Editorials

‘రాజీవ్‌’ నిందితుల విడుదలకు ‘సుప్రీం’ ఆదేశం

‘రాజీవ్‌’  నిందితుల విడుదలకు ‘సుప్రీం’ ఆదేశం

దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. నళినితో పాటు రాబర్ట్, రవిచంద్రన్, రాజా, శ్రీహరణ్‌, జైకుమార్‌లను విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. నళిని, ఆర్పీ రవిచంద్రన్‌లు దాఖలు చేసిన వ్యాజ్యంపై కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. రాజీవ్‌ హత్య కేసులో నళిని మురుగన్, సంతన్, ఏజీ పెరారివళన్, జయకుమార్, రాబర్ట్ పాయస్, పీ రవిచంద్రన్ అనే ఏడుగురు దోషులుగా ఉన్నారు. మేలో పెరారివళవన్ జైలు నుంచి విడుదలయ్యాడు.

అయితే మిగిలిన ఆరుగురు దోషులు తమిళనాడు జైళ్లలో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అదే తీర్పు ఆరుగురికి వర్తిస్తుందని జస్టిస్ బీఆర్ గవాయి, బీవీ నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కేసులో నిందితులందరూ 30 సంవత్సరాలకుపైగా జైలు శిక్ష అనుభవించారు. నిందితుల ప్రవర్తన సరిగా ఉండడంతో విడుదల చేయాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా.. 1991లో శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆత్మాహుతి దాడిలో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్యకు గురయ్యారు. రాజీవ్ గాంధీ పాదాభివందనం చేస్తున్నట్లుగా ఓ అమ్మాయి (థాను) వంగుతూ.. అదే సమయంలో వెంట తెచ్చుకున్న బాంబును పేల్చడంతో రాజీవ్‌ గాంధీతో పాటు మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.

1998లో పెరారివాళన్‌, నళిని సహా 26 మంది నిందితులకు హత్య కేసులో పాత్ర ఉందంటూ టాడా కోర్టు శిక్ష విధించింది. తర్వాత కొంత మంది నిందితులకు మరణ శిక్ష విధించారు. అయితే, 2014లో దోషులకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. ఇంతకు ముందు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు జే జయలలిత, ఎడప్పాడి కే పళనిస్వామి ఏడుగురు దోషులను విడుదల చేయాలని సిఫార్సు చేశారు. దోషులను విడుదల చేయాలని కోరుతూ తమిళనాడు సీఎం స్టాలిన్‌ రాష్ట్రపతికి లేఖ రాశారు.