NRI-NRT

అండర్ గ్రాడ్యూయేట్ చదువులకు అమెరికా వైపు పరుగు

Indian Under Graduate Students Rushing To USA For Education

అమెరికా చదువులపై ఆదరణ కొనసాగుతోంది. 2019-20 విద్యా సంవత్సరంలో మన దేశానికి చెందిన సుమారు 2 లక్షల మంది విద్యార్థులు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రవేశాలు పొందారు. అన్ని దేశాల నుంచి 10.75 లక్షలకు పైగా విద్యార్థులు వెళ్లగా.. ఇందులో 18 శాతం మంది భారత్‌కు చెందిన వారే ఉన్నారు. అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో ప్రవేశాలు పొందుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అమెరికా రాయబార కార్యాలయం సోమవారం ఓపెన్‌ డోర్స్‌ నివేదికను విడుదల చేసింది. గత పదేళ్లలో భారత్‌ విద్యార్థుల సంఖ్య దాదాపు రెండింతలైందని పేర్కొంది.
*అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులు..
2019-20 విద్యా సంవత్సరంలో అకడమిక్‌తో పాటు ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ) కలిపి 10,75,496 మంది విదేశీ విద్యార్థులు అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందారు. మొత్తం ప్రవేశాల్లో అంతర్జాతీయ విద్యార్థులు 5.5శాతంగా ఉన్నారు. ఇందులో ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన వారే అధికం. ఆ తర్వాత గణితం, కంప్యూటర్‌ సైన్సు చదివే వారు ఉన్నారు. మూడో స్థానంలో వాణిజ్యం, మేనేజ్‌మెంట్‌ కోర్సులు చదివేవారు ఉన్నారు.
చైనా, భారత్‌ నుంచే 52.6శాతం
అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందుతున్న వారిలో చైనా నుంచి 34.6 శాతం, భారత్‌ నుంచి 18 శాతం మంది విద్యార్థులు ఉన్నారు. 2018-19తో పోల్చితే 2019-20లో మన దేశ విద్యార్థుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. 2018-19లో అంతర్జాతీయ విద్యార్థుల్లో 18.4శాతంతో 2,02,014మంది ఉండగా.. ఈసారి ఇది 18 శాతంతో 1,93,124కు తగ్గింది. చైనా నుంచి ప్రవేశాలు పొందిన వారి సంఖ్య మాత్రం 0.8కు పెరిగింది.
*హైదరాబాద్‌లో మరో సలహా కేంద్రం
అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు సలహాలు, సూచనలు అందించేందుకు హైదరాబాద్‌, దిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్‌, ముంబయిల్లో అమెరికా విద్య సలహా కేంద్రాలను యూఎస్‌ డిపార్టుమెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది ప్రారంభంలో వై-యాక్సిస్‌ ఫౌండేషన్‌తో కలిసి రెండో అమెరికా విద్య కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. విద్య అమెరికా ఇండియా యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.