* బుల్లితెర నటి శ్రావణి బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని మధురానగర్లో తన నివాసంలో మంగళవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.కొంతకాలం క్రితం ఓ యువకుడు టిక్ టాక్ ద్వారా శ్రావణికి పరిచయమయ్యాడు. అతను డబ్బులు ఇవ్వమని శ్రావణిని తరచూ వేధించేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అతని వేధింపులు భరించలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని వారు ఆరోపిస్తున్నారు. శ్రావణిని ప్రేమించినట్లు నమ్మించి ఆమెతో సన్నిహితంగా ఉంటూ ఫొటోలు దిగినట్టు బంధువులు తెలిపారు. ఆ ఫొటోలు బయటపెడతానంటూ డబ్బులు డిమాండ్ చేశాడని వివరించారు. వేధింపులు అధికం కావడంతో శ్రావణి ఇటీవల ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిందన్నారు. అయినప్పటికీ వేధింపులు ఆపకపోవడంతో ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మనసు మమత, మౌనరాగం సీరియల్స్లో శ్రావణి నటించారు.
* ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.ఈ ఘటన ఒడిశా రాష్ర్టం కలహండి జిల్లాలోని కలహండి-కందమాల్ సరిహద్దు బండరంగి సిర్కి అటవీ ప్రాంతంలో నేడు చోటుచేసుకుంది.భద్రతా బలగాల సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందగా ఒడిశా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్కు చెందిన ఓ జవాను గాయపడ్డాడు. గాయపడ్డ జవాన్ను చికిత్స నిమిత్తం తరలించారు.విశ్వసనీయ సమాచారం మేరకు డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్(డీవీఎఫ్)తో కలిసి ఎస్వోజీ మంగళవారం నుంచి కూంబింగ్ ఆపరేషన్ను చేపట్టాయి.ఈ ఉదయం 11 గంటలకు ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. నాలుగున్నర గంటలపాటు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.సంఘటనా స్థలంలో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
* నరసరావుపేట లో భారీ గుట్కా నిల్వలు స్వాధీనంనరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బరంపేట రిక్షా సెంటర్ సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా బ్యాగు లను స్వాధీనం చేసుకున్నట్లు టూ టౌన్ సీఐ పి కృష్ణయ్య విలేఖరులకు తెలిపారు.నరసరావుపేట పట్టణానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి బెంగళూరు నుంచి గుట్కా ప్యాకెట్లను తీసుకువచ్చి నరసరావుపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడిచేసి పట్టుకున్నట్లు తెలిపారు 56 బ్యాగ్ లను స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ సుమారు 13 లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఉందని పేర్కొన్నారు.బెంగళూరుకు చెందిన కె ఎస్ ఆర్ ట్రేడర్స్ నుంచి కొనుగోలు చేసి తెస్తున్నట్లు తెలిపారు.కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు చెప్పారు.దాడుల్లో సి ఐ పి కృష్ణతో పాటు ఎస్ఐ నాగరాజు సిబ్బంది శంకర్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.
* రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో హిందుత్వ ఆలయాలపై జరుగుతున్న దాడులపై హిందుత్వ సంస్థలు చేసే పోరాటానికి భాజపా నైతికంగా మద్దతు ఇస్తుందని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు.
* తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీస్ యాక్టు అమలులో ఉందని, ఇతరులెవరూ అంతర్వేదికి రావద్దని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు తెలిపారు.అంతర్వేది అగ్నిప్రమాద సంఘటన స్థలం వద్ద క్యాంప్ను ఏర్పాటు చేసినట్లు డీఐజీ తెలిపారు.ప్రమాదంపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.ఫోరెన్సిక్ శాఖ నిపుణులు సంఘటన స్థలం వద్ద నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు.పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.కొంతమంది శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రయత్నించారని అన్నారు.
* ఆఫ్ఘనిస్తాన్రాజధాని కాబూల్లో ఇవాళ బాంబు పేలుడు జరిగింది.ఆ దేశ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ను టార్గెట్ చేస్తూ బాంబు దాడికి ప్రయత్నించారు.ఈ దాడిలో సుమారు 10 మంది మృతిచెందారు. గతంలో ఆఫ్ఘన్ ఇంటెలిజెన్స్ సర్వీసులో పనిచేసిన సలేహ్కు పేలుడు వల్ల స్వల్ప గాయాలయ్యాయి.పేలుడు ఘటన తర్వాత భారీ స్థాయిలో పొగు కమ్ముకున్నది. ఆఫ్ఘన్ అధికారులు, తాలిబన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్న వేళ ఈ ఘటన చోటుచేసుకున్నది.తాలిబన్ను వ్యతిరేకిస్తున్న వారిలో సలేహ్ ఒకరు. అయితే ఈ దాడికి తాము కారణం కాదంటూ మిలిటెంట్ సంస్థ ప్రకటించింది.సలేహ్పై జరిగిన బాంబు దాడి ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది.
* సీతానగరం మండలం ఠాణాలో ఎస్సీ యువకుడి శిరోముండనం కేసులో నిందితులు, వైకాపా నాయకులకు హైకోర్టులో ఊరట లభించింది .ఈ కేసులో వారిపై అరెస్ట్తో పాటు తదుపరి చర్యలన్నింటిని నిలువరిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న శిరోముండన బాధితుడు ప్రసాద్కు నోటీసులు జారీచేసింది.ఇసుక మాఫియాను ఎదురించినందుకు వైకాపా నేత కవల కృష్ణమూర్తి , ఆయన అనుచరులు శిరోముండనం చేయించారని బాధితుడు ఆరోపించారు.