Editorials

నిజాం సొమ్ము అధికారం ఎవరికి?

Who Will Get To Share Nizams 3.5Crore Pounds From London Bank

దేశ విభజన సమయంలో లండన్లోని ఓ బ్యాంకులో హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దాచిన 3.5 కోట్ల పౌండ్ల (దాదాపు రూ.300 కోట్లు) విషయంలో భారత్, పాకిస్థాన్ మధ్య దశాబ్దాలుగా నెలకొన్న న్యాయవివాదం బ్రిటన్ హైకోర్టులో కీలక దశకు చేరుకుంది. కొన్ని వారాల్లో తీర్పు రాబోతోంది. లండన్లోని నాట్వెస్ట్ బ్యాంక్ పీఎల్సీలో ఈ నిధులు ఉన్నాయి. 1948లో హైదరాబాద్ నిజాం నుంచి పాకిస్థాన్లోని బ్రిటన్ హై కమిషనర్కు 1,007,940 పౌండ్ల 9 షిల్లింగ్లు బదిలీ అయ్యాయి. నాడు పాక్లో చేరాలా లేక భారత్తో కొనసాగాలా అన్న సంశయంలో నిజాం ఉన్నారు. ఆ తర్వాత తన నిధులను తిరిగివ్వాలని ఆయన కోరినట్లు వార్తలు వచ్చాయి. ఆ సొమ్ము పెరుగుతూ 3.5 కోట్ల పౌండ్లకు చేరింది. ఈ డబ్బు తమకే చెందుతుందని నిజాం వారసులు ప్రిన్స్ ముకరంజా, ఆయన సోదరుడు ముఫఖంజాలు వాదిస్తున్నారు. దీనికి భారత్ మద్దతు పలుకుతోంది. పాక్ మాత్రం అది తమ సొమ్మేనంటోంది. ఆ డబ్బు.. నాడు భారత ‘దాడి’ నుంచి రక్షించుకోవడానికి హైదరాబాద్కు ఆయుధాల సరఫరా చేసినందుకు ఉద్దేశించిందని పాక్ ప్రభుత్వం వాదిస్తోంది. న్యాయమూర్తి జస్టిస్ మార్కస్ స్మిత్ ఈ కేసుపై రెండువారాల పాటు విచారణ సాగించారు. ఇరు పక్షాలు తమ వాదనలు వినిపించాయి. దాదాపు ఆరు వారాల్లో తీర్పు రావొచ్చని భావిస్తున్నారు. నిజాం ఉస్మాన్ అలీ ఖాన్కు చెందిన నిధులకు ‘లబ్ధిదారైన’ యజమాని ఎవరన్నది కోర్టు తేల్చాల్సి ఉంది. నిజాం వారసులిద్దరి వయసు 80 దాటింది. ‘‘తాత కానుకను అందుకోవడానికి ముకరంజా, ఆయన సోదరుడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల జరిగిన విచారణ తుది పరిష్కారానికి దారితీస్తుందని ఆశిస్తున్నాం’’ అని నిజాం వారసుల తరఫు వాదనలు వినిపిస్తున్న న్యాయ సంస్థ పేర్కొంది.