WorldWonders

ఈ రైలుకు ఎన్ని బోగిలు ఉన్నాయో తెలుసా మీకు?

ఈ రైలుకు ఎన్ని బోగిలు ఉన్నాయో తెలుసా మీకు?

రైలులో ప్రయాణించడం అంటే ఎవరికైనా సరదాగానే ఉంటుంది. ఇక చిన్నపిల్లలైతే పట్టాలపై వెళుతున్న రైలును చూసి సంబరపడిపోతుంటారు. వారు ఆ రైలుకు ఎన్ని బోగీలు ఉన్నాయో లెక్కించే ప్రయత్నం చేస్తుంటారు. సాధారణంగా ఏదైనా రైలుకు 16 లేదా 17 బోగీల వరకూ ఉంటాయనే విషయం తెలిసిందే. కొన్ని రైళ్లకైతే ఈ సంఖ్య 20 నుంచి 25 వరకూ ఉంటుంది.

అత్యధిక బోగీలతో..ఇంతకన్నా అధికంగా బోగీలు కలిగిన రైలు గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ రైలు రెండు చివరలు చూడాలంటే 7.3 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత పొడవైన రైలు ఇదే. 24 ఈఫిల్‌ టవర్ల ఎత్తుకు ఈ రైలు పొడవు సమానంగా ఉంటుంది. ఈ రైలు వంద లేదా రెండు వందల బోగీలు ఉంటాయనుకుంటే పొరపాటు పడినట్టే. ఈ రైలుకు ఏకంగా 682 బోగీలు ఉంటాయి.

దీని బరువు ఎంతంటే..ఈ ఆశ్చర్యకరమైన రైలు పేరు ‘ది ఆస్ట్రేలియన్ బీహెచ్‌పీ ఐరన్ ఓర్’. ఇది గూడ్సు రైలు. ఈ గూడ్సు రైలు 2001, జూన్‌ 21న తొలిసారిగా పరుగు అందుకుంది. పొడవులోనే కాదు ఈ రైలు బరువులోనూ ముందుంటుంది. ఈ రైలు ముందుకు కదిలేందుకు మొత్తం 8 డీజిల్‌ లోకోమోటివ్‌ ఇంజిన్లు అవసరమవుతాయి. ఈ రైలు ఆస్ట్రేలియాలోని యాండీ మైన్‌ నుంచి హెడ్‌ల్యాండ్‌ మధ్య నడుస్తుంది. ఈ ఇరు గమ్యస్థానాల మధ్య దూరం 275 కిలోమీటర్లు. ఈ రైలు గమ్యస్థానాన్ని 10 గంటల్లో చేరుకుంటుంది. ఈ రైలు బరువు సుమారు లక్ష టన్నులు.

ప్రైవేటు రైల్వే లైను..‘ది ఆస్ట్రేలియన్ బీహెచ్‌పీ ఐరన్ ఓర్’ ఒక ప్రైవేటు రైల్వే లైన్‌. దీనిని ‘మౌంట్‌ న్యూమ్యాన్‌ రైల్వే’ అని కూడా అంటారు. ఈ రైలు నెట్‌వర్క్‌ ఐరన్‌ రవాణా కోసం డిజైన్‌ చేశారు. నేటికీ ఈ రైలు తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే దీని బోగీల సంఖ్యను తగ్గించారు. ప్రస్తుతం ఈ రైలుకు 250 బోగీలు తగిలిస్తుండగా, నాలుగు డీజిల్‌ లోకోమోటివ్‌ ఇంజన్లు రైలును ముందుకు లాగుతాయి.