జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. అటు కౌంటర్ గా ద్వారంపూడి అదే రేంజ్ లో ఫైరయ్యారు. ఇప్పుడు ఈ ఇష్యూలోకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిని రేపుతోంది. ఆయన నేరుగా పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ లేఖ రాయడం రాజకీయ వేడిని మరింత పెంచింది.
కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేసి రాజకీయంగా ఎదుగుతున్నారని ఇటీవల వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ముద్రగడ స్పందించారు. తాను కులాన్ని అడ్డుపెట్టుకుని నాయకుడిగా ఎదగలేదని స్పష్టం చేశారు. యువతను వాడుకొని భావోద్వేగాలు రెచ్చగొట్టడం లేదన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా ఉద్యమాలు చేయలేదని వివరణ ఇచ్చారు. కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని చంద్రబాబు పదే పదే చెప్పారన్నారు. రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి బాబు ద్వారా పవన్ కల్పించారని స్ట్రాంగ్గా బదులిచ్చారు.
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలను ముద్రగడ ఖండించారు. కాపు ఉద్యమానికి ద్వారంపూడి సహకరించారని గుర్తుచేశారు. పవన్ భాష సరిగా లేదన్నారు. వీధిరౌడీలా మాట్లాడటం సరికాదని సూచించారు. కాపు ఉద్యమానికి పవన్ ఎందుకు రాలేదని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడిపై పోటీ చేసి సత్తా ఏంటో చూపించాలని పవన్ కు సవాల్ చేశారు. మరి ముద్రగడ లేఖపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తి సర్వత్రా నెలకొంది.