తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నూతన భవన నిర్మాణం పూర్తయ్యే వరకు నటుడు మంచు విష్ణే అధ్యక్షుడిగా కొనసాగాలని హైదరాబాద్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సుమారు 400మంది సభ్యులు హాజరైన ఈ సమావేశంలో మేలో జరగాల్సిన ‘మా’ ఎన్నికలు, జులైలో జరగనున్న నిధుల సేకరణ కార్యక్రమం, ‘మా’ భవన నిర్మాణంలో కొనసాగుతున్న వివిధ ముఖ్యమైన విషయాలు చర్చకు వచ్చాయి. ఈ క్రమంలోనే ‘మా’ భవనం పూర్తయ్యే వరకు అధ్యక్షుడు విష్ణు నేతృత్వంలోని ప్రస్తుత కమిటీ పదవీకాలాన్ని పొడిగించాలనే ప్రతిపాదన వచ్చింది. దీనికి ప్రస్తుత సభ్యులందరి నుంచి ఏకగ్రీవ మద్దతు లభించింది. ఈ సందర్భంగా తమపై ఇంతటి విశ్వాసాన్ని ఉంచిన సభ్యులందరికీ మంచు విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. తనకు, తన ప్యానెల్కు అప్పగించిన బాధ్యతను గుర్తించి ‘మా’ సభ్యులందరి అభివృద్ధి, సంక్షేమం కోసం పాటు పడతామని ప్రతిజ్ఞ చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z