Politics

ఇరవై ఏళ్లుగా అక్కడ ఆమే మహారాణి! – ఉత్తరాఖండ్‌లోని యమకేశ్వర్‌ ప్రత్యేకత.

ఇరవై ఏళ్లుగా అక్కడ ఆమే మహారాణి! –  ఉత్తరాఖండ్‌లోని యమకేశ్వర్‌ ప్రత్యేకత.

యమకేశ్వర్ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి మహిళకే ఆ ప్రాంత ప్రజలు పట్టం కట్టారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం 2000లో ఏర్పడగా తొలి ఎన్నికలు 2002 ఫిబ్రవరి 14న జరిగాయి. తొలి ఎన్నికల నుంచి గడిచిన 2017 ఎన్నికల వరకూ నాలుగు సార్లు పౌఢి గఢ్వాల్‌ జిల్లాలోని యమకేశ్వర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు మహిళనే గెలిపించారు. నియోజకవర్గంలో సుమారు 90 వేల ఓట్లు ఉండగా వీరిలో సుమారు 40 వేల పైచిలుకు మహిళా ఓటర్లు. 2002, 2007, 2012 ఎన్నికల్లో బీజేపీ నుంచి విజయ భరద్వాజ్‌ గెలుపొందారు. తొలిసారి గెలిచినపుడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా నియమితులైన విజయ భరద్వాజ్‌ 2007లో మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా నియమితులయ్యారు. 2017లో యమకేశ్వర్‌ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం బీసీ ఖండూరి కుమార్తె రీతూ ఖండూరి భూషణ్‌ బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి రేణు బిస్త్‌పై 8,982 ఓట్ల తేడాతో రీతూ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మరో ఆరుగురు పురుష అభ్యర్థులు పోటీలో ఉండడం గమనార్హం. 2022లో బీజేపీ తమ అభ్యర్థిగా రేణు బిస్త్‌ను ప్రకటించింది. పర్వత ప్రాంతాల్లో ఈ నియోజకవర్గం విస్తరించి ఉండడంతో 60 శాతంలోపే ఇక్కడ పోలింగ్‌ జరుగుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుత అసెంబ్లీలో రీతూ ఖండూరితోపాటు మరో నలుగురు మహిళా ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడం గమనార్హం. ఫిబ్రవరి 14న రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.