Devotional

అరుంధతి నక్షత్రం విశిష్టత ఇదే! – TNI ఆధ్యాత్మికం

అరుంధతి నక్షత్రం విశిష్టత ఇదే! – TNI ఆధ్యాత్మికం

అరుంధతి…వశిష్ఠ మహర్షి ధర్మపత్ని. మహా పతివ్రత అని ఆకాశం వంక పెళ్లి సమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సంసారిక జీవనం నల్లేరు మీద నడకలా సాగుతుందని పండితులు వధూవరులకు చెబుతారు.మాఘమాసాది పంచ మాసాల కాల మందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రం వేళ కానరాదు.రాత్రిపూట చంద్రుడ్ని, నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం. శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్థరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారుఝామున కనిపిస్తుంది. అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి. ‘?’ మార్కు ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి. కచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆ ఆకారంలో ఉంటుంది. చిన్న పిల్లాడిని ? మార్కు గీయమంటే ఎలా గీస్తాడో అలా ఉండే సప్తర్షి మండలంలో పక్కపక్కనే ఉండే నక్షత్రాలే అరుంధతి, వశిష్ఠులవారివి. అరుంధతి నక్షత్రం చిన్నగా ఉంటుంది.హిందూ సంప్రదాయం ప్రకారం వివాహఘట్టంలో వధూవరులు అరుంధతి నక్షత్రాన్ని చూస్తారు.అయితే చాలా మందికి అరుంధతి నక్షత్రం గురించి అస్సలు తెలియదు. దాని నేపథ్యం ఏమిటనే విషయంపై చాలా మందికి అవగాహన ఉండదు. పవిత్రత అనే పదానికి పర్యాయరూపమే అరుంధతి. పతివ్రతల్లో ఈమె మొదటిస్థానంలో ఉంటారు. అందుకే నింగిలో చుక్కలా నిలిచిపోయింది. ఈమె ఎంతో అందగత్తె. మహాపతివ్రత. ఇసుకను అన్నంగా తయారు చెయ్యగలరా..?
***అరుంధతి గురించి చాలా కథలున్నాయి. అందులో కొన్ని…
వశిష్ట మహర్షి గురించి వినే ఉంటారు. ఆయన పెళ్లి చేసుకోవాలని అంతటా తిరుగుతూ ఉంటాడు….*
*ఒకసారి ఒక గ్రామంలో కన్నెలంతా అతన్ని చూడడానికి వచ్చారు. వశిష్టుడు కొంచెం ఇసుకను చేతిలోకి తీసుకున్నాడు. “ఈ ఇసుకను ఎవరైనా సరే వండి అన్నంగా తయారు చెయ్యగలరా?” అని అడిగాడు. అయితే ఆ గ్రామంలోని అమ్మాయిల్లో ఎవ్వరూ అది సాధ్యం కాదని చెప్పారు. పక్క గ్రామమైన మాల పల్లె నుంచి వచ్చిన ఒక అందమైన ఆడపడుచు పైకి లేచి నిలబడుతుంది. “నేను చేస్తానండి” అని అంటుంది. వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కుండ పెట్టింది. ఎసరు బాగా మరిగిన తర్వాత అందులో ఇసుక వేసింది. ధ్యానం చేస్తూ వంట వడింది. ఇసుక అన్నంగా మారింది.వశిష్టుడికి కుండలోని అన్నం చూపించింది.
*ఆయనకు కూడా ఈ విషయం బోధపడలేదు ఆమెనే అరుంధతి.తర్వాత ఆ అన్నం తినమంటూ అరుంధతి వశిష్టుడికి వడ్డిస్తుంది. కానీ ఆయన తినడు. “నన్ను పెళ్లి చేసుకుంటేనే తింటాను!” అంటాడు. తర్వాత అరుంధతి తల్లిదండ్రులతో మాట్లాడుతాడు వశిష్టుడు. వాళ్లను ఒప్పించి అరుంధతిని పెళ్లి చేసుకుంటాడు.ఇక అరుంధతికి ఎంతో ఏకాగ్రత ఉంటుంది. ఒకసారి వశిష్టుడు తన కమండలం ఆమెకు ఇచ్చి బయటకు వెళ్తాడు. తాను వచ్చే వరకు కమండలం వైపే చూస్తూ ఉండమని చెబుతాడు. అరుంధతి తన భర్త వచ్చేవరకు దాన్నే చూస్తూ ఉండాలనుకుంటుంది. చాలా ఏళ్లు గడిచినా వశిష్టుడు రాడు. అయితే అరుంధతి మాత్రం దాని వంకే చూస్తూ ఉంటుంది. పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత. అయితే ఈ విషయాన్ని గ్రహించిన కొందరు దేవతలు “అమ్మా అరుంధతి మీ ఆయన ఇన్నేళ్లు అయినా తిరిగిరాలేదు. కాస్త ఇటు చూడమ్మా!” అంటారు.
**అయినా ఆమె చూపు మరల్చదు.కొన్ని ఏళ్ల తర్వాత వశిష్టుడు వచ్చి “అరుంధతీ..!” అని పిలిస్తే అప్పుడు ఆయన వైపు చూస్తుంది.తన భర్తను తప్ప పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత అరుంధతి.ఒకసారి అగ్ని దేవుడి ఎదుట సప్త ఋషులు యజ్ఞం చేపడుతారు. ఆ ఋషుల భార్యలపై అగ్ని దేవుడు మోజు పడతాడు. ఈ విషయాన్ని అగ్ని దేవుడి భార్య అయిన స్వాహాదేవి గ్రహిస్తుంది. ఆ ఏడుగురి భార్యల మాదిరిగా తానే రోజు కొక అవతారం ధరించాలనుకుంటుంది. రోజు కొక ఋషి భార్య అవతారం ఎత్తి తన భర్త అగ్ని దేవుడి కోరిక తీరుస్తుంది.ఇక చివరి రోజు తాను అరుంధతిని అనుభవించబోతున్నాననే ఆనందంలో ఉంటాడు అగ్నిదేవుడు. కానీ స్వాహాదేవి ఎంత ప్రయత్నించినా అరుంధతి అవతారంలోకి మారలేదు. అరుంధతి మహా ప్రతివత కావడమే ఇందుకు కారణం.అందుకే ఆమె అరుంధతి నక్షత్రంగా మారి జగత్తుకు ఆందర్శంగా నిలిచింది. అరుంధతికి ‘శక్తి’ అనే కుమారుడున్నాడు. ‘శక్తి’ కుమారుడే పరాశరుడు. పరాశరుడి కుమారుడే వ్యాసుడు.అలా ఎంతో గొప్ప చరిత్ర కలిగింది అరుంధతి నక్షత్రం.

