Devotional

అసలు యజ్ఞం అంటే ఏమిటి?

అసలు యజ్ఞం అంటే ఏమిటి?

ఇటీవల పలువురు ప్రముఖులు యజ్ఞాలు చేస్తుండడం వల్ల మనకు యజ్ఞం అంటే కొంత అవగాహన కలిగింది. ఇది ఏదో ఒక దేవతను ఉద్దేశించి చేసే పూజ, ఇందులో కొన్ని నియమాలు, పద్ధతులున్నాయి. ఒక యజ్ఞశాల అంటూ అవసరం. అందులో అగ్నిని ఉంచడానికి ఒక నిర్ణీతమైన పద్ధతిలో ఒక యజ్ఞవేదికను ఏర్పాటు చేయాలి. ఆ వేదికను కొన్ని నిర్ణీతమైన కొలతల ప్రకారం నిర్మించాలి. అగ్నిలో అహుతి చేయడానికి సమిధలు, నేయి, పండ్లులాంటి అనేక సాధనాలు కావాలి. వివిధ వేదమంత్రాలను చదివే పండితులు కావాలి. చాలా మంది వ్యక్తుల సహకారంతో నిర్వహించబడే పని ఇది. ఏదో ఒక ఫలాన్ని ఆశించి చేసే ప్రక్రియ. ఆశించిన ఫలం రాజకీయబలం కావచ్చు, ధనబలం కావచ్చు లేదా లోకశాంతి కావచ్చు.మనిషి ఎపుడూ ఏదో ఒక పనిచేసే స్వభావం కలవాడు. క్షణం కూడా ఊరక ఉండలేడు. ఏవో పనులు అనుమతించకపోతే అతడు వాంఛితమైన పనులు చేస్తూ ఉండవచ్చు. అందువల్ల అతన్ని ఉదయం నుంచి రాత్రి వరకు తీరిక లేకుండా ఉండడానికై వేదాలు అనేక నియమాలు చెప్పాయి. ఉదయం ఎప్పుడు మేల్కోవాలి, రోజు చేయాల్సిన పూజలు ఏమిటి? అలాగే ప్రత్యేక దినాల్లో చేయాల్సిన పూజలు ఏమిటి మొదలైన వాటిని చెప్పాయి. ఫలితం లేకుండా పూజ చేయమంటే ఎవరూ చేయరు. కావున ఈ పూజల వల్ల పుణ్యమనే ఫలితం ఉంటుందనీ, ఆ పుణ్యం వల్ల స్వర్గానికి వెళతామని చెప్పాయి. ఫలితం వెంటనే లభించి ఇంద్రుడు నిజంగానే స్వర్గానికి రమ్మని రథాన్ని పంపిస్తే వెళ్లడానికి మనం సిద్ధంగా లేం కనుక ఈ యజ్ఞ ఫలం వెంటనే రాదనీ, అది మన బ్యాంకు బ్యాలెన్సులాగ జమకూడి ఉంటుందని చెప్పారు. ఈ బ్యాలెన్సుకు అపూర్వం అని పేరు.మొత్తానికి ఈ యజ్ఞాల పేరిట యజ్ఞం చేసే వ్యక్తి(ఇతనిని యజమాని అంటారు) ఇతరులకు అనేక దానాలు చేయడం, అన్నసంతర్పణలు చేయడం లాంటి మంచి పనులు చేస్తాడు. అందువల్ల అతనికి కొంత తృప్తి కూడా లభిస్తుంది. అవాంఛితమైన పనులు చేయకుండా మనిషి సమాజం అనుమతించిన పనుల్నే చేయడం వల్ల సమాజంలో క్రమశిక్షణ ఉంటుంది. అయినా ఒక వ్యక్తి ఏదో ఫలాన్ని ఆశించి చేసే పని కావున ఆధ్యాత్మిక ఉన్నతి గొప్పగా ఉండదు. ఈ ఆధ్యాత్మిక ఉన్నతి కోసమే కర్మయోగం అనేదాన్ని ఉపనిషత్తులు చెప్పాయి(దీన్నిగూర్చి ఇది వరకు వ్యాసాల్లో వివరంగా చూశాం). వ్యక్తిగత ఫలం ఆశించకుండా ఇది చేయడం నా కర్తవ్యం. దీనివల్ల కొందరికి మేలు కలుగుతుంది అనే ఉద్దేశంతో చేయడం కర్మయోగం. దీన్నే నిష్కామకర్మ అని కూడా తెలుసుకున్నాం.