NRI-NRT

సెయింట్ లూయిస్‌లో వైభవంగా శ్రీవారి కల్యాణం

సెయింట్ లూయిస్‌లో వైభవంగా శ్రీవారి కల్యాణం

అమెరికాలోని వివిధ నగరాల్లో వరుసగా శ్రీనివాస కల్యాణాలను టీటీడీ వైభవంగా నిర్వహిస్తున్నది. అమెరికాలో స్థిరపడిన హిందువులకు శ్రీవేంకటేశ్వరుడి కల్యాణాన్ని తిలకించే భాగ్యం కలిగించేందుకు టీటీడీ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో సెయింట్ లూయిస్ నగరంలో భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున వైభవోపేతంగా నిర్వహించారు. ది హిందూ టెంపుల్‌ ఆఫ్ సెయింట్ లూయిస్‌లో శ్రీవారి కల్యాణ వేడుక కన్నుల పండువగా జరిగింది.
అద్భుతంగా అలంకరించిన వేదిక పై తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములు.. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాలు, భక్తి సంగీత గానం నడుమ శాస్త్రోక్తంగా, వేద మంత్రాలతో అద్భుతంగా ఈ వేడుక నిర్వహించారు. వేలాది మంది భక్తులు శ్రీవారి కళ్యాణ వేడుక చూసి తరించారు. కళ్యాణం అనంతరం భక్తుల నృత్య ప్రదర్శనల నడుమ గరుడ వాహన సేవ కన్నుల పండువగా నిర్వహించారు.టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఏఈఓ వెంకటేశ్వర్లు , ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, ఏపీ ఎన్నార్టీ చైర్మన్ మేడ‌పాటి వెంక‌ట్, నార్త్ అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాక‌ర్, నాటా ప్రెసిడెంట్ శ్రీ‌ధ‌ర్ రెడ్డి కొరిశపాటి తదితరులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. సెయింట్ లూయిస్ వాస్తవ్యులు తాటిపర్తి గోపాల్ రెడ్డి, పమ్మి సుబ్బారెడ్డి, ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ ధర్మకర్తల మండలి చైర్మన్ రజనీకాంత్ గంగవరపు, అధ్యక్షురాలు శ్రీమతి రాజ్యలక్ష్మి నాయుడు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల సహకారంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.