1.అరసవల్లిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం
శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్య నారాయణ స్వామి దేవాలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గురువారం ఉదయం సూర్యకిరణాలు మూలవిరాట్‌ను తాకాయి. సుమారు 6 నిమిషాలు పాటు సూర్యనారాయణ స్వామికి కిరణ స్పర్శ తగిలింది. సూర్యకిరణాలు చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షణాయనానికి స్థాన చలనం చెందే రోజుల్లో ఈ అద్భుత దృశ్యం ఆవిషృతం అవుతుంది. మార్చి నెల 9, 10… అక్టోబర్ నెల 2, 3 తేదీల్లో ఈ కిరణ స్పర్శ ప్రక్రియ జరగడం పరిపాటి.

2. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం తిరుమల శ్రీవారిని 59,086 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.81 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 28,701 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

3.ఏప్రిల్‌ నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు
ప్రస్తుతం కొవిడ్‌ ప్రభావం తగ్గిన నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి తిరిగి ఆర్జితసేవలను ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, మేల్‌చాట్‌ వస్త్రం, అభిషేకం, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను ప్రారంభించనున్నారు. కొవిడ్‌ ముందున్న విధానంలోనే ఆర్జితసేవా టికెట్ల బుకింగ్‌ ఉంటుంది. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలకు సంబంధించి భక్తులు నేరుగా పాల్గొనే విధానంతో పాటు వర్చువల్‌ విధానం కూడా కొనసాగనుంది. అడ్వాన్స్‌ బుకింగ్‌లో ఆర్జిత సేవలను బుక్‌ చేసుకున్న వారిని, ఉదయాస్తమాన సేవ, వింశతి వర్ష దర్శిని సేవలు బుక్‌ చేసుకున్న వారిని ఏప్రిల్‌ 1 నుంచి కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆయా సేవలకు అనుమతించనున్నారు.

4.యాదాద్రి హుండీ విరాళాలకు క్యూఆర్‌ కోడ్‌
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ డిజిటల్‌ హుండీ విరాళం కోసం కెనరా బ్యాంకు క్యూఆర్‌ కోడ్‌ను రూపొందించింది. ఆన్‌లైన్‌ సేవ టికెట్‌, ఇతర డిజిటల్‌ విరాళాలు అందజేసే భక్తుల కోసం ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ రూపొందించిన ఆలయ అధికారులు విరాళాల సేకరణను చేపడుతున్నారు. 2018 నుంచే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురాగా.. మారుతున్న కాలానికి అనుగుణంగా గూగుల్‌ పే, ఫొన్‌ పే, పేటీఎం ద్వారా సులువుగా నగదు బదిలీ చేసేందుకు వీలుగా క్యూఆర్‌ కోడ్‌ను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఆలయ అకౌంట్‌ విభాగం అధికారులు తెలిపారు.