నలుపు, తెలుపు కలగలిపిన ఫ్యాబ్రిక్ ఏదైనా మార్కెట్లోకి వచ్చిదంటే అది కచ్చితంగా నాగాలాండ్ వస్త్రమే. అంతగా జనాల్లోకి వెళ్లింది నాగా సంస్కృతి. ఆ ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ.. నాగాలాండ్ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తున్నారు జెస్మినా జెలియాంగ్.నాగాలాండ్లోని దిమాపూర్లో పుట్టి పెరిగిన జెలియాంగ్.. ఉన్నత విద్యావంతురాలు. ఆమె తండ్రి లెఫ్టినెంట్ అన్వర్ హుస్సేన్. ఓసారి ఆమె సూరజ్కుండ్ వస్త్రమేళాకు వెళ్లారు. అక్కడ, కొందరు కొనుగోలుదారులు ఎంతో నాణ్యమైన నాగాలాండ్ వస్త్రాలను కొనకుండానే వెనుదిరగడాన్ని గమనించారు జెలియాంగ్. కారణం.. వాటి విలువ తెలియకపోవడమే. ఈ సంఘటన తనను ఆలోచింపజేసింది. ఫ్యాబ్ ఇండియా, సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ తదితర సంస్థలతో మాట్లాడి.. నాగాలాండ్ వస్త్రాన్ని దేశమంతటా పరిచయం చేశారు. వెదురు, చెరకు, గడ్డితో కూడిన టేబుల్వేర్ వస్తువులు, ఇతర ఫర్నిచర్ను దేశ, విదేశాల్లో విక్రయించడానికి ‘కేన్ కాన్సెప్ట్’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటుచేశారు. నలుపు-తెలుపు చీరలు,శాలువాలు, దుప్పట్లు, రగ్గులతో పాటు ఇతర వస్తువులకు ఎగ్జిబిషన్ల ద్వారా ప్రచారం కల్పించారు. అనేకానేక విదేశీ బ్రాండ్లకు నాగా వస్ర్తాలు, ఫర్నిచర్ ఎగుమతి చేస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు జెలియాంగ్.