ఉత్తరప్రదేశ్ లోని నోయిడా దేశంలోనే అత్యంత ఎత్తైన మాల్కు నిలయంగా మారనుంది. రియల్ ఎస్టేట్ సంస్థ సయా గ్రూప్, సాయా స్టేటస్ గా పిలువబడే సంస్థ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన మాల్ (Tallest Mall) ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నోయిడా – గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్వే లో సెక్టార్ 129లో సాయా గ్రూప్ దీనిని నిర్మిస్తుంది. 2025లో ఇది అందుబాటులోకి వస్తుందని అందరూ భావిస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం.. ఈ భవనం నిర్మాణంలో దాదాపు 25శాతం ఇప్పటికే పూర్తయింది.
భారీ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ మాల్ 150 అడుగుల ఎత్తులో తొమ్మిది అంతస్తులను కలిగి ఉంటుంది. ప్రతి అంతస్తులో లగ్జరీ బ్రాండ్లు కలిగి ఉంటుంది. అత్యాధునిక సౌకర్యాలతో నిండిఉండే ఈ మాల్ నిర్మాణంకోసం రెండువేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ తెలిపింది. సింగపూర్లో కార్యాలయాలతో కూడిన ప్రసిద్ద ఆర్కిటెక్చర్ సంస్థ డీపీ ఆర్కిటెక్ట్స్ ఈ భవన నిర్మాణం నమూనాను రూపొందించారు. కంపెనీ 70శాతం ప్రాంతాన్ని ఉంచుకోగా, 30శాతం పెట్టుబడిదారులకు విక్రయించబడుతుంది. రిటైల్ స్థలాన్ని చదరపు అడుగు రూ.16వేల నుంచి రూ. 40వేల వరకు విక్రయించనున్నట్లు సమాచారం.హైపర్ మార్కెట్ గ్రౌండ్ ప్లోర్ లో ఉంటుంది. మాల్లో నాలుగో ప్లోర్ నుండి తొమ్మిదవ అంతస్తు వరకు బహుళ స్థాయి పార్కింగ్ తో పాటు బేస్మెంట్ పార్కింగ్ ఉంటుంది. 1600 కార్లు పార్కింగ్ చేసుకొనేలా స్థలం ఉంటుంది. నోయిడా, ఢిల్లీలోని కొన్ని టాప్ రెస్టారెంట్లు కూడా ఈ మాల్లో తమ కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. మరికొన్ని ప్రసిద్ధ పబ్లు, బార్లకు కూడా ఈ మాల్లో అందుబాటులో ఉంటాయి.