NRI-NRT

హైదరాబాద్‌పై ఎన్నారె గురి

హైదరాబాద్‌పై ఎన్నారె గురి

*హైదరాబాద్‌పై ఎన్నారె గురి
*నగరంలో ఆస్తుల కొనుగోలుకు ఆసక్తి
*పెద్దిండ్లకు పెరుగుతున్న డిమాండ్‌
*స్టాక్స్‌, ఎఫ్‌డీ, గోల్డ్‌ కంటే రియల్టీనే ఆకర్షణీయం
*సీఐఐ-అనరాక్‌ తాజా సర్వే
*భాగ్యనగరంపై ఎన్నారైలకు ఇష్టం పెరిగింది.

హైదరాబాద్‌లో ఆస్తి కొనుగోలుకు ప్రవాస భారతీయులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇక్కడి రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ పరుగులు పెడుతున్న నేపథ్యంలో అత్యధికులు ప్రాపర్టీ అన్వేషణలో ఉన్నారిప్పుడు.

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌.. ప్రవాస భారతీయులను (ఎన్నారైలు) పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నది. దేశంలో మరే నగరంలో లేనంతగా ఇక్కడి రియల్టీని ఎన్నారైలు గమనిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్తి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. హౌజింగ్‌లో ఎన్నారైల ఇష్టాయిష్టాలను తెలియజేస్తూ వ్యాపార-పారిశ్రామిక సంఘం సీఐఐ, ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సేవల సంస్థ అనరాక్‌ సంయుక్తంగా సర్వే చేపట్టాయి. ఈ సర్వే ప్రకారం ఎన్నారైలు దేశంలో ఆస్తి కొనుగోలుకు హైదరాబాద్‌నే ఎక్కువగా ఎంచుకుంటున్నట్టు తేలింది. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, బెంగళూరు, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ నిలిచాయి.

60 శాతం ఎన్నారైలది..
సర్వేలో పాల్గొన్న 60 శాతం ఎన్నారైలు హైదరాబాద్‌, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, బెంగళూరుల్లోనే ఆస్తి కొనుగోలుకు మక్కువ ప్రదర్శించారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌లో ఇల్లుపట్ల 22 శాతం మంది ఆసక్తి కనబర్చారు. 20 శాతం ఎన్‌సీఆర్‌పై, 18 శాతం బెంగళూరుపై ఇష్టం చూపారు. కాగా, ఈ సర్వేలో 5,500 మంది ఎన్నారైలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వీరిలో 7 శాతం మంది అమెరికా, కెనడా, గల్ఫ్‌, ఐరోపా, ఇతర ఆసియా దేశాల్లో ఉన్నారు. ఇదిలావుంటే కరోనాకు ముందు జరిపిన సర్వేలో టాప్‌-3 నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్‌, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ఉన్నట్టు ఈ సందర్భంగా సీఐఐ, అనరాక్‌ తెలిపాయి.

బడా ఇండ్లకు గిరాకీ
ఎన్నారైల్లో పెద్దిండ్లకు డిమాండ్‌ భారీగా పెరిగింది. కరోనా నేపథ్యంలో ఇల్లు వీలైనంత విశాలంగా ఉంటేనే మంచిదన్న అభిప్రాయం మెజారిటీ ఎన్నారైల్లో వ్యక్తమవుతున్నది. పాఠశాలలు, కార్యాలయాలు తిరిగి పూర్తిస్థాయిలో తెరుచుకుంటుండటం కూడా దీనికో కారణంగా నిలుస్తున్నది. దేశీయ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో నెలకొన్న ఉత్సాహానికితోడు డాలర్‌తో పోల్చితే పడిపోతున్న రూపాయి మారకం విలువ కూడా భారత్‌లో ఎన్నారైల పెట్టుబడులకు ఊతమిస్తున్నదని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. పెరుగుతున్న డాలర్‌ విలువ మధ్య భారత్‌లో తక్కువకే ఆస్తులను సొంతం చేసుకోవచ్చన్న తీరు ఎన్నారైల్లో కనిపిస్తున్నదని తాజా ట్రెండ్‌ను నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు.