WorldWonders

కుక్కలపై కిమ్ కక్కుర్తి

కుక్కలపై కిమ్ కక్కుర్తి

ఉత్తర కొరియా ప్రజల శ్రమని దోచుకుంటున్న ఆ దేశాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తాజాగా వారు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న శునకాల్ని కూడా లాక్కుంటున్నాడు. ఈ మేరకు ప్రజలు పెంపుడు శునకాల్ని ప్రభుత్వానికి అప్పగించాలంటూ ఆదేశాలు జారీ చేశాడు.

ఉత్తరకొరియా, దక్షిణ కొరియాలో కొంత మంది శునకాల మాంసాన్ని తింటుంటారు. రెస్టారెంట్లలో శునకాల మాంసంతో చేసిన వంటకాలు రుచికరంగా ఉంటాయట. ప్రస్తుతం ఉత్తరకొరియాలో ఆహార సరఫరాలో సంక్షోభం ఏర్పడింది. దీంతో రెస్టాంరెంట్లకు శునకాల సరఫరా తగ్గుముఖం పట్టింది. అయితే ఈ సంక్షోభానికి కూడా కిమ్‌.. ప్రజలతోనే పరిష్కారం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. రెస్టారెంట్లకు శునకాల మాంసం కోసం ప్రజలు పెంచుకుంటున్న శునకాలను వినియోగించాలని నిర్ణయించాడు. అనుకున్నదే ఆలస్యం.. ప్రజలు పెంపుడు శునకాల్ని ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించాడు. దీంతో అధికారులు ప్రజల నుంచి బలవంతంగా పెంపుడు శునకాల్ని లాక్కుంటున్నారు. అలా సేకరించిన శునకాల్లో కొన్నింటిని జూకి పంపి.. మరికొన్నింటిని రెస్టారెంట్లకు పంపిణీ చేస్తారట.

ఈ ఉత్తర్వుల కోసమే గత నెలలో కిమ్‌ శునకాలను పెంచుకోవడంపై నిషేధం విధించాడట. ఉత్తర కొరియాలో పేద ప్రజలు ఎక్కువగా పందులను, కోళ్లను పెంచుకుంటారు. ఉన్నతాధికారులు.. ఎగువ మధ్యతరగతి కుటుంబాలు మాత్రమే శునకాల్ని పెంచుకుంటాయి. ఇప్పుడు వారి నుంచి ప్రభుత్వం శునకాల్ని లాక్కునే పనిలో పడింది.