అందరూ పైచెప్పిన యజ్ఞాలు చేయలేకపోవచ్చు. వాటికి ఆర్థికస్థోమత కావాలి. చాలా మంది పేదరికంలో ఉన్నా నియమనిష్ఠలతో పవిత్రమైన జీవితం గడుపుతూ ఉండవచ్చు. వారికి మార్గం ఏమిటి? అందువల్ల శ్రీకృష్ణుడు భగవద్గీతలోని నాలుగవ అధ్యాయంలో యజ్ఞం అనే పదానికి చాలా విస్తృతమైన అర్థాన్ని చెప్పాడు. ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞం, యోగయజ్ఞం, స్వాధ్యాయయజ్ఞం, జ్ఞానయజ్ఞం అంటూ విభజన చేశాడు. పై చెప్పిన విధంగా అనేక సాధన సామగ్రిని సమకూర్చుకుని చేసే యజ్ఞం ద్రవ్యయజ్ఞం. అంతేకాక పుణ్యతీర్థాలలో దానాలు చేయడం, పూజనీయులైన వ్యక్తులకు లేదా కార్యాలకు ధనమివ్వడం, ప్రజల కోసం బావులు, చెరువులు తవ్వించడం మొదలైనవి కూడా ద్రవ్యయజ్ఞాలు.తపస్సు అంటే సత్యాన్ని గూర్చి ధ్యానించడం, ఆలోచించడం అని అర్థం. ఇలాంటి ధ్యానానికి తపస్సు అని పేరు. దానిలో నిమగ్నమై ఉండడం తపోయజ్ఞం. కఠినమైన శారీరక నియమాలున్న చాంద్రాయణం మొదలైనవి తపోయజ్ఞాల్లో మరొకరకం. చాంద్రాయణం అంటే చంద్రుని అయనం(చంద్రుడు పెరగడం, క్షీణించడం)ను అనుసరిస్తూ పాడ్యమి రోజు ఒక ముద్ద భోజనంతో మొదలుపెట్టి పదిహేనవ రోజు పదిహేను ముద్దలు, మళ్లీ పదిహేను రోజులు రోజుకొక ముద్దను తగ్గిస్తూ అమావాస్య రోజు ఒకే ముద్దతో ముగించడం అనే వ్రతం. యోగయజ్ఞాలు అనేక రకాలు. పతంజలి యోగసూత్రాల్లో చెప్పిన ప్రాణాయామ పద్ధతులు, అనగా గాలిని పీల్చుకోవడం, వదలడం ద్వారా మనస్సును నిగ్రహించుకోవడం కూడా ఒక విధమైన అహుతియే. అలాగే ఇంద్రియాలను నిగ్రహించడం అన్నది సంయమనం అనే అగ్నిలో హోమం చేయడంలాంటిది. విషయాల్ని ఇంద్రియాలలో అహుతి చేయడం మరొక యజ్ఞం. ఇంద్రియాలు లాగినట్టల్లా వెళ్లకుండా శాస్త్రం అనుమతించిన వాటినే గ్రహించడం, శాస్త్రం అనుమతించని వాటిని వదిలేయడం దీనర్థం. లక్షల ఖర్చుతో ద్రవ్యయజ్ఞం చేయడం కంటే మనస్సును అదుపులో ఉంచుకోవడం కష్టం కావున దాన్ని యజ్ఞమన్నారు. అలాగే సమయం వృథా చేయకుండా శాస్త్రవిషయాల్ని(గీత, ఉపనిషత్తులు వాటిని) తెలుసుకోవడం స్వాధ్యాయ యజ్ఞం.