Devotional

భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు

భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు

నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు కిటకిటలాడాయి. ఏపీలోని తిరుమల, శ్రీశైలం, సింహాచలంతో పాటు తెలంగాణలో యాదాద్రి, వేములవాడ, భద్రాద్రి, బాసర తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచీ తరలివచ్చారు. స్వామివారి కృపాకటాక్షాలు తమపై ఉండాలని ప్రార్థించారు. దీంతో శ్రీవారి ఆలయ పరిసరాల్లో కోలాహలం నెలకొంది.

శ్రీవారిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దంపతులు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ దర్శించుకున్నారు. వారికి రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు గవర్నర్‌ తమిళిసై తెలిపారు.

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. కొత్త ఏడాది తొలి రోజు కావడం, మేడారం జాతరకు ముందుగా భక్తులు రాజన్నను దర్శించుకోవడానికి వస్తుండడంతో గర్భాలయంలో ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన భక్తులు.. స్వామి వారికి కోడె మొక్కులను చెల్లించుకుంటున్నారు. అనంతరం స్వామివారి దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని విశేష పూజలు నిర్వహించారు. కొత్త సంవత్సరం కలిసి రావాలంటూ వేడుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z