* ఈ నెల 23న జరగాల్సిన ఫార్మసిస్టు, డేటా అనలిస్టు ఉద్యోగాలకు సంబంధించిన నియామక పరీక్షలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వాయిదా వేసింది. కొవిడ్ 19 ఉద్ధృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు బుధవారం తెలిపింది. పరీక్షలు నిర్వహించబోయే కొత్త తేదీలను బ్యాంకు ఇంకా ప్రకటించలేదు. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఇప్పటికే విడుదల చేసినట్లు ఎస్బీఐ తెలిపింది. మరోవైపు ఇదే బ్యాంకులో జూనియర్ అసోసియేట్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ర్టేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది.
* దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు (మే 19) నష్టాల్లో ముగిశాయి. 50 వేల మార్కును దాటి ఒక రోజు లోపే మళ్లీ దిగువకు సెన్సెక్స్ జారుకుంది. ఉదయం నుంచే ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు కొంత సేపు ఊగిసలాట ధోరణి కనబరిచాయి. చివరకు మధ్యాహ్నం తర్వాత చిన్నగా నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా కీలక రంగాలకు సంబందించిన సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం 50,088 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 290 పాయింట్ల నష్టంతో 49,902 వద్ద ముగిసింది. దీంతో పాటే నిఫ్టీ కూడా అదే ట్రెండ్ కొనసాగించింది. 15,058 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 15,133-15,008 మధ్య కదలాడి చివరకు 77 పాయింట్ల నష్టంతో 15,030 వద్ద ముగిసింది.
* బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ప్రపంచ ధనవంతుల జాబితాలో తన రెండవ స్థానాన్ని కోల్పోయి మూడవ స్థానంలో నిలిచారు. ఇప్పుడు రెండవ స్థానంలో ఎల్విఎంహెచ్ చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఉన్నారు. గత వారం గ్లోబల్ స్టాట్ ఆఫ్ టెక్నాలజీ స్టాక్స్ తర్వాత టెస్లా షేర్లు బాగా పడిపోయాయి. మార్చిలో బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ సూచికలో అగ్రస్థానంలో ఉన్న మస్క్ సంపద 160.6 బిలియన్ డాలర్ల(24 శాతం)కు తగ్గింది. దీనికి ప్రధాన కారణం టెస్లా ఇకపై డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్లను చెల్లింపుగా అంగీకరించట్లేదని మస్క్ మే 13న ట్వీట్ చేయడమే. ట్వీట్ చేసిన తర్వాత బిట్ కాయిన్ల షేర్ విలువ 6.2 శాతం తగ్గింది. ప్రస్తుతం బిట్ కాయిన్ ధర 42,185 డాలర్లుగా ఉంది. ఫిబ్రవరి 8 తర్వాత ఇదే తక్కువ. ఫిబ్రవరి 8న బిట్ కాయిన్ 43,564 డాలర్లు పలికింది.
* కరోనాపై పోరులో గుజరాత్లోని విజయ్ రూపానీ సర్కార్కు అండగా నిలిచేందుకు దేశీయ అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (ఎంఎస్ఐ) ముందుకు వచ్చింది. అహ్మదాబాద్ జిల్లా సీతాపూర్లో మల్టీ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. జైడస్ హాస్పిటల్స్తో కలిసి దీన్ని నిర్వహించనున్నది.