మిగతా అన్ని యజ్ఞాల కంటే జ్ఞానయజ్ఞం గొప్పది అంటాడు శ్రీకృష్ణుడు. జ్ఞానమంటే మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడం. దేవుడు అంటే కేవలం చైతన్యమే అని, అదే ప్రపంచరూపంలో కనిపిస్తుందనీ, జీవుడు కూడా చైతన్యమే అని ఉపనిషత సిద్ధాంతం. యజ్ఞంలో ఆహుతుల్ని అగ్నిలో సమర్పిస్తాం. ఆ ఆహుతులన్నీ భస్మమైపోతాయి. పైచెప్పిన ద్రవ్యయజ్ఞంలో ద్రవ్యాన్ని ఇతరులకు ఇవ్వడమనేది ఆహుతిలాంటిది. యోగయజ్ఞంలో ఇంద్రియాల్ని నిగ్రహించడం అనేది ఆహుతిలాంటిదే. అలాగే బ్రహ్మ అనే అగ్నిలో ‘నేను’ను ఆహుతి చేయడం జ్ఞానయజ్ఞం. అనగా ‘నేను’, ‘అహం’ అనే భావనను విలీనం చేయడం. దేహము, ఇంద్రియాలు కలిసిన ముద్దయే నేను అనే భావనను నేను చూస్తున్నదంతా బ్రహ్మయే అనే భావనలో ఆహుతి చేయడం.‘నేను’ అంటే సమాజంలో నా స్థానం, అంతస్తు, మతం, కులం, జాతీయత, విద్యార్హతలు, నాకున్న ఇష్టాలు, అయిష్టాలు, ప్రేమ, ద్వేషం, కోరికలు మొదలైన వాటన్నింటి సమాహారం(కలయిక). జ్ఞానమనే అగ్నిలో ‘నేను’ను ఆహుతి చేయడమంటే పై అన్నింటినీ తోసిపుచ్చడం. ఇవన్నీ కేవలం సాపేక్షికమైనవే అని వాటన్నింటినీ విశ్లేషించి వివేకమనే అగ్నిలో కాల్చి బూడిద చేయడం. జాతీయత, కులం, మతం మొదలైన అన్నింటికీ అతీతంగా ఉండడం. దీన్ని జ్ఞానాగ్ని అంటాడు కృష్ణుడు. ఈ జ్ఞానాగ్నిలో మన కర్మలు(చేసే పనులు) అన్నీ నశిస్తాయి అంటాడు. ఇట్లాంటి వివేకమున్న వ్యక్తి ఏ పనిచేసినా అది సమాజం శ్రేయస్సుకే ఉంటుందని అతని సొంతానికి ఫలితమేమీ ఉండదనీ దీని అర్థం.భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన పై యజ్ఞాలన్నీ జ్ఞానానికి తోడ్పడేవి. కేవలం యజ్ఞాలు, కర్మకాండ ముఖ్యమనుకునే ఆ రోజుల్లో వేదవ్యాసుడు శ్రీకృష్ణుడి పాత్రద్వారా సమాజంలో అన్ని స్థాయిల్లో ఉన్న వ్యక్తులకూ ఆధ్యాత్మిక మార్గం చూపించాడు. వ్యక్తిగత జీవితంలో శరీరేంద్రియాల్ని అదుపులో పెట్టుకోవడం కూడా యజ్ఞమే అని చెప్పడం, సమాజ శ్రేయస్సుకై చేసే ఎలాంటి పనైనా యజ్ఞంలాంటిదే అని చెప్పడం బహుశా ఆ కాలానికి విప్లవాత్మకమైనవిగా అనిపించి ఉండవచ్చు.