NRI-NRT

శంషాబాద్ విమానాశ్రయంలో రాకపోకలు పెరుగుతున్న జనాభా సంఖ్య

శంషాబాద్ విమానాశ్రయంలో రాకపోకలు పెరుగుతున్న జనాభా సంఖ్య

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లేవారి సంఖ్య.. విదేశాల నుంచి వస్తున్న అతిథుల రాకపోకలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. జులై నెలలో 3.68 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు, 16.40 లక్షల మంది దేశీయ ప్రయాణికులకు ఇది సేవలందించిందని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కొద్దిరోజుల కిందట అధికారికంగా వివరాలను వెల్లడించింది. దేశంలోనే అత్యధిక విమాన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయాల్లో శంషాబాద్‌ నాలుగో స్థానంలో ఉంది. చెన్నై, కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయాలను వెనక్కి నెట్టి ఈ ఘనతను సాధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందినవారు దుబాయ్‌, అమెరికా, ఐరోపా దేశాలకు వెళ్లేందుకు శంషాబాద్‌ విమానాశ్రయాన్ని ఎంచుకుంటున్నారు.

ఏటా 3.4 కోట్ల మంది దిశగా: శంషాబాద్‌ విమానాశ్రయం ఏర్పాటైన అయిదున్నరేళ్లకే రద్దీ పెరగడం, పదిహేనేళ్లకు దాదాపు రెట్టింపు ప్రయాణికులు రాకపోకలు కొనసాగించడంతో ఏటా 3.4 కోట్ల మంది రాకపోకలకు అనుగుణంగా విస్తరిస్తున్నారు. ప్రస్తుతం నెలకు 20 లక్షల మంది అంతర్జాతీయ, దేశీయ ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోయిన అనంతరం ఇక్కడి నుంచి జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. ప్రధానంగా అమెరికాలో ఉన్నత విద్య చదివేందుకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. జులై, ఆగస్టు నెలల్లో ఈ విద్యార్థుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరుకుంది. 2-3 ఏళ్లుగా విదేశీ సంస్థల కార్యకలాపాలు పెరుగుతుండటంతో అంతర్జాతీయ విమాన సర్వీసులూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి 80కి పైగా దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన సర్వీసులున్నాయి.