Business

డిజిటల్ బంగారం అంటే తెలుసా? అందులో పెట్టుబడి ఇలా చేయండి-వాణిజ్యం

డిజిటల్ బంగారం అంటే తెలుసా? అందులో పెట్టుబడి ఇలా చేయండి-వాణిజ్యం

* విదేశీ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు పలు దేశీయ పరిణామాల నేపథ్యంలో సూచీలు లాభాల పరంపరను మంగళవారమూ కొనసాగించాయి. అన్ని రంగాల షేర్లు రాణించడంతో.. సెన్సెక్స్‌, నిఫ్టీ సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 57,500 మార్క్‌ను దాటగా.. నిఫ్టీ 17,000 కీలక మైలురాయిని సునాయాసంగా దాటేసింది. సెన్సెక్స్‌ 662 పాయింట్లు లాభపడింది. సూచీల లాభాల్లో వరుసగా రెండోరోజూ భారతీ ఎయిర్‌టెల్‌ కీలక పాత్ర పోషించింది. రూ.21,000 కోట్ల రైట్స్‌ ఇష్యూకు కంపెనీ బోర్డు ఆమోదం తెలపడంతో ఈ షేరు గరిష్ఠంగా ఈరోజు దాదాపు ఏడు శాతం దూసుకెళ్లడం విశేషం.

* భారత్‌లో వ్యాపార సంస్థలకు చెల్లింపుల సేవలను అందజేస్తున్న ప్రముఖ కంపెనీ బిల్‌డెస్క్‌ను ప్రముఖ కన్జ్యూమర్‌ ఇంటర్నెట్‌ సేవల కంపెనీ ప్రోసస్‌ ఎన్‌.వి కొనుగోలు చేసింది. ఈ ఒప్పంద విలువ 4.7 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.34.4 వేల కోట్లు). ఇప్పటికే భారత్‌లో ‘పేయూ’ ద్వారా డిజిటల్‌ చెల్లింపుల సేవలను అందజేస్తున్న ప్రోసస్‌కు ఇకపై బిల్‌డెస్క్‌ కూడా జతకానుంది. దీంతో భారత్‌లో ఏటా 400 కోట్ల లావాదేవీలను నిర్వహించే సామర్థ్యం తమకు రానుందని ప్రోసస్‌ వెల్లడించింది. ఈ ఇరు సంస్థల మధ్య ఒప్పందానికి ‘కాంపిటీషన్ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా’ నుంచి అనుమతులు లభించాల్సి ఉంది.

* భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా.. భారతీయులకు పసిడిపై ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు. గత ఏడాది ప్రపంచంలో అత్యధిక బంగారం దిగుమతి చేసుకున్న దేశాల జాబితాలో భారత్‌ది తొలిస్థానం. భారతీయులు బంగారాన్ని ఓ పెట్టుబడి సాధనంగానూ ఉపయోగించుకుంటున్నారు. అయితే, గతంలో వలే బంగారాన్ని నేరుగా లోహరూపంలో కొనాల్సిన అవసరం లేదు. గోల్డ్‌ బాండ్లు, ఈటీఎఫ్‌లు, డిజిటల్‌ గోల్డ్‌ ఇలా పలు మార్గాల్లో మదుపు చేయొచ్చు. కొత్త తరం కుర్రకారు డిజిటల్‌ గోల్డ్‌లో మదుపు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరి డిజిటల్‌ గోల్డ్‌ అంటే ఏంటో చూద్దాం! పేరు సూచిస్తున్నట్లుగా మీ వద్ద భౌతికంగా బంగారం ఉండదు. మీరు కొనుగోలు చేసిన బంగారాన్ని వర్చువల్‌గా ఆన్‌లైన్‌ ఖాతాలో ఉంచవచ్చు. డబ్బులు చెల్లించిన ప్రతిసారి అంత విలువైన బంగారాన్ని విక్రేతలే కొని వారి వద్ద ఉంచుతారు. సాధారణంగా లోహరూపంలో బంగారాన్ని కొనాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం రూ.5 వేలైనా అవసరం. అంతకంటే తక్కువ అంటే కష్టమే. కానీ, డిజిటల్‌ గోల్డ్‌లో అలా కాదు. ఒక్క రూపాయి విలువైన బంగారాన్ని కూడా కొనుగోలు చేయొచ్చు. పైగా నకిలీని గుర్తించడం కష్టమవుతున్న ఈరోజుల్లో డిజిటల్‌ గోల్డ్‌ వల్ల అటువంటి సమస్యలేమీ ఉండవు. అలాగే, బంగారం లోహరూపంలో మన దగ్గర ఉందంటే.. ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి. కానీ, డిజిటల్‌ గోల్డ్‌ వల్ల అలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. మన తరఫున విక్రేతలే బంగారాన్ని కొని సురక్షితంగా ఉంచుతారు. బీమా సౌకర్యం కూడా ఉంటుంది. పైగా వీటి ధరలు అంతర్జాతీయ మార్కెట్‌తో అనుసంధానమై ఉంటాయి. దీంతో ధరలపై స్థానిక పరిణామాల ప్రభావం ఉండదు. మీరు కావాలనుకున్నప్పుడు లోహరూపంలో మీకు అందజేస్తారు. ఆన్‌లైన్‌ రుణాలకు డిజిటల్‌ గోల్డ్‌ తనఖా పెట్టొచ్చు. ఈ ప్రయోజనాల కారణంగానే డిజిటల్‌ గోల్డ్‌కి ఈ మధ్యకాలంలో అత్యంత ప్రాచుర్యం లభించింది. భారత్‌లో ఆగ్మొంట్‌ గోల్డ్‌ లిమిటెడ్‌, ఎంఎంటీసీ-పీఎఎంపీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, డిజిటల్‌ గోల్డ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు డిజిటల్‌ గోల్డ్‌ను విక్రయిస్తున్నాయి. ఈ కంపెనీల సేవల్ని పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌ పే, అమెజాన్‌ పే, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ వంటి ఫిన్‌టెక్‌ సంస్థలతో పాటు తనిష్క్‌, పీసీజే లాంటి పసిడి విక్రయ సంస్థలు కూడా వినియోగదారులకు చేరువ చేస్తున్నాయి. వీటితో పాటు పలు మొబైల్‌ వ్యాలెట్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫారంలు కూడా పైన తెలిపిన మూడు కంపెనీల డిజిటల్‌ గోల్డ్‌ ఉత్పత్తులను పంపిణీ చేస్తున్నాయి. ఒకరకంగా ఈ సంస్థలు డిజిటల్‌ గోల్డ్‌ పంపిణీ వ్యవస్థల వలే వ్యవహరిస్తున్నాయి. ఇప్పటి వరకు ఫిన్‌టెక్‌తో పాటు స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలు కూడా డిజిటల్‌ గోల్డ్‌ను వినియోగదారులకు చేరువ చేశాయి. కానీ, సెప్టెంబరు 10 నుంచి అది సాధ్యం కాదని సెబీ తేల్చి చెప్పింది. సెక్యూరిటీస్‌ కాంట్రాక్ట్స్‌ నిబంధనలు, 1957 ప్రకారం.. డిజిటల్‌ గోల్డ్‌ను ఓ సెక్యూరిటీగా గుర్తించలేమని స్పష్టం చేసింది. దీంతో డిజిటల్‌ గోల్డ్‌ విక్రయాన్ని నియంత్రించడం సెబీ పరిధిలోకి రాబోదని పేర్కొంది. ఈ నేపథ్యంలో తమ అధీనంలో ఉన్న సంస్థలు ఈ విక్రయాలను ఆపేయాలని తెలిపింది. ఇప్పటికే బ్రోకింగ్‌ సంస్థల ద్వారా డిజిటల్‌ గోల్డ్‌ కొనుగోలు చేసినవారు అవే సంస్థల ద్వారా విక్రయించాలి. లేదా లోహరూపంలో బంగారాన్ని తీసుకోవచ్చు. ఇకపై మదుపర్లు నేరుగా డిజిటల్‌ గోల్డ్‌ విక్రయిస్తున్న సంస్థలతోనే సంబంధాలు కొనసాగించాలి. అయితే, నాన్‌ బ్రోకింగ్‌ వేదికలైన ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలు మాత్రం ఈ సేవల్ని వినియోగదారులకు చేరువ చేయొచ్చు.

* టాటా మోటార్స్ భార‌త్ మార్కెట్‌లో న్యూ టిగోర్ ఎల‌క్ట్రిక్ కారును లాంఛ్ చేసింది. టిగోర్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ వెర్ష‌న్‌గా ముందుకొచ్చిన ఈ వాహ‌నం ధ‌ర రూ 11.99 లక్ష‌ల‌కు (ఎక్స్‌షోరూం) అందుబాటులో ఉంది. బీఎస్‌6 టిగోర్ స‌బ్ కాంపాక్ట్ సెడ‌న్‌కు అనుగుణంగా న్యూ టిగోర్ ఈవీలో కంపెనీ ప‌లు మార్పులు చేప‌ట్టింది.

* టెలికాం రంగంలో ప్రపంచంలో ఎక్కడాలేనంత అధికంగా పన్నులు, సుంకాలు ఇండియాలో ఉన్నాయని, ప్రస్తుత దేశీ టెలికాం రంగ వెతలకు కేంద్ర ప్రభుత్వ పన్ను విధానాల కారణమని భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ విమర్శించారు. సోమవారం ఇన్వెస్టర్లతో ఇన్వెసర్లతో కాన్ఫెరెన్స్‌కాల్‌లో ఆయన మాట్లాడుతూ తాము సంపాదించే రూ.100లో రూ.35 ప్రభుత్వమే తీసుకుంటున్నదన్నారు. ఏజీఆర్‌, స్పెక్ట్రమ్‌ చెల్లింపులు సైతం భారీగా ఉండటంతో కంపెనీల రుణభారం పెరిగిపోయిందని మిట్టల్‌ చెప్పారు. పరిశ్రమ డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని ఆయన కోరారు. టెలికాం పరిశ్రమపై ప్రభుత్వం మోపిన భారం తగ్గుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.