Politics

తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశాం!

తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశాం!

ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసమే మొదటి సారిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని మర్యాద పూర్వకంగా కలిశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. మంగళవారం సాయంత్రం దిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy), భట్టి విక్రమార్క.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ భేటీ వివరాలు వెల్లడించారు.

‘‘పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం కోసం.. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన అనేక హామీలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. నీళ్లు, నిధులు నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ, విభజన చట్టంలోని హామీల విషయంలో గత ప్రభుత్వం తాత్సారం చేసింది. విభజన హామీలను త్వరితగతిన పరిష్కరించాలని కోరాం. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌ ప్రాజెక్టులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాం. తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. అందులో భాగంగా.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరాం.

ఐఐఎం, సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలని అడిగాం. నేషనల్‌ హైవేస్‌ అథారిటీకి సంబంధించి 14 ప్రపోజల్స్‌ అప్‌గ్రేడ్‌ కోసం పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే మంజూరు చేయాలని కోరాం. విభజన చట్టం ప్రకారం.. వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. వెంటనే మంజూరు చేసే విధంగా ఆర్థిక శాఖకు ఆదేశాలివ్వాలని కోరాం. భారాస నేతల ఆర్థిక అరాచకత్వం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయ్యింది. అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశాం. అన్ని అంశాలపై ప్రధాన మంత్రి సానుకూలంగా స్పందించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇస్తామన్నారు’’ అని భట్టి విక్రమార్క తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z