Politics

జగన్‌కు లోకేశ్ లేఖ

జగన్‌కు లోకేశ్ లేఖ

గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్ వయోపరిమితి పెంచాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. వార్షిక జాబ్ క్యాలెండర్ జారీ చేయటంలో ప్రభుత్వం విఫలమైనందున తాజా నోటిఫికేషన్ గరిష్ట వయోపరిమితిని 44ఏళ్లకు పొడిగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్‌కు గురువారం లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలైన విధానాన్ని ఏపీలోనూ అమలు చేయాలని సీఎంకు లోకేశ్ హితవు పలికారు. 2019 నుంచి వార్షిక ఉద్యోగ క్యాలెండర్‌ విడుదల చేయటంలో ప్రభుత్వం విఫలమవుతూ రావటం దురదృష్టకరం అని అన్నారు. నిరుద్యోగ యువతకు తప్పుడు వాగ్ధానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారు అనిమండిపడ్డారు. గుడ్డిగా అసత్య వాగ్ధానాలు నమ్మి విశ్వసించిన యువత ఆశలపై అధికారంలోకి వచ్చాక కోలుకోలేని దెబ్బకొట్టారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రూప్ నోటిఫికేషన్ల పేరుతో మరో వంచన

గత నాలుగన్నరేళ్లుగా వార్షిక ఉద్యోగ క్యాలెండర్ లేక మోసపోయిన యువత ఎన్నో బాధలు అనుభవించారు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. నాలుగున్నరేళ్ల నిర్లక్ష్యం యువత భవితను నాశనం చేసింది అని మండిపడ్డారు. ఎన్నికలు దగ్గరపడుతున్నందున అకస్మాత్తుగా నిద్ర మేల్కొని గ్రూప్ నోటిఫికేషన్ల పేరుతో మరో వంచనకు సిద్ధమయ్యారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం జారీ చేసిన తాజా గ్రూప్1, గ్రూప్2 ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఎంతో మంది నిరుద్యోగ యువత అశలపై నీళ్లుచల్లుతోంది అని మండిపడ్డారు. నోటిఫికేషన్‌ల దరఖాస్తుకు ఎంతో మంది నిరుద్యోగ యువత అనర్హులవుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వయో పరిమితి నిబంధన కారణంగా దరఖాస్తు చేసుకోలేని యువతకు సడలింపు ఇవ్వాలి.తెలంగాణ రాష్ట్రం తరహాలో గరిష్ట వయోపరిమితిని కనీసం 44 సంవత్సరాలకు పెంచాలి. రాష్ట్ర యువతకు మీరు చేసిన మోసానికి పరిహారంగా అయినా వయోపరిమితి పెంచాలి’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z