ నిజామియా హాస్పిటల్‌లో ఇవాళ్టి నుంచి కరోనా పరీక్షల కోసం శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 250 శాంపిల్స్‌ సేకరించాలని లక్ష్యంగా నిర్థేశించారు. రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్‌ ఏరియా ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి, బాలాపూర్‌ యూపీహెచ్‌సీ, మహేశ్వరం సీహెచ్‌సీలలో రోజుకు 150 శాంపిల్స్‌ చొప్పున సేకరించాలని నిర్ణయించారు.

* తెరాస ప్రభుత్వం లీకేజీల ప్రభుత్వమని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొన్న కాళేశ్వరం, అంతకుముందు మిడ్‌ మానేరు, మల్లన్నసాగర్‌, నేడు కొండపోచమ్మ కాలువకు గండి.. ఇలా నాణ్యతలేని ప్రాజెక్టుల వలన సమీప ప్రాంతాల ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారన్నారు.

* చైనా ఉత్పత్తుల్ని నిషేధించాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఓవైపు ‘భారత్‌లో తయారీ’ అంటూనే మరోవైపు మోదీ నేతృత్వంలో భాజపా సర్కార్‌ చైనా నుంచి దిగుమతుల్ని పెంచుకుందని ఆరోపించారు. వాస్తవాల్ని దాచలేరంటూ.. యూపీఏ సర్కార్ నాటి చైనా దిగుమతుల్ని తాజా ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంతో పోలుస్తూ ఓ గ్రాఫ్‌ను ట్విటర్‌లో ఉంచారు.

* టిక్‌టాక్‌ తర్వాత ఏమిటీ..? ఇప్పుడు భారత ప్రభుత్వం ఇదే ఆలోచిస్తున్నట్లుంది. దాదాపు 12 రకాల వస్తువులపై కొరడా ఝుళిపించే అవకాశం ఉంది. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు వంటివి ఉన్నాయి. కొన్ని నెలల క్రితమే దీనికి సంబంధించిన లైసెన్స్‌ల ప్రక్రియ మొదలైపోయింది. తొలుత పామాయిల్‌, అగర్‌బత్తీలు, టైర్లు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొన్నారు. తాజాగా లద్దాక్‌ వద్ద ఉద్రిక్తతలు పెరగడంతో భారత్‌ ఈ జాబితాను విస్తరించే అంశాన్ని పరిశీలిస్తోంది.

* మాస్కు పెట్టుకోవాలని సూచించినందుకు తోటి ఉద్యోగినిపై విచక్షణా రహితంగా దాడి చేసిన అధికారి ఎట్టకేలకు సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఈనెల 27న నెల్లూరులోని టూరిజం హోటల్‌ కార్యాలయంలో జరిగిన ఘటన దురదృష్టకరమని ఏపీ టీడీసీ ఎండీ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. నెల్లూరు పర్యాటకశాఖ డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌ను సస్పెండ్‌ చేసినట్టు చెప్పారు.

* యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని భారతీయ కంపెనీలు, సంపన్నులు, సబ్సిడరీలు తాము నిజంగా అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని నిరూపించుకోవాలి. దీనికి నేటి సాయంత్రంతో గడువు ముగియనుంది. అక్కడ ఆర్థిక కార్యకలాపాల నుంచే లాభాలు ఆర్జించినట్లు ప్రభుత్వానికి తగిన ఆధారాలు సమర్పించాల్సి ఉంది. ఇప్పటికే చాలా కంపెనీలు స్విట్జర్లాండ్‌ నుంచి మకాం మార్చి యూఏఈకి వచ్చి స్థిరపడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

* భారత్‌లో ఉద్యోగుల ఆత్మవిశ్వాసం పెరిగినట్టు తెలిసింది. రాబోయే ఆరు నెలల్లో తమ ఆదాయం, ఖర్చులు పెరుగుతాయని ప్రతి నలుగురులో ఒకరు పేర్కొన్నారని లింక్‌డ్‌ఇన్‌ సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 1351 మంది ఉద్యోగులు/ప్రొఫెషనల్స్‌ను జూన్‌-14 వరకు సర్వే చేయగా తమ వ్యక్తిగత ఆర్థికస్థితిపై చాలామంది ఆశాభావం వ్యక్తం చేశారు.