DailyDose

పారిస్‌లో ల్యాండైన విరుష్క ఫ్యామిలీ

పారిస్‌లో ల్యాండైన విరుష్క ఫ్యామిలీ

విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు డుమ్మా కొట్టి ఫ్యామిలీతో పాటు వెకేషన్‌లో ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. ఇవాళ ఉదయం పారిస్‌లో ల్యాండైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కోహ్లి భార్య అనుష్క తన ఇన్‌స్టా స్టోరీ ద్వారా వెల్లడించింది. పారిస్‌లో ఎండలు మండిపోతున్నాయని, అక్కడ 41 డిగ్రీల ఎండ నమోదవుతున్నట్లు ఆమె ఇన్‌స్టాలో పేర్కొంది. అనుష్క చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

కాగా, గతకొంతకాలంగా ఫామ్‌ లేమితో సతమతమవుతున్న కోహ్లి రెస్ట్‌ పేరుతో విండీస్‌ పర్యటనకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. క్రికెట్‌కు కొన్నాళ్ల పాటు దూరంగా ఉంటే తిరిగి‌ గాడిలో పడతాడనే ఉద్దేశంతో కోహ్లి విండీస్‌ పర్యటనకు వెళ్లకుండా ఫ్యామిలీతో పాటు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ విషయంతో బీసీసీఐ కూడా ఏకీభవించి కోహ్లిని విండీస్‌ పర్యటనకు దూరంగా ఉంచింది. దీంతో కోహ్లి భార్య అనుష్క, కూతురు వామికతో కలిసి పారిస్‌లో హాలిడేను ఎంజాయ్‌ చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలోనైనా కోహ్లి ఫామ్‌లోకి వస్తాడని అంతా ఆశించారు. అయితే కోహ్లి అందరి ఆశలను అడియాశలు చేస్తూ.. పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. రీ షెడ్యూల్డ్‌ టెస్ట్‌ మ్యాచ్‌, రెండు టీ20లు, రెండు వన్డేల్లో కలిపి కేవలం 76 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం భారత జట్టు వెస్టిండీస్‌ పర్యటనకు బయల్దేరాల్సి ఉండగా.. రెస్ట్‌ పేరుతో అతను ఈ పర్యటనకు దూరంగా ఉన్నాడు. దీంతో భారత సెలెక్టర్లు అతన్ని జింబాబ్వేతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆడించాలని భావిస్తున్నారు. విండీస్‌తో సిరీస్‌ అనంతరం ఆగస్టు 18 నుంచి 22 వరకు టీమిండియా జింబాబ్వేలో పర్యటించనుంది. అతర్వాత ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది.