DailyDose

‘నెహ్రూ- ఎడ్వినా లేఖలు సీక్రెట్​.. బహిర్గతం చేయలేం’

‘నెహ్రూ- ఎడ్వినా లేఖలు సీక్రెట్​.. బహిర్గతం చేయలేం’

తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, భారత చివరి వైస్రాయ్‌ లార్డ్‌ మౌంట్‌బాటన్‌ భార్య ఎడ్వినా మౌంట్‌బాటన్‌ల వ్యక్తిగత లేఖల వ్యవహారంపై.. సౌథాంప్టన్‌ యూనివర్సిటీకి యాజమాన్య హక్కులు లేవని తేల్చిచెప్పింది మొదటి శ్రేణి సమాచార హక్కుల ట్రైబ్యునల్‌. ఈ లేఖల్లోని చాలా విషయాలు ఇప్పటికే బహిర్గతమైనట్టు ట్రైబ్యునల్‌ వ్యాఖ్యానించింది.

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, భారత చివరి వైస్రాయ్‌ లార్డ్‌ మౌంట్‌బాటన్‌ భార్య ఎడ్వినా మౌంట్‌బాటన్‌ల నడుమ సాగిన వ్యక్తిగత లేఖలను బహిర్గతం చేయాలన్న అభ్యర్థనను.. బ్రిటన్‌కు చెందిన మొదటి శ్రేణి సమాచార హక్కుల ట్రైబ్యునల్‌ తిరస్కరించింది! లార్డ్‌ బ్రబౌర్న్‌ తరఫున ఈ లేఖలు, డైరీలను సౌథాంప్టన్‌ విశ్వవిద్యాలయం భౌతికంగా భద్రపరుస్తుందే తప్ప.. అందులోని సమాచారంపై వర్సిటీకి ఎలాంటి యాజమాన్య హక్కులు లేవని తేల్చిచెప్పింది. సదరు పత్రాల్లోని చాలా విషయాలు ఇప్పటికే బహిర్గతమైనట్టు ట్రైబ్యునల్‌ వ్యాఖ్యానించింది.

‘బ్రాడ్‌ల్యాండ్స్‌ ఆర్కైవ్‌’ పేరుతో మౌంట్‌బాటన్‌ కుటుంబం నుంచి సౌథాంప్టన్‌ విశ్వవిద్యాలయం కీలక పత్రాలను 2011లో సుమారు రూ.27 కోట్లకు (2.8 మిలియన్‌ పౌండ్లకు) కొనుగోలు చేసింది. 19, 20వ శతాబ్దాల్లో బ్రిటిష్‌ రాజకీయాలకు సంబంధించిన కీలక వనరుగా భావిస్తున్న ఈ ఆర్కైవ్‌లోని పత్రాలను బహిర్గతం చేయాలని వర్సిటీ తొలుత భావించింది. కానీ, అందులోని అంశాల ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని వాటిని క్యాబినెట్‌ కార్యాలయం పరిశీలనకు పంపింది. అయితే వీటిని బహిర్గతం చేయాలని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ చరిత్రకారుడు ఆండ్రూ లోనీ సమాచార కమిషనర్‌ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఇందుకు అనుకూలంగా స్పందించిన సదరు కార్యాలయం.. బ్రాడ్‌ల్యాండ్స్‌ ఆర్కైవ్‌ను బహిర్గతం చేయాలని 2019లో సౌథాంప్టన్‌ వర్సిటీని ఆదేశించింది. ఆర్కైవ్‌లోని లేడీ మౌంట్‌బాటన్‌-నెహ్రూ మధ్య లేఖలు, డైరీలకు సంబంధించిన పత్రాలు ఇంకా ప్రైవేటు యాజమాన్యం ఆధీనంలోనే ఉన్నాయని స్పష్టంచేసింది. గోప్యంగా ఉంచాల్సిన ఆ దస్త్రాలను కొనుగోలు చేయాలని భావించినా, తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్టు కమిషనర్‌ కార్యాలయానికి తెలిపింది. దీంతో ఈ విషయం ట్రైబ్యునల్‌కు చేరింది. నాలుగేళ్లుగా ఈ న్యాయ పోరాటం కోసం ఆండ్రూ లోనీ సుమారు రూ.2.88 కోట్లు (3.70 లక్షల పౌండ్లు) ఖర్చు చేశారు.భారత్‌, పాకిస్థాన్‌, బ్రిటన్‌కు సంబంధించి కీలక అంశాలు ఉన్నందునే..: వ్యాజ్యం క్రమంలో గత ఏడాది నంబంరు నుంచి ఇప్పటివరకూ సౌథాంప్టన్‌ విశ్వవిద్యాలయం లార్డ్‌ మౌంట్‌బాటన్‌కు సంబంధించి 35 వేల పత్రాలను విడుదల చేసింది. బ్రిటన్‌ రాజ కుటుంబానికి సంబంధించిన ప్రత్యక్ష సూచనలు; భారత్‌, పాకిస్థాన్‌లతో బ్రిటన్‌ సంబంధాలకు సంబంధించి కీలక విషయాలు ఉన్న 150 భాగాలను మాత్రం గోప్యంగానే ఉంచింది. వీటిని బహిర్గతం చేసేందుకు ట్రైబ్యునల్‌ నిరాకరించింది. న్యాయమూర్తి సోఫీ బకిల్‌ మాత్రం.. వీటిలోని రెండు భాగాలను అన్‌-రిడక్ట్‌ చేయాలని, మరో రెండు భాగాలను పాక్షికంగా అన్‌-రిడక్ట్‌ చేసి వెల్లడించాలని ఆదేశించారు. మిగతా వాటిని యథాతథంగా కొనసాగించాలని పేర్కొన్నారు. ఈ తీర్పును సౌథాంప్టన్‌ విశ్వవిద్యాలయం స్వాగతించింది. ఆర్కైవ్స్‌ను యథాతథంగా బహిర్గతం చేయాలనుకున్నామని, అయితే ఇది పరిమితులతో కూడిన విషయమని పేర్కొంది.

