Agriculture

గోరుచిక్కుడుకు మంచి ఆదాయం ఉంటుంది

Soy Has Good Earning Potential In Telugu States

ప్రస్తుతం వర్షపాతం లోటు ఉన్నది. ఈ నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పటికీ నీటి ఎద్దడిని తట్టుకుని కచ్చిత దిగుబడి ఇచ్చే పంటల్లో ప్రధానమైంది గోరుచిక్కుడు. ఈ నెల చివరి వరకు సమృద్ధిగా వానలు పడకున్నా ఈ పంటను సాగు చేసుకోవచ్చు. గోరుచిక్కుడు కాయగూరగ, పశుగ్రాసంగా, జిగురు ఉత్పత్తి కోసం దేశవ్యాప్తంగా సాగులో ఉన్న పంట ఇది. వర్షాధారంగా అంతగా సారవంతం కాని భూముల్లోనూ బాగా పండుతుంది. నీటి ఎద్దడిని సమర్థవంతంగా తట్టుకుని నిలబడుతుంది. పశుగ్రాసం కోసం వరికి ప్రత్యామ్నాయంగా పూర్తిగా పశుగ్రాస పంటగా కూడా దీన్ని వాడుకోవచ్చు.
**గోరుచిక్కుడు పోషకాల గని కూడా. ఈ కాయ గింజల్లో 18 శాతం ప్రోటీన్, 32 శాతం పీచు పదార్థాలు, 30-33 శాతం జిగురు ఉంటుంది. భారత్ నుంచి విదేశాలకు ఉత్పత్తి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తుల్లో గోరు చిక్కుడు జిగురు ప్రధానమైనది. రాజస్థాన్ లాంటి నీటి ఎద్దడి రాష్ర్టాల్లోనూ రైతులకు మేలైన ఆదాయాన్ని అందిస్తున్న పంట. మన రాష్ట్రంలోని మిగ తా జిల్లాలతో పాటు తక్కువ వర్షపాతం నమోదయ్యే ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో ఈ పంట సాగు చేయడానికి అనుకూల వాతావరణం ఉన్నది.
*వాతావరణం
గోరు చిక్కుడు ఉష్ణమండల పంట. సాగు చేయడానికి వేడి వాతావరణం అవసరం. తొలిదశలో ప్రత్యేకించి మొలకెత్తే సమయంలో పంటకు 30-35 డిగ్రీ ల ఉష్ణోగ్రత అవసరం. శాఖీయ దశలో 32-38 డిగ్రీల ఉష్ణోగ్రత కావాలి. పూత దశలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే పంట పొడువుగా ఎదుగుతుంది. గాలిలో అధికంగా తేమతో ఆకు మాడు, వేరు కుళ్లు సమస్య ఎక్కువవుతుంది.
*నేల
ఉదజని సూచిక 7-8.5 మధ్య ఉండి మధ్యస్త, తేలికపాటి నేలల్లో ఈ పంట బాగా పెరుగుతుంది. నీటి నిల్వ ఉండే భూములు, నల్లరేగడి భూముల్లో ఈ పంటను వేయరాదు. అధికంగా తేమను అధికంగా నిలుపుకునే నేల ల్లో ఈ పంట వేయకపోవడమే మంచిది.
*నేల తయారీ
నేలలో నీళ్లు ఇంకే విధంగా తయారుచేయాలి. ముందుగా లోతు దుక్కి చేసి, ఆ తర్వాత రెండు, మూడుసార్లు దుక్కి చేయాలి. ఇది పప్పుధాన్యపు పంట. కాబట్టి భూమిలో నత్రజని ని స్థాపించి భూసారాన్ని పెంచుతుంది.
*విత్తనం నాటే సమయం
వర్షాధార ప్రాంతాల్లో జూలై చివరి నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ విత్తనం నాటడం పూర్తి చేయాలి. ఆ తర్వాత వేసే పంటలో దిగుబడి తగ్గిపోతుంది.
*విత్తటం
చాలామంది రైతులు విత్తనం వెదజల్లుతుంటారు. అయితే సిఫార్సు మేరకు ఎకరాలో నిర్దేశించిన మొక్కల సాంద్ర త ఉండేలా చేసేందుకు, అలాగే మొలక శాతం పెరిగేందుకు, అంతర సేద్యపు పనులకు వరుసలలో నాటాలి. శాఖలు, కొమ్మ లు ఉత్పత్తి చేసే రకాలను వరుసల మధ్య 50 సెం.మీ, మొక్కల మధ్య 10 సెం.మీ దూరంతో నాటుకోవాలి. ఏక కాండం ఉండే రకాలైతే వరుసల మధ్య 30 సెం.మీ దూరం సరిపోతుంది. నాగలితో లేదా సీడ్ డ్రిల్‌తో విత్తనం వేయాలి.
*విత్తన మోతాదు
ఎకరాకు 6 కిలోల చొప్పున విత్తనం వాడా లి. కిలోగ్రాము విత్తనానికి 4 గ్రాముల ట్రైకోడెర్మా లేదా 2 గ్రాముల కార్బండిజంతో శుద్ధి చేయాలి. ఆ తర్వాత రసం పీల్చే పురుగుల మందుతో శుద్ధి చేయాలి. సిఫార్సు చేసిన రైజోబియం జీవన ఎరువును కిలో విత్తనాలకు 40 గ్రాముల చొప్పున పట్టించాలి. 200 గ్రాముల బరువున్న రైజోబియం కల్చర్‌ను 250 గ్రాముల బెల్లం ద్రావకంతో కలిపి ఒక లీటరు నీటిలో ఉంచి ద్రావణం తయారుచేయాలి. అలాంటి రైజోబియం మిశ్రమ ద్రావణాన్ని విత్తనాలపై పొరగా ఏకరీతిగా పట్టించాలి. ఆ తర్వా త నీడలో అరగంట పాటు ఆరబెట్టాలి. 24 గంటలలోపు ఆరిన విత్తనాలను నేలలో విత్తాలి.
