Food

మనం తీసుకునేఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి

మనం తీసుకునేఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి

1. అర్ధ దోషం
2. నిమిత్త దోషం
3. స్ధాన దోషం
4. గుణ దోషం
5. సంస్కార దోషం
ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయి.

అర్ధ దోషం:ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒకవ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు. భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు. ఆ గదిలోనే శిష్యుడు దాచిన డబ్బు మూటవుంది. హఠాత్తుగా సాథువు మనసులో దుర్భుధ్ధి కలిగింది. ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తనసంచీలో దాచేశాడు. తర్వాత శిష్యుని వద్ద సెలవుతీసుకుని, తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. మరునాడు పూజా సమయంలో తను చేసినపనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు. తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దున్నే మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు. వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతాచెప్పి, ఆడబ్బును తిరిగిచ్చేసాడు శిష్యుడిని “ఏవృత్తి ద్వారా నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు?” అని అడిగాడు. శిష్యుడు తలవంచుకొని, “నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బుకాదు”. అని తలవంచుకొన్నాడు. ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం. మనంన్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం.

నిమిత్త దోషం:మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమగల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి.వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాకకూడదు. ఆహారంమీద దుమ్ము, శిరోజాలవంటివి పడకూడదు. అపరిశుభ్రమైన ఆహారం మనసుకిఅసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతివంట భుజిస్తే వారి దుష్టగుణాలు అవతలివారికి కలుగుతాయి.భీష్మాచార్యుల వారు కురుక్షేత్రయుధ్ధంలో బాణాలతో కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య మీద ప్రాణాలతోనేవున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీకృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడుమంచిమంచి విషయాలను బోధిస్తూ వచ్చాడు. అప్పుడు ద్రౌపదికి ఒక ఆలోచన కలిగింది. “ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించి నప్పుడు ఎందుకు ఎదిరించలేకపోయారు?”అని అనుకొన్నది. ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు, “అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూవచ్చాను. నా స్వీయబుధ్ధిని ఆ ఆహారం తుడిచిపెట్టింది. శరాఘాతాలతో, ఛిద్రమైన దేహంతో, ఇన్నిరోజులు ఆహారం తీసుకోనందున, ఒంట్లోఉన్న పాత రక్తం బిందువులుగా బయటికి పోయి నేను ఇప్పుడు పవిత్రుడినైనాను. నాబుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను” అన్నాడు భీష్ముడు. చెడ్డ గుణాలున్నవారు ఇచ్చింది తిన్నందువల్ల మనిషిలోని మంచి గుణములు నశించి ‘నిమిత్త దోషం’ ఏర్పడుతుంది.

స్ధాన దోషం:ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలుండాలి. వంటచేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాలవల్ల చేయబడిన వంట కూడా పాడైపోతుంది. యుధ్ధ రంగం, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంత మంచివికావు. దుర్యోధనుడు ఒకసారి 56 రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి, విదురుని యింటికి భోజనానికెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది. తినడానికి ఏమి పెట్టాలని ఆలోచించి, ఆనంద సంభ్రమాలతో తొందరపడి, అరటి పండు తొక్కవల్చి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, “విదురా! నేను ఆప్యాయతతో కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధాభక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏదిచ్చినా సంతోషంగా తీసుకుంటాను”అని అన్నాడు. కనుక మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి.

గుణ దోషం:మనం వండే ఆహారం సాత్వికఆహారంగా వుండాలి. సాత్వికాహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకికమాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది.

సంస్కారదోషం:ఆహారం వండేవారి సంస్కారాన్నిబట్టి దోషం ఏర్పడుతుంది. సంస్కారవంతుల చేతివంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతివంట లేని రోగాన్ని తెచ్చి పెడుతుంది.