NRI-NRT

“తానా” సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘అమ్మభాషా సేవలో అంధమేధావులు’

“తానా” సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘అమ్మభాషా సేవలో అంధమేధావులు’

Prapancha Sahitya Vedika తెలుగు ప్రజలు, వారి సంతతి గుర్తింపుని కాపాడడానికి, తెలుగు సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సాంఘిక, సేవా చర్చలకు ఓ వేదికగా నిలవడానికి ఏర్పడింది తానా. తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం ‘నెల నెలా తెలుగు వెలుగు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తెలుగు భాషకు సంబంధించిన ఒక్కో అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటారు. ఈ నెలలో జ్ఞాననేత్రులు – తెలుగుదివ్వెలు అనే అంశంపై సభ జరిగింది.

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రతినెలా ఆఖరి ఆదివారం ‘నెల నెలా తెలుగు వెలుగు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 26న నిర్వహించన 45వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం ‘జ్ఞాననేత్రులు – తెలుగుదివ్వెలు’ అమ్మ భాషా సేవలో అంధ మేధావులు అనే సాహిత్య కార్యక్రమం విజయవంతమైంది.

తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర అతిథులందరుకూ స్వాగతం పలుకుతూ.. వీరి మధ్య ఉన్న సారూప్యం దృష్టి లోపం కాదని, దూరదృష్టి అన్నారు. ఎన్ని ఉన్నా ఇంకా ఏదో లేదనుకుంటూ తమ జీవితాలను అంధకారబందురం చేసుకుంటున్న అసంతృప్తివాదులకు వీరి జీవితాలు వెలుగు బాటలని, తమ శక్తిని తాము తెలుసుకోలేక జీవితంలో ఇంకా ఏమీ చెయ్యలేమనే కృంగిపోతున్న నిరాశావాదులకు ఈ అతిథుల జీవితాలు స్ఫూర్తి పతాకలని కొనియాడారు. కేవలం కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యం అనే లక్షణాలను ఆయుధాలుగా చేసుకుని జీవన పోరాటం చేస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్న ఈ ధీరోదాత్తుల జీవితాలు అందరికీ కనువిప్పు అంటూ స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సీఈఓ ఆర్. మల్లిఖార్జున రావు మాట్లాడు..తూ ప్రతి నెలా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు భాషా సాహిత్య సేవలో నిమగ్నమైన తానా ప్రపంచసాహిత్యవేదికకు అభినందనలు, అంధ మేధావులతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో ప్రత్యేకమైంది అని అన్నారు.

విశిష్ట అతిథులుగా ప్రొఫెసర్ మన్నవ సత్యనారాయణ, పూర్వ తెలుగు శాఖాధ్యక్షులు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (దుగ్గిరాల); ప్రొఫెసర్ జక్కంపూడి మునిరత్నం నాయుడు, విశ్రాంత తెలుగు ఆచార్యులు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి); డాక్టర్ బొల్లా జ్యోత్స్న ఫణిజ, ఢిల్లీ విశ్వవిద్యాలయం (న్యూ ఢిల్లీ); డీవీ మోహన కృష్ణ, శాస్త్రీయసంగీత విద్వాంసులు (హైదరాబాద్), షాకీర్ మొహమ్మద్, అపార జ్ఞాపకశక్తి సంపన్నులు, వ్యక్తి వికాస శిక్షకులు (హైదరాబాద్); సత్యవాడ సోదరీమణులు.. సత్యవాడ రఘునాథమ్మ, సత్యవాడ సూర్యకుమారి, రచయిత్రులు, గాయనిలు (విశాఖపట్నం); డాక్టర్ బెంకి రాఘవేందర్ రెడ్డి, ఉపాధ్యాయుడు (జడ్చర్ల); డాక్టర్ చిక్కా హరీష్ కుమార్, రచయిత (మహబూబ్ నగర్); డాక్టర్ చిన్నావుల వేంకట రాజారెడ్డి, ఉపాధ్యాయుడు (కర్నూలు); మోపూరు పెంచల నరసింహం, కవి (నెల్లూరు), పెండ్యాల గాయత్రి, ఉపాధ్యాయిని (సింగరాయకొండ); టింగిరికార్ వెంకటేశ్, వ్యాఖ్యాత, రచయిత (మహబూబ్ నగర్) పాల్గొన్నారు.

అతిథులు తెలుగు భాషపట్ల తమకున్న అపారమైన అభిమానాన్ని, తాము రచించిన కథా, కవితా సంపుటాలు, నవలల గురించి పంచుకుంటూ, వారి జీవితంలో ఎదురైన అవరోధాలను ఎదుర్కొంటున్న తీరు, తెలుగు భాషను పరిరక్షించి, పరివ్యాప్తం చేయడంలో తల్లిదండ్రులుగా, వ్యక్తులుగా, సంస్థలుగా, ప్రభుత్వ పరంగా ప్రతి ఒక్కరి భాద్యతను గుర్తుచేసి అందరికీ కనువిప్పు కలిగించారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ ముగింపు సందేశంలో ఈ నాటి సాహిత్యకార్యక్రమం మనిషి తలుచుకుంటే జీవితంలో సాధించ లేనిది ఏదీ లేదనే నానుడికి ఈ విశిష్ట అతిథుల జీవితాలు ప్రత్యక్ష సాక్ష్యమని పేర్కొననారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు, సభ విజయానికి తోడ్పడిన కార్యకర్తలు, ప్రసార మాధ్యమాల నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.