Politics

కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో సర్దుకుపోగలరా?

కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో సర్దుకుపోగలరా?

టీడీపీ పోలిట్‌బ్యూరో లోకి కన్నా లక్ష్మీ నారాయణ

కన్నా రాకతో గుంటూరు-కృష్ణా జిల్లా కాపుల్లో కదలిక

గుంటూరు : సుదీర్ఘకాలం తెలుగుదేశం వ్యతిరేక శిబిరానికి నాయకత్వం వహించి ఇప్పుడు అదే పార్టీ ‘సైకిల్’ ఎక్కబోతున్న మాజీ మంత్రి, మాస్ లీడర్ కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో సర్దుకుపోగలరా? అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి కోట్ల, చెన్నారెడ్డి, నేదురుమల్లి, వైఎస్ తురుపుముక్కగా పనిచేసిన కన్నా, ఇప్పుడు టీడీపీకి తురుపుముక్క కాగలరా? దశాబ్దాల పాటు సభలో-బయటా చంద్రబాబు నాయుడును కడిగేసిన కన్నా, ఇప్పుడు అదే బాబుతో కలసి అడుగులేయగలరా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

లోప్రొఫైల్ స్కూలు, ముక్కుసూటిగా వ్యవహరించే కన్నా విభిన్న సిలబస్ ఉన్న టీడీపీ యూనివర్శిటీలో రాణిస్తారా? కాపు నేతగా ఇమేజ్ ఉన్న కన్నా రాకతో, కాపులు టీడీపీ వైపు అడుగులేస్తారా? కన్నా రాకతో టీడీపీకి లాభమా? టీడీపీతో కన్నాకు లాభమా? అసలు కన్నాకు టీడీపీలో లభించే గౌరవమేమిటి? ఇదీ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది.

కన్నా లక్ష్మీనారాయణ. తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేని పేరిది. కోట్ల విజయ భాస్కరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌ కుమార్‌రెడ్డి వంటి ముఖ్యమంత్రుల చేతిలో బ్రహ్మాస్త్రం ఆయన. సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన అనుభవం. అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సంధించే అస్త్రశస్త్రాలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన కాచుకుని, ఎదురుదాడి చేసే యోధుడాయన.

చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నా కాంగ్రెస్ తరపున అస్త్రశస్త్రాలు సంధించే నాయకుడాయన. అలాంటి కన్నా ఇప్పుడు తాను ఎదురుదాడి చేసిన అదే టీడీపీ తీర్థం తీసుకున్నారు. విచిత్రంగా ఉంది కదూ?!. రాజకీయమంటే అదే మరి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు-శాశ్వత మిత్రులూ ఉండరన్న, దేవరాజ్ ఆర్స్ సిద్ధాంతం మరోసారి రుజువైన సందర్భం. అలాంటి మాస్ ఇమేజ్ ఉన్న కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో సర్దుకుపోగలరా? ఆయన స్థాయికి తగ్గ గౌరవం టీడీపీ నాయకత్వం ఇస్తుందా? ప్రధానంగా కాపు నేతలున్న పార్టీలో, అదే కులంలో మాస్ ఇమేజ్ ఉన్న కన్నా రాకను కాపు నేతలు జీర్ణించుకుంటారా? గుంటూరు జిల్లాలో పాతుకుపోయి, మంత్రి పదవుల కోసం కాచుకుని ఉన్న సీనియర్లు, కన్నా రాకను మనస్ఫూర్తిగా ఆహ్వానించి, ఆయనతో కలసి పనిచేస్తారా? బహు నాయకత్వం ఉన్న కాంగ్రెస్, మరో జాతీయ పార్టీ అయిన బీజేపీలో పనిచేసిన కన్నా ఏక నాయకత్వం ఉన్న టీడీపీలో ఇమడగలరా? ఇప్పుడు అందరినీ ఆసక్తికి గురిచేస్తున్న అంశం ఇదే. కాపు నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం తీర్ధంతో రాజధాని గుంటూరు జిల్లాతోపాటు, కులరాజకీయ సమీకరణల్లో మార్పు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సైద్ధాంతికంగా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీలో చేరతారని బహుశా ఆయనతో సహా ఎవరూ ఊహించి ఉండరు. జాతీయ పార్టీ బీజేపీ నిరాదరణ, వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఒంటెత్తు వైఖరి, జనసేనాధిపతి పవన్ కల్యాణ్ రాజకీయ అనుభవ రాహిత్యం కలసి వెరసి ఆయనను, టీడీపీ వైపు అడుగులు వేసేందుకు కారణం అయి ఉండవచ్చు. పైగా కన్నా సమర్థత, రాజకీయ వ్యూహాలపై చంద్రబాబుకు ఉన్న అవగాహన కన్నా రాజకీయ ప్రత్యామ్నాయ ఎంపిక అందుకు దోహదపడి ఉండవచ్చు. కాపు నేత అయిన కన్నా, జనసేనను ఎంచుకోకుండా, టీడీపీని ఎంపిక చేసుకన్నారంటే ఆయనకున్న రాజకీయ అనుభవం-ముందుచూపు ఎంత విస్తృతమయిందో ఊహించుకోవచ్చు. ఆయన ఒకవేళ జనసేనలో చేరితే, మరో పవర్ సెంటర్ అవుతారు. యోధానుయోధులైన సీఎంల వద్ద పనిచేసిన కన్నా సొంత వ్యక్తిత్వం, దూకుడును, జనసేనలో చేరితే పవన్ తట్టుకోలేరు. అదీ కాకపోతే మహా అయితే కన్నా, జనసేనలో నెంబర్‌టూ స్థాయికి చేరవచ్చు. అయినప్పటికీ, క్యాడర్ , పార్టీ నిర్మాణం లేని జనసేనలో చేరి, కన్నా సాధించేది శూన్యం. బహుశా అలాంటి అంచనాతోనే ఆయన జనసేన వైపు మొగ్గుచూపి ఉండకపోవచ్చు.

దశాబ్దాల పాటు మంత్రి, ఎమ్మెల్యేగా జనం మధ్యలో ఉండి, మాస్ పొలిటీషియన్‌గా పనిచేసిన కన్నాను వాడుకోవడంలో బీజేపీ విఫలమయింది. బీజేపీలో చేరకముందు, కన్నా చుట్టూ వందలు-వేల మంది జనం కనిపించేవారు. రాజకీయ ఎత్తుగడలు, పార్టీ కార్యక్రమాలు, సమీక్షలతో నిరంతరం బిజీగా ఉండే కన్నాను బీజేపీ ఖాళీగా కూర్చోపెట్టింది. క్రియాశీల రాజకీయాల్లో ఉంటూ, మాస్ లీడర్‌గా ఉన్న కన్నా లాంటి నేతలు అలాంటి పరిణామాలు ఇబ్బందికరమే. ఇప్పుడు ఆయన టీడీపీలో చేరుతుండటంతో, మళ్లీ కన్నా నివాసం జనంతో కళకళలాడుతోంది. మాస్ లీడర్లకు ఉన్న విలువ అది. ఈ సూత్రం కన్నాకే కాదు. ఏ మాస్ లీడరకయినా వర్తించేదే. తన రాజకీయ జీవితంలో ఎంతోమంది నేతలను తయారు చేసిన కన్నాకు, నియోజకవర్గ స్థాయి నేత కూడా కాని సోము వీర్రాజుతో కలసి పనిచేయడం, అవమానం అనిపించడంలో తప్పలేదు. అయితే, బీజేపీ స్కూల్ సిలబస్‌ను సరిగ్గా అర్ధం చేసుకోవడంలో కన్నా లాంటి నేతలు విఫలమవుతున్నారు. సోము లాంటి నేతలకు సొంత ఊళ్లలో పలుకుబడి లేకపోయినా, బీజేపీ దృష్టిలో అలాంటి వారే మహానేతలు. ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అన్నట్లు.. ఇంటి పక్కన వాళ్లు కూడా పట్టించుకోని వారంతా, బీజేపీలో రాష్ట్ర-జాతీయ స్థాయి నేతలు. జనంలో ఠికాణా లేని వీరంతా పేపర్ టైగర్లు. జాతీయ నాయకత్వానికి కూడా, వీరు తప్ప మరొకరు గతిలేని పరిస్థితి. ఆంధ్రాలో ఈ బాపతు నాయకుల సంఖ్య డజన్లలోనే ఉంటుంది.