DailyDose

చిదంబరం మెడకు మరో ఉచ్చు.. వీసా కుంభకోణంపై ఈడీ కేసు

చిదంబరం మెడకు మరో ఉచ్చు.. వీసా కుంభకోణంపై ఈడీ కేసు

చైనీస్ వీసా కుంభకోణం కేసులో కార్తీ చిదంబరం చుట్టూ ఈడీ ఉచ్చు బిగుసుకుంటోంది. నిబంధనలను ఉల్లంఘిస్తూ చైనా జాతీయులకు వీసాలు పొందడంలో సహాయం చేశారనే ఆరోపణలపై ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరంపై ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. 263 మంది చైనా సంతతికి చెందిన వ్యక్తులకు అక్రమ వీసాలు మంజూరు చేయించిన వ్యవహారంలో ఈ కేసు నమోదు చేసుకుంది. ఇదే విషయంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ చేపడుతోంది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే.. ఈడీ తాజాగా కేసు పెట్టింది.

*సీబీఐ ముందుకు కార్తీ చిందంబరం…
మరోవైపు, ఈ వీసా కుంభకోణం కేసులో కార్తీ చిదంబరాన్ని సీబీఐ విచారించనుంది. విచారణలో పాల్గొనాల్సిందిగా గతంలో కార్తీ చిదంబరానికి సమన్లు జారీ చేసింది. బుధవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని స్పష్టం చేసింది. అయితే, బుధవారం ఉదయం కార్తీ చిదంబరం తరపు న్యాయవాది సీబీఐ ప్రధాన కార్యాలయానికి వచ్చారని అధికారులు తెలిపారు. న్యాయవాదిని విచారించాల్సిన అవసరం లేదని… కార్తీ చిదంబరమే స్వయంగా రావాలని చెప్పి పంపినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో లంచ్ బ్రేక్ తర్వాత విచారణకు కార్తీ హాజరు కానున్నట్లు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.సుమారు రూ. 50 లక్షలు తీసుకుని.. చైనాకు చెందిన 250 మందికి కార్తీ చిదంబరం వీసాలు ఇప్పించారన్నది ప్రధాన ఆరోపణ. కార్తీ తండ్రి చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవహారం జరిగిందని సీబీఐ వెల్లడించింది. ‘చైనా సంస్థలోని 263 ప్రాజెక్ట్​ వీసాలను గడువు ముగిసినా మళ్లీ ఉపయోగించుకునేలా చేశారు. సాధారణంగా వీసాను పునర్వినియోగించుకోవాలంటే హోంమంత్రి అనుమతి అవసరం. అప్పటి హోంమంత్రి వీటిని అనుమతించినట్లు తెలుస్తోంది. అప్పటి హోంమంత్రి చిదంబరంతో చర్చించి రూ.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు” అని సీబీఐ తన ఎఫ్ఐఆర్​లో పేర్కొంది. దీనిపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. చిదంబరం సన్నిహితుడు, ఈ కేసుతో సంబంధం ఉన్న ​భాస్కర రామన్​ను గత వారం అదుపులోకి తీసుకుంది.