Fashion

71వ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం

71వ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం

భారత్‌కు అరుదైన అవకాశం లభించింది. 71వ ప్రపంచ సుందరి పోటీలకు (Miss World Pageant) ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఛైర్‌పర్సన్‌, సీఈఓ జూలియా మోర్లే (Julia Morley) అధికారిక ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. ‘‘మిస్‌ వరల్డ్‌ ఆతిథ్య దేశంగా భారత్‌ను ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అందం, వైవిధ్యం, సాధికారత కలగలిపిన ఈ అద్భుత వేడుకను ఆస్వాదించేందుకు సిద్ధమవ్వండి’’ అని రాసుకొచ్చారు. తాజా నిర్ణయంతో 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు భారత్‌ వేదికగా నిలుస్తోంది. చివరిసారిగా 1996లో బెంగళూరులో ఈ పోటీలు నిర్వహించారు.

1966లో భారత్‌కు చెందిన రీటా ఫారియా తొలిసారి ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత 1994లో ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, 1997లో డయానా హేడెన్‌, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్‌ ‘మిస్‌ వరల్డ్‌’గా ఎంపికయ్యారు. 2022లో చివరిసారిగా నిర్వహించిన పోటీల్లో పోలెండ్‌కు చెందిన కరోలినా బిలాస్కా విజేతగా నిలిచారు. ఈ ఏడాది గెలుపొందిన వారికి ఆమె ప్రపంచ సుందరి కిరీటాన్ని బహూకరించనున్నారు. ఈ ఈవెంట్‌లో 130కి పైగా దేశాల నుంచి పోటీదారులు పాల్గొని తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీ పడనున్నారు.

ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు దిల్లీలోని భారత్‌ మండపం, ముంబయిలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు నిర్వహించనున్నారు. ఫైనల్స్‌ ముంబయిలో జరగనున్నాయి. భారత్‌లోని విలువలు, భిన్నత్వంలో ఏకత్వం, గౌరవం, ప్రేమ, దయ, ఇవన్నీ ఈ ఈవెంట్‌ ద్వారా ప్రపంచానికి చూపించాలనుకుంటున్నట్లు మోర్లే తెలిపారు. సంప్రదాయ అందాల పోటీలకు అతీతంగా తొలిసారిగా మిస్‌ వరల్డ్‌ ఈవెంట్‌ను 1951లో నిర్వహించారు. కేవలం అందం మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో సానుకూల మార్పును తీసుకొచ్చే సామర్థ్యం, తెలివితేటలు ఉన్నవారిని గుర్తించి సత్కరించడం దీని ముఖ్య ఉద్దేశం. మార్చి 9న నిర్వహించే ఫైనల్‌ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z