Devotional

పులిహోర ప్రసాదంగా ఎందుకు మారిందో తెలుసా.?

పులిహోర ప్రసాదంగా ఎందుకు మారిందో తెలుసా.?

పులిహోర అంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. పులిహోరను పూజలు చేసినప్పుడు నైవేద్యంగా పెడుతూ ఉంటాం. పులిహోరను మన పూర్వీకుల కాలం నుండి పూజలకు నైవేద్యంగా పెడుతున్నారు. పూజల సమయంలో దేనికి లేని ప్రాముఖ్యత పులిహోరకు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. పాండవులు అజ్ఞాతవాసంలో రకరకాల వేషాలను వేసిన సంగతి తెలిసిందే. పాండవులలో బీముడు వంటవాడిగా వేషం వేసి ఎన్నో రకాల వంటకాలను సృష్టించారు. ఆ వంటకాలలో పులిహోర ఒకటి. ఈ విషయం మనకు పురాణ కథలు,చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఇంత ప్రాచుర్యం ఉన్నా పులిహోర ఆ తర్వాత క్రమంగా దక్షిణ భారతదేశం అంతా ప్రాచుర్యం పొందింది.

కొత్త రుచులను ఆస్వాదించే తెలుగువారు ఈ వంటకానికి పులిహోర అని పేరు పెట్టి ఆస్వాదించటం ప్రారంభించారు. కుళుత్తుంగ చోళుల పరిపాలన ఉన్న సమయంలో తమిళనాడు,కర్ణాటక ప్రాంతాలలో దైవానికి ఆరగింపు చర్యగా ఉత్తమ జాతి పువ్వులను, పండ్లను, తినుబండారాలను పెట్టటం ఒక ఆచారంగా ఉండేదట. ముఖ్యంగా శ్రీ వైష్ణవులు,అయ్యంగార్లు ఈ పద్దతిని ప్రారంభించి ప్రాచుర్యం చేయటంతో ఇతర ప్రాంతాల వారు కూడా ఆరగింపు చర్యను చేయటం ప్రారంభించారు. ఆ తర్వాతి కాలంలో పులిహోరను దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత భక్తులకు పంచటం ప్రారంభం అయింది.

పులిహోరలో శుభానికి,ఆరోగ్యానికి సూచికగా ఉండే పసుపును ఉపయోగిస్తారు. అందువల్ల ఒక వైపు ఆధ్యాత్మిక పరంగాను మరోవైపు ఆరోగ్యపరంగాను దోహదపడుతుంది. హిందూ ధర్మంలో పులిహోరను తప్పనిసరిగా తినవలసిన ఆహారంగా చెప్పటమే కాకుండా పండితులు దివ్య ఆహారంగా చెప్పటంతో కేరళ,కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల్లో పులియోగారే అని మన రాష్ట్రంలో పులిహోర అని పేరు పొందింది. పులిహోర అంటే కళ్ళకు అద్దుకొని తినే ఆహారంగా ప్రాచుర్యం పొందింది. చాలా దేవాలయాల్లో పులిహోరను ప్రసాదంగా పెట్టటం మనం చూస్తూనే ఉంటాం.తిరుమల తిరుపతి లో పులిహోరను రాశి గా పోసి చేసే సేవను తిరుప్పావడ సేవ అంటారు.