Sports

రెజ్లింగ్‌లో ఇండియాకు పసిడి పంట

ఆసియా రెజ్లింగ్‌లో భారత్‌కు పసిడి పంట పండింది. ఒకేరోజు మూడు స్వర్ణ పతకాలు ఖాతాలో చేరాయి. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌ బెర్తులు సాధించిన వినేశ్‌ ఫొగాట్‌ (53 కేజీలు), అన్షు మలిక్‌ (57 కేజీలు)తో పాటు యువ తార దివ్యా కక్రాన్‌ (72 కేజీలు) పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌ (65 కేజీలు) రజతం నెగ్గింది. శుక్రవారం జరిగిన 53 కేజీల ఫైనల్లో ఫొగాట్‌ 6-0తో మెంగ్‌సున్‌ (చైనీస్‌ తైపీ)పై విజయం సాధించింది. సెమీస్‌లో హ్యున్‌యంగ్‌ వైదొలగడంతో వినేశ్‌ నేరుగా ఫైనల్‌ చేరింది. గతేడాది ఆసియా ఛాంపియన్‌షిప్‌లోనూ కాంస్యం గెలిచిన ఫొగాట్‌కు ఈ టోర్నీలో స్వర్ణం గెలవడం ఇదే తొలిసారి. మొత్తం మీద ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఆమెకిది ఏడో పతకం. 57 కేజీల ఫైనల్లో 19 ఏళ్ల అన్షు మలిక్‌ 3-0తో అల్టాన్‌సెట్‌సెగ్‌ (మంగోలియా)ను చిత్తు చేయగా.. 72 కేజీల తుది సమరంలో సుజిన్‌ (కొరియా)ను దివ్య కక్రాన్‌ ఓడించింది.65 కేజీల ఫైనల్లో జిర్‌గిట్‌ (మంగోలియా) చేతిలో సాక్షి మలిక్‌ (65 కేజీలు) పరాజయం పాలై రజతంతో సంతృప్తి పడింది. మహిళల విభాగంలో నాలుగు స్వర్ణాలు గెలిచిన భారత్‌, ఓ రజతం, రెండు కాంస్య పతకాలను నెగ్గింది.