దాచుకున్నదంతా ధారపోశా…..
ట్రైబ్యునల్‌ తీర్పుపై చరిత్రకారుడు ఆండ్రూ లోనీ స్పందించారు. “పిటిషన్‌ వేసిన తర్వాత ముఖ్యమైన చారిత్రక విషయాల్లో 99% వెలుగులోకి వచ్చాయి. మూడేళ్ల కిందట వచ్చిన నా పుస్తకం ‘ద మౌంట్‌బాటన్స్‌: ద లైవ్స్‌ అండ్‌ లవ్స్‌ ఆఫ్‌ డికీ అండ్‌ ఎడ్వినా మౌంట్‌బాటన్‌’కు ఇవి ఎంతో కీలక ఆధారాలు. ఇంతవరకూ బహిర్గతంకాని భాగాల్లో సంచలనాత్మక విషయాలు ఉంటాయని నేనైతే అనుకోవడం లేదు. పాకిస్థాన్‌ వ్యవస్థాపకుడు మహమ్మద్‌ అలీ జిన్నాపై ఎడ్వినా విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను మానసిక రోగిగా తన డైరీలో పేర్కొన్నారు. అంతమాత్రాన పాకిస్థాన్‌తో సంబంధాలు దెబ్బతింటాయని నేను భావించడం లేదు. వ్యక్తిగతంగా నాకు ఎలాంటి ప్రయోజనం లేకపోయినా, భవిష్యత్తులో చరిత్రకారుల కోసమే.. నా వృద్ధాప్యం కోసం దాచుకున్న సుమారు రూ.2.88 కోట్లు (3,77,204 డాలర్లు) ఖర్చు చేశాను. ఇంకా రూ.48 లక్షలు (50 వేల పౌండ్లు) చెల్లించాల్సి ఉంది” అని ఆయన పేర్కొన్నారు. ఆండ్రూ లోనీ కొత్త పుస్తకం “ట్రైటర్‌ కింగ్‌: ది స్కాండలస్‌ ఎక్సైల్‌ ఆఫ్‌ ద డ్యూక్‌ అండ్‌ డచెన్‌ ఆఫ్‌ విండ్సర్‌” వచ్చే నెలలో విడుదల కానుంది.