Politics

వైకాపాకు భాజపా 9 ప్రశ్నలు

వైకాపాకు భాజపా 9 ప్రశ్నలు

 రాష్ట్రంలో బీజేపీ వైసీపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అప్పులు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, జాతీయ ప్రాజెక్టులపై ప్రశ్నలు సంధిస్తూ విరుచుకుపడుతున్నారు. ఇందుకు వైసీపీ సైతం కౌంటర్ ఇస్తోంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, విడదల రజిని, గుడివాడ అమర్నాథ్, ఆర్ కే రోజాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అంతేకాదు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి సైతం ధ్వజమెత్తుతున్నారు. పురంధేశ్వరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్‌లు చదువుతున్నారని వాస్తవాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. మరిది కళ్లల్లో ఆనందం చూడటమే పురంధేశ్వరి టార్గెట్‌ అన్నట్లుగా ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఆరోపణలకు బీజేపీ కౌంటర్ ఇస్తోంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ 9 ప్రశ్నలకు సమాధానమెక్కడ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అడిగిన ప్రశ్నలకు భయపడి, సమాధానం చెప్పలేని వైసీపీ నేతలు మంత్రులు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో బీజేపీ చేస్తున్న తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలని విష్ణువర్థన్ రెడ్డి సవాల్ విసిరారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విష్ణువర్థన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బాలల అక్రమ రవాణా విషయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ 3వ స్ధానంలో ఉందని దీనికి వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. తలసరి ఆదాయంలో దక్షిణాధిరాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ ఎందుకు వెనుకబడింది..వ్యవసాయం, ఆక్వా, ఉద్యానరంగం ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంలో ఎందుకు తలసరి ఆదాయం పెరగలేదో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీవారు. అంతేకాదు జలజీవన్‌ మిషన్‌ పథకాన్ని రాష్ట్రంలో ఎందుకు వినియోగించుకోలేదు? ఈ పథకానికి అయ్యే ఖర్చులో కేంద్రం ఇచ్చే ఆర్ధిక సహయాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు? ఎందుకు ప్రజలకు మంచినీటిని అందించలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం కేటాయించిన 25 లక్షల ఇళ్లను ఎందుకు నిర్మించి ఇవ్వలేకపోయారు? ఇళ్ల స్థలాల్లో వచ్చే కమిషన్‌ కోసం 30 లక్షల ఇళ్ల స్థలాలను సేకరించారు. ఇళ్లు నిర్మిస్తే కమిషన్‌ కాదు కాబట్టి ఆ పనిచేయలేదా? అని నిలదీశారు. రాష్ట్రంలో పేదలకు అందించే వైద్య సదుపాయాల విషయంలో ఎందుకు విఫలమయ్యారు? పట్టణ, గ్రామీణ వైద్య, ఆరోగ్యకేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, జనరల్‌ ఆసుపత్రుల్లో ఎందుకు వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు ? వైద్య పరీక్షలు అందుబాటులో లేవు? మందులు ఎందుకు ఇవ్వడం లేదు? వైద్యులు, వైద్య సిబ్బంది ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదు? అని ప్రశ్నించారు. ప్యానల్‌లో ఉన్న 80 శాతం కార్పొరేట్‌ ఆసుపత్రులు ఎందుకు ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం చేయడం లేదు? వారికి బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి నిలదీశారు. ఉన్నత విద్యను ఎందుకు నిర్ల్యక్షం చేశారు? పీజీ విద్యార్థులకు ఎందుకు ఉపకారవేతనాలు దూరం చేశారు. డిగ్రీలో తెలుగును రద్దుచేశారు. ఆంగ్లభాషకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వోద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదు? వర్శిటీల్లో ఉపన్యాసకులు, కళాశాలల్లో లెక్చరర్లను, పాఠశాలల్లో టీచర్లను ఎందుకు భర్తీచేయలేదు? ఖాళీగా ఉన్న 2.50 లక్షల బాక్‌లాగ్‌ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదో సమాధానం చెప్పాలని విష్ణువర్థన్ రెడ్డి నిలదీశారు. రాష్ట్రంలో ఛిద్రమైన రహదారులను ఉందుకు పునర్నిర్మించలేదు? వైసీపీ మంత్రులు కారుయాత్ర చేస్తే రోడ్ల పరిస్థితి తెలుస్తుంది అని విష్ణువర్థన్ రెడ్డి సూచించారు.

మంత్రులు ఏం చేస్తున్నారు?

తిరుపతిలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు చేసిన ద్రోహంపై, గుంటూరులో అమరావతి రైతులకు చేసిన అన్యాయంపై, పంచాయతీ నిధుల మళ్లింపుపై, రైతులకు రాయితీలు ఇవ్వకపోవడంపై, రాజమండ్రిలో అక్వా ఉత్పత్తుతులకు సహకారం ఇవ్వకపోవడం, విశాఖలో భూకబ్జాలు, దిగజారిన శాంతిభద్రతలు, పారిశ్రామిక అభివృద్ధిని పురందేశ్వరి ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది పోయి అమెను విమర్శించే మంత్రులు ముందుగా ఆయా శాఖలకు ఏం పనులు చేశారో, ఎంత వరకు అభివృద్ధి చేశారో చెప్పాలి? అని నిలదీశారు. విజయసాయిరెడ్డి విశాఖ అభివృద్ధికి ఏంచేశారు? రోజా పర్యాటక శాఖ అభివృద్ధికి ఏం చేశారు? అని నిలదీశారు. గుడివాడ అమర్నాధ్‌ ఎన్ని కొత్త పరిశ్రమలు తెచ్చారు? ఎంత మందికి ఉపాధి కల్పించారు? కోళ్ల గురించి ఎక్కువ అవగాహన ఉన్న అమర్నాధ్‌ కోళ్ల పరిశ్రమ పెట్టుకోవాలి అని సూచించారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఎంత మంది పీజీ విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇచ్చారు? 4 ఏళ్లలో డీఎస్సీ ద్వారా ఎందుకు భర్తీ చేయడం లేదో చెప్పాలని నిలదీశారు. హౌసింగ్‌లో రూ.1000 కోట్ల నిధులు దుర్వినియోగంపై ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. ‘మంత్రి విడదల రజని వైద్యఆరోగ్య వ్యవస్థను ఎంతగా బలోపేతం చేశారో చెప్పాలి. ఎయిమ్స్‌కు కనీసం నీటిని అందించలేకపోయారు. ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా ఏటా ఇచ్చే రూ.400 కోట్ల నిధులతో ఒక్కో మనిషికి రూ.5 లక్షల విలువైన వద్య సదుపాయం లభిస్తుంటే ఎందుకు దాని గురించి మాట్లాడరు? వైద్యకేంద్రాలు, పంచాయతీ భవనాలు, స్కూలు భవనాలు, ఆర్‌బీహెచ్‌లు, రహదారులు, పర్యాటక కేంద్రాలకు కేంద్రం ఇచ్చే నిధులతో తప్ప రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు’ అని నిలదీశారు. ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. 9 మంది లేదా 90 మందిని లేదా కట్టుకుని రండి. ఎక్కడి వస్తారో చెప్పండి. ఎప్పుడైనా చర్చకు సిద్దంగా ఉన్నాం అని సవాల్ విసిరారు. సమాధానం చెప్పకుంటే ప్రజాక్షత్రంలో తేల్చుకుంటాం. దిగుజారుడు వ్యాఖ్యలు మానేయాలి. మీ భాషను ప్రజలు ఛీ కొడుతున్నారు. 2024లో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించడం ఖాయం అని విష్ణువర్థన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.