*ఎరువులు
ఇది పప్పుజాతి పంట. కాబట్టి తొలి దశలో కొద్దిమొత్తంలోనే ప్రారంభ సిఫార్సుగా నత్రజని అవసరం. హెక్టారు కు 20 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం అవసరం. వీటిని విత్తనం నాటేటప్పుడే వేయాలి. విత్తటానికి 15 రోజుల ముందు హెక్టారుకు 2.5 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు వేసుకోవాలి.
*నీటి యాజమాన్యం
ఉష్ణ, ఉప ఉష్ణ ప్రాంతాలలో గోరు చిక్కుడును పూర్తిగా వర్షాధారంగా పండించవచ్చు. అయితే పూత, విత్తనం ఏర్పడే దశలో నీటి ఎద్దడి ఉంటే ఒక నీటి తడిని తప్పకుండా ఇవ్వాలి. పంట వ్యర్థాలను హెక్టారుకు 3-5 టన్నుల చొప్పున వేస్తే నేలలో తేమ శాతం పెరుగుతుంది. వర్షాధార పరిస్థితులలో పంట విత్తిన 25, 45 రోజుల తర్వాత 0.1 శాతం థయోయూరియా పిచికారీ చేస్తే దిగుబడులు పెరుగుతాయి.
*కలుపు యాజమాన్యం
గడ్డి జాతి, వెడల్పాటి ఆకు జాతి కలుపు సమస్య వానకాలంలో ఎక్కువ. పంట తొలి 30-35 రోజులలో కలుపు నివారణ చేపట్టాలి. 25,45 రోజులలో రెండుసార్లు చేతితో కలుపు తీయాలి. కూలీల కొరత ఉంటే హెక్టారుకు 2.5-3.3 లీటర్ల పెండిమిథాలిన్ కలుపు మందును 500 లీటర్ల నీటిలో కలిపి విత్తనాలు నాటిన రెండు రోజుల్లో పిచికారీ చేయాలి. లేదా పంట విత్తిన తర్వాత 20-25 రోజులకు హెక్టారుకు 400 గ్రాముల చొప్పున ఇమజితాపిర్ కలుపు మందును 500 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేసి కూడా కలుపు నివారించవచ్చు.
**పంటను ఆశించే తెగుళ్లు-నివారణ
*బ్యాక్టీరియా తెగులు
ఐదు గ్రాముల స్ట్రెఫ్టోసైక్లిన్ లేదా 50 గ్రాముల ప్లాంటామైసిన్ 100 గ్రాముల నీటిలో కలిపి 35-40 రోజుల పంటకు హెక్టారులో పిచికారీ చేయాలి.
ఆల్టర్ నేరియా ఆకుమచ్చ: తెగులు లక్షణాలు గమనించిన వెంట నే హెక్టారుకు 2 కిలోల జినెబ్ శిలీంధ్ర నాశినిని 500 లీటర్ల నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
*బూడిద తెగులు
దీని నివారణకు హెక్టారుకు 20-25 కిలోలు పొడి గంధకం పౌడర్ లేదా 2-3 కిలోల తడి గంధకం లేదా లీటరుకు 1.5 మి.లీ. డినోక్యాప్ పిచికారీ చేయాలి.
*దిగుబడి
వర్షాధార పంటలో హెక్టారుకు 7-8 క్వింటాళ్లు. నీటి వసతిలో హెకార్టుకు 12-15 క్వింటాళ్లు. జిగురు పంట సాగు చేసే రైతులు ముందుగా కొనుగోలుదారులతో ముందస్తు ఒప్పందాలు చేసుకోవడం మేలు.
*విత్తనోత్పత్తి
గోరుచిక్కుడు స్వతహాగా స్వపరాగ సంపర్కం చెందే పంట. కాబట్టి రైతులు తమ స్థాయిలో సొంతంగా నాణ్యమైన విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. ఇది సులభం కూడా. అందుకు అంతకు ముందు కాలంలో గోరుచిక్కుడు పంట వేయని పొలా న్ని ఎన్నుకోవాలి. ఇతర రకాలకు కనీసం 10 మీటర్ల వేర్పాటుదూరం పాటించాలి. ఇతర రకాల మొక్కలు, తెగులు సోకిన మొక్కలు, కేళీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు కలుపు నివారణ చేపట్టాలి. కోత సమయంలో పంట చుట్టూ 5-10 మీటర్ల దూరం మొక్కలు వదిలి మిగిలిన మొక్క ల నుంచి విత్తనాలు సేకరించాలి. బాగా ఆరబెట్టిన కాయల నుంచి నేరుగా విత్తనాన్ని సేకరించి శుభ్రపరుచాలి. విత్తన తేమ శాతాన్ని 8-9 శాతానికి తీసుకురావాలి. అందుకు నీడలో ఆరబెట్టాలి. కార్బండింజతో శుద్ధి చేసిన విత్తనాలను సంచులలో, డబ్బాలలో నిల్వ చేసుకోవాలి. వీటిని ఆ తర్వాత కాలంలో విత్తనాలుగా వాడుకోవచ్చు. భారతీయ కనీస విత్తన చట్ట ప్రమాణాలను అందుకోవచ్చు. ట్రూత్‌ఫుల్ విత్తనాలుగా ఇతరులకు కూడా అమ్ముకొని ఆర్థికంగా లాభపడవచ్చు.