NRI-NRT

భారతీయుల గ్రీన్‌కార్డులకు ప్రాధాన్యత ఇవ్వండి

భారతీయుల గ్రీన్‌కార్డులకు ప్రాధాన్యత ఇవ్వండి

అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్‌కార్డుల కోసం భారతీయుల నుంచి వచ్చే దరఖాస్తులకు ప్రాధాన్యమిచ్చి పరిష్కరించాలని అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు కోరారు. ఈ మేరకు రాజా కృష్ణమూర్తి, లేరీ బుక్‌షాన్‌ నేతృత్వంలో 56 మంది శాసనకర్తలు జో బైడెన్‌ సర్కారుకు లేఖ రాశారు. ప్రస్తుతం నిరీక్షణలో ఉన్న భారతీయులకు గ్రీన్‌కార్డులు రావాలంటే 195 ఏళ్లు నిరీక్షించాల్సి వస్తుందన్న విషయాన్ని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీనివల్ల దరఖాస్తుదారుల్లో నిరంతర అనిశ్చితి కనిపిస్తోందన్నారు. అత్యున్నత నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగ ప్రాతిపదికన ఇచ్చే వీసాల విషయంలో కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లి ఉపశమనం కల్పించాలని విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ను, అంతర్గత భద్రత విభాగాన్ని వారు కోరారు. చట్టబద్ధంగా అమెరికాకు రావాలనుకుంటున్నవారికి ఊరట ఇవ్వాలని కోరారు. చట్టబద్ధ వలస వ్యవస్థలో అధికార యంత్రాంగ అలసత్వం వల్ల వీసాలు పెండింగులో పడిపోయి.. ఉద్యోగాలు మారాలనుకున్నవారికి, వ్యాపారాలు ప్రారంభించేవారికి, అపరాధ రుసుం లేకుండా విదేశాలకు ప్రయాణించేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.

కోటా విధానంతోనే ఇబ్బందులు…దేశాలవారీగా గరిష్ఠంగా ఏడు శాతం కోటాను అమలు చేస్తున్న విధానం వల్ల భారత్‌ వంటి దేశాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దశాబ్దాలపాటు ఎదురుచూపులు తప్పడం లేదని ‘ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియా, ఇండియన్‌ డయాస్పొరా స్టడీస్‌’ (ఎఫ్‌ఐఐడీఎస్‌ యూఎస్‌ఏ) కూడా విడిగా జో బైడెన్‌కు విజ్ఞప్తి చేసింది. గ్రీన్‌కార్డు రాకపోవడం వల్ల యజమానుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితిలో దాదాపు 10 లక్షల మంది ఉన్నారని ‘ఇమ్మిగ్రేషన్‌ వాయిస్‌’ అధ్యక్షుడు అమన్‌ కపూర్‌ పేర్కొన్నారు.