ScienceAndTech

ప్రతిరాత్రి గంటసేపు అశ్లీల చిత్రాలు చూస్తున్న భారతీయ యువత-సర్వే

Indian Youth Spending At least One Hour Before Bed On Porn Sites-ప్రతిరాత్రి గంటసేపు అశ్లీల చిత్రాలు చూస్తున్న భారతీయ యువత-సర్వే

నగర యువత భవితను ‘నీలి’నీడ కమ్మేస్తోంది. స్మార్ట్‌ ఫోన్ల నుంచి వచ్చే నీలి కాంతులు… పలు సైట్లలోని నీలి చిత్రాలు కుర్రాళ్లపై అటు ఆరోగ్యపరంగా… ఇటు ప్రవర్తన పరంగా విపరీత ప్రభావాన్ని చూపుతున్నాయి. కొందరు యువతీ, యువకుల మధ్య ఆకర్షణ కలగటానికి, పరిచయాలు పెరగటానికి ఈ ఫోన్లే కారణమవుతున్నాయి. గతంలో మార్కులు, ర్యాంకులు సాధించలేమని ఒత్తిడికి గురయ్యే యువత ఇప్పుడు క్షణకాలం ఫోన్లు ఆగినా, పెద్దలు ఆపేసినా గందరగోళానికి గురవుతున్నట్లు మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఓ సంస్థ దేశవ్యాప్తంగా యువత ఫోన్ల వినియోగంపై అధ్యయనం చేసింది. సుమారు 18,500 మందితో మాట్లాడి సర్వే నిర్వహించింది. వారిలో 80 శాతం మంది ప్రతిరోజూ 3- 7 గంటలు సామాజిక మాధ్యమాల కోసం వెచ్చిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో 2,500 మందితో నిర్వహించిన అభిప్రాయ సేకరణలోనూ సగానికిపైగా 4 గంటల వరకూ కేటాయిస్తామని వివరించారు.

* స్మార్ట్‌ఫోన్‌ వినియోగించే వారు ప్రతిరోజూ సగటున 63 సార్లు ఫోన్‌ చూస్తారు.
* మరో సంస్థ నిర్వహించిన సర్వేలో పోర్న్‌సైట్ల్‌కు బానిసలైన రాష్ట్రాల్లో తెలంగాణ 30వ స్థానంలో ఉంది. నగరాల్లో హైదరాబాద్‌ రెండోస్థానంలో ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
* అధికారిక లెక్కల ప్రకారం 10 లక్షలకు పైగా పోర్న్‌సైట్లు ఉంటాయని అంచనా. ఇటీవల చిన్నారులపై లైంగిక దాడులు పెరగటానికి పోర్న్‌సైట్లు ఓ కారణమని ఓ వైద్యనిపుణుడు విశ్లేషించారు.
* మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ప్రతికూల ఆలోచనలు, ఒంటరితనం, జీవితంపై నిరాశ ఇవన్నీ అలవడేందుకు ఫోన్‌ను ఎక్కువగా వాడటమే కారణమంటున్నారు. ఈ ధోరణిని అదుపు చేయకపోతే వ్యక్తిగత ఆరోగ్యం, సామాజిక భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

‘మా అబ్బాయి/అమ్మాయికి ఎవరైనా ప్రేమికులు ఉన్నారా?… నా దగ్గరకు కౌన్సెలింగ్‌ కోసం పిల్లల్ని తీసుకువచ్చే అధికశాతం తల్లిదండ్రుల మొదటి అనుమానం ఇది’ అని కన్నవారు పడుతున్న ఆందోళనను ఓ సైకియాట్రిస్టు గుర్తు చేశారు. పిల్లలు నిద్రలోకి జారుకున్నాక వారి ఫోన్లను చాలామంది పెద్దలు తనిఖీ చేస్తున్నారని, చుట్టూ జరుగుతున్న సంఘటనలను తమ బిడ్డలకు ఆపాదించుకుని మనోవేదనకు గురవుతున్న కన్నవారినీ తాను గమనించానని తన అనుభవాన్ని వివరించారు.
* ‘మా దగ్గర చదివే విద్యార్థులు కోర్సుల్లో ఉత్తీర్ణులు అవుతారా! ఉద్యోగాలు సంపాదిస్తారా! అనే దానికంటే.. కళాశాలలో ఉన్నంత సేపూ స్మార్ట్‌ ఫోన్లు వాడకుండా వారిని కట్టడి చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తోంది’ అని ఓ ప్రముఖ కళాశాల ప్రిన్సిపల్‌ ఆవేదన వెలిబుచ్చారు.
* తల్లిదండ్రులు తనకు సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని ఓ డిగ్రీ విద్యార్థి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐదు నెలల క్రితం ఎస్‌ఆర్‌నగర్‌లో ఏడోతరగతి విద్యార్థిని సెల్‌ఫోన్‌లో మునిగి చదువును నిర్లక్ష్యం చేస్తోందని తల్లి మందలించింది. ఆ బాలిక భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎవరితోనే సెల్‌ఫోన్‌లో మాట్లాడుతోందని తండ్రి మందలించగా… అదే రోజు నగర శివార్లలో డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.
* కొందరు పదోతరగతి విద్యార్థుల దగ్గర ఖరీదైన ఫోన్లు ఉన్నాయి… ఎలా కొన్నార్రా వాటిని! అని అడిగితే ఉదయం వేళల్లో పేపర్లు, పాల ప్యాకెట్లు వేసి, ఆ వచ్చిన డబ్బుతో అని చెప్పారు. పిల్లలు శ్రమ విలువ తెలుసుకున్నారని సంతోషిస్తే… క్రమంగా ఆ ఫోన్లే వారిని పెడదారి పట్టిస్తున్నాయి… అని ఓ ప్రైవేటు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వాపోయారు.
* ఫోన్లు చూడకుండా విద్యార్థులను కట్టడి చేయటం అంత తేలిక కాదని ఓ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. ఇటీవల గంజాయి రవాణా చేస్తూ చిక్కిన విద్యార్థుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్‌ఫోన్లలో భారీగా అశ్లీల వీడియోలున్నట్లు ఆయన వివరించారు.